ఓట్ల లెక్కింపు కేంద్రంలో ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు
Published
Sun, May 26 2024 3:40 AM
జిల్లా ఎన్నికల అధికారి ఎం అభిషిక్త్ కిషోర్
రాయచోటి: ఓట్ల లెక్కింపు కేంద్రంలో ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లు చేపట్టాలని అన్నమయ్య జిల్లా ఎన్నికల అధికారి ఎం.అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం రాయచోటిలోని ఓట్ల లెక్కింపు కేంద్రమైన సాయి ఇంజినీరింగ్ కళాశాలలో రాజంపేట లోక్సభ, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ఏర్పాట్లను ఆయన జిల్లా ఎస్పీ కృష్ణారావులతో కలిసి పరిశీలించారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి వచ్చే అభ్యర్థులకు, సిబ్బందికి, ఏజెంట్లకు, పోలీసులకు కౌంటింగ్ కేంద్రంలో వారికి కేటాయించిన గదులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్లేందుకు అవసరమైన సూచికల బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ గదులలో ఏజెంట్లు కూర్చోవడానికి ఎంపిక చేసిన స్థలానికి బారికేడింగ్ పటిష్టంగా అమర్చాల్ననారు. కౌంటింగ్ కేంద్రానికి బయట మీడియా కేంద్రాన్ని, ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు. జూన్ 4న జరగబోయే కౌంటింగ్ ప్రక్రియ నిరంతరాయంగా జరిగేలా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ సత్యనారాయణరావు, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్ఓలు, ఏఆర్ఓలు, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.