నేరడిగొండ: తమ కుమారుడు విద్యను అభ్యసించి ఉన్నతస్థితికి చేరాలనే ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు తమకు దూరంగా వసతిగృహంలో ఉంచి చదివిస్తున్నారు. ఇన్ని రోజుల పాటు పుస్తకాలతో కుస్తీ పడ్డ ఆ విద్యార్థి సెలవులు రావడంతో సంతోషపడ్డాడు. తన తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా జ రిగిన రోడ్డు ప్రమాదంలో అనంతలోకాలకు చేరుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పంచగుడి గ్రామానికి చెందిన సంజయ్ (12) ఇచ్చోడలోని సాంఘిక సంక్షేమ ఎస్సీ వసతిగృహంలో ఆరోతరగతి చదువుతున్నాడు. సోమవారం నుంచి సెలవులు ప్రకటించడంతో తండ్రి బాబుతో కలిసి బైక్పై ఇంటికి బయల్దేరాడు. నేరడిగొండ మండలంలోని లఖంపూర్ జాతీయ రహదారి వద్ద గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స నిమిత్తం 108లో నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనలో విద్యార్థి తండ్రికి సైతం స్వల్పగాయాలయ్యాయి.