ఉత్సాహంగా ఓటింగ్..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు నెలలపాటు నిప్పులు కురిపించిన సూరీడు శాంతించాడు. వాతావరణం చల్లగా మారింది. ఐదేళ్లకొకసారి వచ్చే అతిపెద్ద ఎన్నికల పండుగకు ఓటర్లు పోటెత్తారు. సోమవారం ఉదయం ఆరుగంటల నుంచే పోలింగ్ కేంద్రాల వైపు అడుగులు వేశారు. ఈసారి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, నూతన ఓటర్లు, సాధారణ ఓటర్లు అందరూ బాధ్యతగా కదిలారు. ఊతకర్ర చేతపట్టి కొందరు.. శక్తిని కూడదీసుకుని ఇతరుల సహాయంతో మరికొందరు.. వీల్చైర్లు.. మూడుచక్రాల సైకిళ్లపై ఇంకొందరు.. ఇలా ప్రతి ఒక్కరూ ఉల్లాసంగా.. ఉత్సాహంగా కదిలొచ్చారు. ఓటు విలువను గుర్తెరిగి మన భవిష్యత్తుకు భరోసా ఇచ్చే వారు ఎవరో నిర్ణయించుకుని ఓటు వేశారు. ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా తమ మదిలో ముద్రితమైన అభ్యర్థి–పార్టీకి ఈవీఎంపై బటన్ నొక్కారు. – సాక్షి బృందం