పుంగనూరు: ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో గానీ, తరువాత గానీ ఎలాంటి అల్లర్లు సృష్టించినా అణచి వేస్తానని అల్లరిమూకలకు ఎస్పీ మణికంఠ చందవోలు గట్టి వార్నింగ్ ఇచ్చారు. శనివారం పట్టణ పురవీధుల్లో సాయుధ దళాలతో మాబ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పురవీధులలో కవాతు చేపట్టారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. గెలిచినా, ఓడినా గ్రామాల్లో రెచ్చగొట్టే చర్యలు ఎవరూ చేపట్టరాదని హెచ్చరించారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లో పకడ్బందీగా సమాచారం సేకరిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఎన్నికల సందర్భంగా ర్యాలీలు, విజయోత్సవాలను రద్దు చేయడం జరిగిందన్నారు. ముందు జాగ్రత్తగా 144 సెక్షన్ అమలులో కొనసాగిస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఏఆర్ ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ రఘువీరప్రసాద్, సీఐ రాఘవరెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.