● సీఎం బస్సు యాత్రకు బ్రహ్మరథం ● పాయకరావుపేటలో ఘనంగా స్వాగతం ● హారతులిచ్చి దీవించిన మహిళలు ● జగనన్నను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు
మోగనున్న సమర శంఖం
సాక్షి, అనకాపల్లి, నక్కపల్లి : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. సంక్షేమం, అభివృద్ధి రెండు చక్రాలుగా రాష్ట్ర అభ్యుదయ రథాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర శుక్రవారం రాత్రి అనకాపల్లి జిల్లాలో అడుగుపెట్టింది. రాత్రి 9 గంటలకు సీఎం బస్సు యాత్ర జిల్లా సరిహద్దు పాయకరావుపేటకు చేరుకుంది. వేలాది మంది పార్టీ శ్రేణులు జాతీయ రహదారిపైకి వచ్చి సీఎం జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలికారు. కనోసా పాఠశాల నుంచి పోలీస్స్టేషన్ వరకు అర కిలోమీటరు దూరంలో ఉన్న జాతీయరహదారి పైకి చేరుకుని ఇరువైపులా నిలుచుని పార్టీ శ్రేణులు, యువకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు జగనన్నకు ఘన స్వాగతం పలికారు. తనను చూడడానికి వేలాదిగా తరలివచ్చిన జన సందోహానికి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సుపై నుంచి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు, ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడులను ప్రజలకు బస్సుపై నుంచే పరిచయం చేస్తూ రెండు చేతులు జోడించి ముందుకు సాగారు. వై జంక్షన్లో మహిళలు హారతులివ్వడంతో పాటు గుమ్మడికాయలపై దీపాలు వెలిగించి దిష్టి తీసి జగనన్న బస్సుయాత్ర ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి కావాలని, మే 13న జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి కావాలని దీవించారు. రాత్రి 9 గంటల సమయంలో కూడా పాయకరావుపేట పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుంచి వేలాది మంది తరలిరావడంతో జాతీయ రహదారి జన సంద్రమైంది. జై జగన్.. జైజై జగన్, మళ్లీ నువ్వే సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేశారు. పాయకరావుపేటలో బస్సుయాత్రకు స్వాగతం పలికినవారిలో పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, అనకాపల్లి ఎంపీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎంఎస్ఎంఈ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు, జిల్లా పబ్లిక్ వింగ్ అధ్యక్షుడు దగ్గుపల్లి సాయిబాబా, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు ధనిశెట్టి బాబూరావు, ఎంపీపీ ఇసరపు పార్వతి తాతారావు, జెడ్పీటీసీ సభ్యుడు లంక సూరిబాబు, ఎస్.రాయవరం మండల అధ్యక్షుడు బోలిశెట్టి గోవింద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దత్తుడు సీత బాబు తదితరులు ఉన్నారు.
గొడిచర్ల వద్ద రాత్రి బస
పాయకరావుపేట నుంచి నక్కపల్లి మండలం గొడిచర్ల జాతీయరహదారి పక్కన ఏర్పాటు చేసిన వసతి వద్ద సీఎం జగన్మెహన్రెడ్డి రాత్రి బస చేశారు. గొడిచర్ల వద్ద రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ, పార్టీ మండల అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థి ఈర్లె అనూరాధ, సర్పంచ్ అల్లు రమణ, వైస్ ఎంపీపీలు వీసం నానాజీ, వెలగా ఈశ్వరరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు పాపారావు, మణిరాజు, బీసీ సెల్ అధ్యక్షుడు గొర్ల బాబూరావు, సర్పంచ్లు భార్గవ్, సురేష్ వర్మ, సాదిరెడ్డి శ్రీను, ఎంపీటీసీ తిరుపతిరావు, గోవిందు ఆధ్వర్యంలో వందలాది మంది సీఎం బస్సు యాత్రకు స్వాగతం పలికారు.
● నేడు జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో సీఎం జగన్ యాత్ర
● 70 కిలోమీటర్ల మేర రోడ్ షో
● కశింకోట మండలం చింతలపాలెం వద్ద భారీ బహిరంగ సభ
● చిన్నయ్యపాలెం వద్ద సీఎం రాత్రి బస
సీఎం బస్సుయాత్ర జిల్లాలో శనివారం ఉదయం పాయకరావుపేట నియోజకవర్గం దొడ్డిగల్లు నుంచి ప్రారంభమై నాలుగు నియోజకవర్గాల్లో జరగనుంది. సార్వత్రిక ఎన్నికలకు తెరలేచిన తరువాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు, పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు.
సీఎం పర్యటన ఇలా...
సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శనివారం ఉదయం 9 గంటలకు పాయకరావుపేట నియోజకవర్గం గొడిచెర్ల నుంచి ప్రారంభమవుతుంది. ఉద్దండపురం, కాగిత, సీతంపాలెం, నక్కపల్లి, అడ్డరోడ్డు, పులపర్తి, రేగుపాలెం, యలమంచిలి బైపాస్ మీదుగా మధ్యాహ్నం 12.30 గంటలకు అచ్యుతాపురంలో గల లంచ్ పాయింట్ క్యాంప్కు చేరుకుంటారు. అనంతరం కశింకోట మండలం నరసింగపల్లి సమీపంలోని చింతలపాలెం వద్ద బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు జరిగే బహిరంగ సభలో సీఎం వై.ఎస్ జగన్ ప్రసంగిస్తారు. అనంతరం తాళ్లపాలెం జంక్షన్, బయ్యవరం, కశింకోట, కొత్తూరు, అనకాపల్లి జంక్షన్–1, జంక్షన్–2, శంకరం, రేబాక, మర్రిపాలెం టోల్గేట్, దేవీపురం, అస్కపల్లి మీదుగా రాత్రి 8.30 గంటలకు సబ్బవరం మండలంలోని చిన్నయ్యపాలెంలో గల టెర్రకాన్ రాయల్ వెంచర్ వద్దకు చేరుకుని అక్కడ రాత్రి బస చేయనున్నారు.