చింతూరు: మండలంలోని చట్టి వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంకు చెందిన దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. నాలుగు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది నాలుగు ద్విచక్ర వాహనాలపై సీతారాముల దర్శనం నిమిత్తం రావులపాలెం నుంచి భద్రాచలం బయలుదేరారు. ఈ క్రమంలో వారు చింతూరు మండలం చట్టి వద్ద మలుపు తిరుగుతున్న క్రమంలో వెంకటకృష్ణ, శైలజ దంపతులు నడుపుతున్న వాహనం అదుపుతప్పి కింద పడడంతో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారికి సపర్యలు అందించగా, అదే సమయంలో చింతూరు వస్తున్న డిప్యూటీ డీఎంహెచ్వో పుల్లయ్య తన కారులో చింతూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వారిని రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు డాక్టర్ పుల్లయ్య తెలిపారు.
మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడిన బైక్ : ఇద్దరికి తీవ్ర గాయాలు
పెదబయలు: మండలంలోని సీతగుంట గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో జెడ్పీ పాఠశాల రోడ్డు జంక్షన్ వద్ద బైక్ అదుపు తప్పి ఇద్దరి యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. విజయనగరం జిల్లా గంట్యాడ గ్రామానికి చెందిన టెంకాని సాయి, పి.విజయ్ పాడేరు నుంచి ముంచంగిపుట్టు వెళ్తున్నారు. ఈ క్రమంలో మలుపు వద్ద ఒక్క సారిగా బైక్ స్కిడ్ అయి అదుపు తప్పడంతో సాయికి కుడి కాలు విరిగింది. విజయ్కు ముఖం, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పెదబయలు పీహెచ్సీకి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.