మహిళపై దాడి ఘటనలో కేసు

గాయపడిన నాగరాజ 
 - Sakshi

కలకడ : మహిళపై దాడి చేసిన భార్య, భర్తపై కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ తిప్పేస్వామి తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు..మండలంలోని బాలయ్యగారిపల్లె పంచాయతీ యర్రయ్యగారిపల్లెకు చెందిన రేవూరి.రెడ్డెప్ప భార్య సరస్వతిని ఇంటి స్థలం విషయంగా అదే గ్రామానికి చెందిన యర్రయ్యగారి.ఆనంద అతని భార్య శశికళ కలిసి దుర్బాషలాడారని, కొట్టి గాయపరిచినట్లు బాధితురాలు బుద్ధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు యర్రయ్యగారి.ఆనంద, అతని భార్య శశికళ పై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

వివాహిత ఆత్మహత్యకేసులో భర్త, అత్త అరెస్ట్‌

మదనపల్లె : కుటుంబసమస్యలతో భర్తతో గొడవపడి ఈనెల 13న పట్టణంలోని అయోధ్యనగర్‌కు చెందిన వివాహిత మౌనిక(28) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో మౌనిక తండ్రి కేశవరెడ్డి ఫిర్యాదుమేరకు దర్యాప్తు చేసిన టూటౌన్‌ ఎస్‌ఐ వెంకటేష్‌ నిందితులైన మౌనిక భర్త నీలకంఠారెడ్డి, అత్త కృష్ణవేణమ్మ లను బుధవారం అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.

బైక్‌ల ఢీ : వ్యక్తికి తీవ్రగాయాలు

బి.కొత్తకోట : మండలంలోని శంకరాపురం వద్ద బుధవారం రెండు ద్విచక్రవాహనాలు ఎదురుగా ఢీకొన్నాయి. ములకలచెరువు మండలం వేపూరికోట నుంచి సుదర్శన్‌రెడ్డి(21) బైక్‌లో బెంగళూరు వెళుతున్నాడు. గౌనిపల్లె వైపు నుంచి బి.కొత్తకోటకు వస్తున్న మరో బైక్‌ ఢీకొంది. ప్రమాదంలో సుదర్శన్‌ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మదనపల్లెకు తీసుకెళ్లారు.

ఆటో ఢీకొని..

మదనపల్లె : ద్విచక్రవాహనంలో వస్తుండగా, ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొని వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం మదనపల్లె మండలంలో జరిగింది. మదనపల్లె కొత్త ఇండ్లు ప్రాంతానికి చెందిన వెంకటరమణ కుమారుడు వి.నాగరాజ(32) పెయింటర్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. వ్యక్తిగత పనుల్లో భాగంగా పుంగనూరు నుంచి మదనపల్లెకు ద్విచక్రవాహనంలో వస్తుండగా, జ్యూస్‌ఫ్యాక్టరీ సమీపంలో ఆటో ఢీకొంది. ప్రమాదంలో నాగరాజు తీవ్రంగా గాయపడగా, ఆటో ఆపకుండా వెళ్లిపోయింది. గమనించిన స్థానికులు బాధితుడ్ని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Annamayya News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top