అడ్డతీగల: అనారోగ్యంతో నాలుగేళ్ల కిందట భార్య మృతిచెందింది. అప్పటి నుంచి కొడుకే సర్వస్వంగా జీవిస్తున్నాడు... కుమారుడికి అనారోగ్యంగా ఉండడంతో వైద్యం చేయించేందుకు తీసుకొచ్చాడు. అంతలోనే వారిని మృత్యువు కబళించింది. అడ్డతీగల మండలం దుప్పులపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల తెలిపిన వివరాలు... అడ్డతీగల మండలం వెదుళ్లకొండకి చెందిన మడకం బాబూరావు(28) భార్య నాలుగేళ్ల కిందట అనార్యోగంతో మృతిచెందినప్పటి నుంచి కుమారుడు ప్రదీప్ సాయి(4) లోకంగా జీవిస్తున్నాడు. కుమారుడికి అనారోగ్యంగా ఉండడంతో వైద్య కోసం వరసకు వదిన అయిన కుంజం రామయ్యమ్మను సాయంగా తీసుకొని మడకం బాబూరావు మోటార్ సైకిల్పై అడ్డతీగల తీసుకువచ్చాడు. వైద్యం అనంతరం వారపు సంతలో నిత్యావసరాలు కొనుగోలు చేసుకుని తిరిగి స్వగ్రామం వెదుళ్లకొండ బయలుదేరారు. అడ్డతీగల మండలం అనిగేరుకి చెందిన పిట్టా మంగిరెడ్డి మోటార్ సైకిల్పై అడ్డతీగల వైపు వస్తుండగా దుప్పులపాలెం సుద్ద గండి వద్ద అదుపుతప్పి రెండు మోటార్ సైకిళ్లు ఢీ కొన్నాయి. దీంతో తీవ్రంగా గాయపడిన బాబూరావు సంఘటనా స్థలంలోనే మరణించాడు. తీవ్రగాయాలపాలైన ప్రదీప్ సాయి, పిట్టా మంగిరెడ్డి, స్వల్పంగా గాయపడిన రామయ్యమ్మను 108 వాహనంలో అడ్డతీగల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లన ప్రదీప్ సాయి ప్రాణాలు విడిచాడు. పిట్టా మంగిరెడ్డికి కంటి, తల భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. అడ్డతీగల సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు. ఇతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అడ్డతీగల ఎస్ఐ అప్పలరాజు సంఘటనాస్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకుల మృతి
మరొకరికి తీవ్రగాయాలు
దుప్పులపాలెం సమీపంలో ఘటన