-
కిడ్నీ వ్యాధితో ఊరు ఖాళీ
తాంసి: చుట్టూ పచ్చని అటవీ ప్రాంతం.. ప్రశాంతమైన వాతావరణం. కాలుష్యానికి ఏమాత్రం తావులేదు. గ్రామంలో ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉంది. సీసీ రోడ్లు, డ్రెయినేజీ లైన్లు, విద్యుత్ సౌకర్యం తదితర వసతులు న్నాయి. కానీ సరైన రక్షిత నీటి సరఫరా లేదు. ఇప్పుడదే తీవ్రమైన సమస్యగా మారింది. గ్రామస్తుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఎంతలా అంటే ఏ ఒక్క కుంటుంబం కూడా మిగలకుండా ఊరు ఖాళీ చేసి వెళ్లిపోయేంతగా..! విధిలేని పరిస్థితుల్లో భూగర్భ జలాలనే తాగునీటిగా వినియోగిస్తున్న గిరిజనుల్లో పలువురు కిడ్నీ (మూత్రపిండాలు) సంబంధిత వ్యాధుల బారిన పడటం, ఇటీవలి కాలంలో మరణాల సంఖ్య పెరగడమే ఇందుకు కారణం. గడిచిన మూడేళ్లలో ఈ వ్యాధి బారిన పడి 12 మంది మృత్యుఒడికి చేరారు. గ్రామంలోని చేద బావులు, చేతిపంపుల నీటిని తాగడం వల్లే తమ కిడ్నీలు పాడవుతున్నాయని ఆందోళనకు గురవుతున్న భీంపూర్ మండలం కమట్వాడ గ్రామ పంచాయతీ పరిధిలోని గోవింద్పూర్ గిరిజనులంతా గ్రామాన్ని ఖాళీ చేసి మరో చోటికి వెళ్లిపోయారు. హామీలిచ్చి మరిచిపోయారు ఆదిలాబాద్ జిల్లా గోవింద్పూర్ గ్రామంలో 40 ఆదివాసీ గిరిజన కుటుంబాలు (200 మంది జనాభా) ఉన్నాయి. వారికి తాగునీటి వసతి సరిగ్గా లేదు. మిషన్ భగీరథ నీరు పూర్తిస్థాయిలో రావడం లేదు. దీంతో గ్రామంలోని రెండు చేతి పంపులతో పాటు చేద బావుల నీటినే గిరిజనులువినియోగించే వారు. అయితే గడిచిన మూడేళ్లలో వరుసగా కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణాలు సంభవిస్తుండటంతో వారిలో ఆందోళన మొదలైంది. యువకులు సైతం వ్యాధుల బారిన పడుతుండటంతో ఊరు వదిలి వెళ్లడం ప్రారంభించారు. ఈ విషయాన్ని గమనించిన ‘సాక్షి’ 2022 నవంబర్ 4న ‘ఊరొదిలిపోతున్నారు..’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. దీంతో కొందరు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు వైద్య సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. గ్రామాన్ని విడిచి వెళ్లవద్దని, గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, అవసరమైన వైద్య పరీక్షలు చేస్తామని భరోనా ఇచ్చారు. కానీ హామీలేవీ నెరవేరలేదు. క్రమంగా జబ్బుపడే వారి సంఖ్య, మరణాలు పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వారు ఊరు ఖాళీ చేసి పక్కనే ఉన్న అడవి సమీపంలో గుడిసెలు వేసుకున్నారు. ఇక్కడ వారికి ఎలాంటి వసతులు లేవు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో గుడ్డి దీపాలతో నెట్టుకొస్తున్నారు. సమీపంలోని వ్యవసాయ బావి నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఇతర అవసరాల కోసం పక్కనున్న చెరువు, వాగు నీటిని వినియోగిస్తున్నారు. నీటిలో అధికంగా భార మూలకాలు ‘సాక్షి’ కథనంతో స్పందించిన హైదరాబాద్లోని ఐసీఎంఆర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం భీంపూర్ వైద్య సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. గిరిజనుల రక్త, మూత్ర నమూనాలు, గ్రామంలోని చేతిపంపుల నుంచి నీటిని సేకరించి హైదరాబాద్ ల్యాబ్లో పరీక్షలు నిర్వహించారు. నీటిలో భార మూలకాల శాతం అధికంగా ఉందని, ఈ కారణంగానే కిడ్నీ సంబంధిత వ్యాధులు సోకుతున్నాయని అప్పట్లోనే ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ అప్పట్నుంచీ ఇప్పటివరకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సమస్య తీవ్రత చెప్పినా పట్టించుకోలేదు బోరు బావి నీటిని తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలకు, కిడ్నీ వ్యాధులకు గురవుతున్నామని అధికారులకు మొర పెట్టుకున్నాం. దీంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, మిషన్ భగీరథ నీరు సక్రమంగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిన్నర గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. – జమునబాయి, మాజీ సర్పంచ్, గోవింద్పూర్ భార్యను బతికించుకోవాలనుకున్నా కానీ.. నా భార్య కుమ్ర భీంబాయి అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లా. అక్కడ పరిక్షించిన వైద్యులు కిడ్నీ సమస్య ఉందని చెప్పారు. దీంతో ఆమెను బతికించుకునేందుకు రెండేళ్ల కిందటే మా గ్రామాన్ని వదిలేసి పక్కనే ఉన్న జెండా గూడకు వలసవెళ్లాం. కానీ కొన్నాళ్లకే ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించి చనిపోయింది. ఇప్పుడు నా ప్రాణాన్ని కాపాడుకునేందుకు గ్రామానికి దూరంగా ఉంటూ, వ్యవసాయ పనులు కూడా ఇక్కడి నుంచే చేసుకుంటున్నా. – కుమ్ర పరశురాం, గోవింద్పూర్ గ్రామస్తుడు మరోసారి వైద్య పరీక్షలు చేస్తాం గోవింద్పూర్ గ్రామాన్ని వైద్య సిబ్బందితో కలిసి సందర్శించి అక్కడి పరిస్థితిపై అధ్యయనం చేస్తాం. స్థానికులు గ్రామాన్ని విడిచివెళ్లిన విషయం ఇప్పటికే మా దృష్టికి వచ్చింది. గతంలో ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో పరీక్షలు చేశాం. మరోసారి నీటి పరీక్షలతో పాటు గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – నిఖిల్ రాజ్, భీంపూర్ మండల వైద్యాధికారి -
పోలీసులు X గిరిజనులు
సత్తుపల్లి: గిరిజన వర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన సత్తుపల్లి పోలీసులపై గిరిజనులు దాడికి దిగారు. ఘటన పూర్వాపరాలిలా.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు శివారు చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలోని 400 హెక్టార్లలో కొంతకాలంగా స్థానిక గిరిజనులు, స్థానికేతర గిరిజనుల మధ్య పోడు వివాదం నడుస్తోంది. గిరిజనులకు నేతృత్వం వహిస్తున్న కూరం మహేంద్రను అటవీశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు శనివారం సత్తుపల్లి పోలీస్స్టేషన్కు సీఐ టి.కిరణ్ పిలిపించి విచారించి పంపించారు. ఈక్రమంలో చంద్రాయపాలెంకు చెందిన గిరిజనులు ఆదివారం ఉదయం డయల్ 100కు ఫోన్ చేసి స్థానికేతర గిరిజనులు తమ భూముల్లోకి వస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో తొలుత ఎస్సై రాజు, ముగ్గురు పోలీసు సిబ్బంది వెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న సమాచారంతో సీఐ టి.కిరణ్ మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి చేరుకున్నారు. సీఐ కిరణ్పై మెరుపుదాడి.. అదే సమయంలో గిరిజన నేత కూరం మహేంద్ర ఫోన్లో మాట్లాడుతుండగా, ‘నిన్ననే కదా నీతో మాట్లాడి పంపించింది.. మళ్లీ గొడవ ఏమిటి’ అంటూ సీఐ కిరణ్ ఆయన ఫోన్ స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఇంతలో ఒక్కసారిగా గిరిజన మహిళలు కోపోద్రిక్తులై సీఐ కిరణ్ను చుట్టుముట్టి పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు. ఘటనా స్థలంలో ఉన్న కానిస్టేబుళ్లు పి.నర్సింహారావు, ఇమ్రాన్, సత్యనారాయణ, నరేష్ కలిసి సీఐ కిరణ్ను కాపాడుకునే ప్రయత్నంలో చుట్టూ రక్షణ కవచంలా నిలిచి పోలీస్ వ్యాన్ వైపు తీసుకొస్తుండగా గిరిజనులు కర్రలతో వెంబడించి దాడి చేశారు. అతి కష్టంమీద అక్కడి నుంచి సీఐ కిరణ్ను పోలీసులు తీసుకొని బయ టపడ్డారు. ఈ ఘటనలో సీఐ కిరణ్ చొక్కా చిరిగిపోయింది. పోలీస్ పికెట్ ఏర్పాటు విషయం తెలుసుకుని కల్లూరు ఏసీపీ రఘు, రూరల్ సీఐ వెంకటేశం, డివిజన్లోని ఎస్సైలు, పెద్ద సంఖ్యలో సిబ్బంది చంద్రాయపాలెం బయలుదేరారు. మార్గమధ్యలో బుగ్గపాడు శివారులో పోలీసులపై దాడి చేసిన గిరిజనులు గుంపులుగా వస్తుండగా పోలీసులు వారిని చుట్టుముట్టారు. గిరిజనులు ప్రతిఘటించటంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పి కూరం మహేంద్రతో సహా గిరిజనులను అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
ఖమ్మం చంద్రాయపాలెంలో ఉద్రిక్తత.. పోలీసులపై గిరిజనుల దాడి
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లా చంద్రాయపాలెంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుంది. పోడుభూముల విషయంలో గిరిజన వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గిరిజనుల దాడిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే అడ్డుకున్న పోలీసులపైనే గిరిజనలు దాడికి దిగారు. పోలీసులపై పెద్దసంఖ్యలో గిరిజనులు దాడికి పాల్పపడ్డారు. ఈ క్రమంలో సతత్తుపల్లి సీఐ కిరణ్, నలుగురు సిబ్బదికి గాయాలు అయ్యాయి. బుగ్గపాడు, చంద్రాయపాలెం గిరిజనుల మధ్య పోడు భుమూల విషయంతో ఘర్షణ చోటు చేసుంది. ఈ ఘర్షణను అడ్డగించిన పోలిసులను వెంటపడి మరీ గిరిజనలు కర్రలతో కొట్టారు. ఒక్కసారిగా అక్కడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతంగా మారింది. -
ఈ హోలీ రంగులను హాయిగా తినవచ్చు!
ముంబైకి చెందిన ఇద్దరు సోదరుల ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నెటిజనులను ఆకట్టుకుంటోంది. గౌరంగ్, సౌరభ్ అనే సోదరులు ‘మాంక్స్ బూఫీ’ బ్రాండ్పై ‘అబీర్ హోలి కలర్స్’ పేరుతో సహజ రంగులను మార్కెట్లోకి తీసుకువచ్చారు. పువ్వులు, మొక్కజొన్న పిండి... మొదలైన వాటితో భిల్ తెగ గిరిజనులు తయారు చేసిన ఈ రంగులను తినవచ్చు కూడా! -
బస్తర్లో భయం భయం!
తాండ్ర కృష్ణ గోవింద్, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, తలపై రూ.కోటి రివార్డు ఉన్న కీలక నేత హిడ్మా స్వగ్రామం పువ్వర్తిలో కేంద్ర భద్రతా దళాలు క్యాంప్ నెలకొల్పాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు– భద్రతా దళాల మధ్య సాగుతున్న పోరును తెలుసుకునేందుకు ‘సాక్షి’ బస్తర్ అడవుల బాటపట్టింది. అన్నలు విధించిన ఆంక్షలు, పారామిలటరీ చెక్ పాయింట్లను దాటుకుంటూ వెళ్లి వివరాలు సేకరించింది. జవాన్లు, అధికారులతోపాటు మావోయిస్టుల ప్రత్యేక పాలన (జనతన సర్కార్)లో నివసిస్తున్న ప్రజలతో ‘సాక్షి’ ప్రతినిధి మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనపై ప్రత్యేక కథనం.. ముందు, వెనక ప్రమాదం మధ్య.. బస్తర్ దండకారణ్యం పరిధిలోకి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుకుమా, దంతెవాడ,బస్తర్ జిల్లాలు వస్తాయి. ఇక్కడి ప్రజలు రెండు రకాల పాలనలో ఉన్నారు. వారి జీవన స్థితిగతులను తెలుసుకునేందుకు ‘సాక్షి’ మీడియా బృందం ప్రయత్నించింది. ముందుగా భద్రాద్రి జిల్లా చర్ల మీదుగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పామేడుకు.. అక్కడి నుంచి సుక్మా జిల్లా పువ్వర్తికి వెళ్లింది. ఈ మార్గంలో ఎవరితో మాట్లాడినా.. వారి కళ్లలో సందేహాలు, భయాందోళన కనిపించాయి. కొండపల్లి వద్ద కొందరు గ్రామస్తులు మీడియా బృందాన్ని అడ్డుకున్నారు. ఎవరి అనుమతితో వచ్చారంటూ గుర్తింపు కార్డులు అడిగి తీసుకున్నారు. సాయంత్రందాకా పలుచోట్లకు తీసుకెళ్లారు. తర్వాత ఓ వ్యక్తి వచ్చి ‘‘మీరంతా మీడియా వ్యక్తులే అని తేలింది. వెళ్లొచ్చు. ప్రభుత్వం తరఫునే కాకుండా ఇక్కడి ప్రజల కష్టాలను కూడా లోకానికి తెలియజేయండి’’ అని కోరాడు. అంతేగాకుండా ‘‘ఈ ప్రాంతంలోకి వచ్చేముందు అనుమతి తీసుకోవాల్సింది. అటవీ మార్గంలో అనేకచోట్ల బూబీ ట్రాప్స్, ప్రెజర్ బాంబులు ఉంటాయి. కొంచెం అటుఇటైనా ప్రాణాలకే ప్రమాదం’’ అని హెచ్చరించాడు. దీంతో మీడియా బృందం రాత్రికి అక్కడే ఉండి, మరునాడు తెల్లవారుజామున పువ్వర్తికి చేరుకుంది. అక్కడ భద్రతా దళాల క్యాంపు, హిడ్మా ఇల్లును పరిశీలించింది. అయితే భద్రతాపరమైన కారణాలు అంటూ.. ఫొటోలు తీసేందుకు, వివరాలు వెల్లడించేందుకు పారామిలటరీ సిబ్బంది అంగీకరించలేదు. ఆ పక్క గ్రామంలో హిడ్మా తల్లి ఉందని తెలిసిన మీడియా బృందం వెళ్లి ఆమెను కలిసి మాట్లాడింది. తిరిగి వస్తుండగా నలుగురు సాయుధ కమాండర్లు అడ్డగించారు. బైక్లపై తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్లను చూసిన ఓ తెలుగు జవాన్ కల్పించుకుని.. ‘‘మీరు కొంచెం ముందుకొచ్చి ఉంటే.. మా వాళ్లు కాల్చేసేవారు’’ అని హెచ్చరించాడు. అదే దారిలో నేలకూలిన ఓ పెద్ద చెట్టును కవర్గా చేసుకుని బంకర్ నిర్మించారని, అందులో సాయుధ జవాన్లు ఉన్నారని, జాగ్రత్తగా వెళ్లాలని చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య మీడియా బృందం సాధ్యమైనన్ని వివరాలు సేకరించి తిరిగి చర్లకు చేరుకుంది. జనతన్ సర్కార్ ఆధీనంలో.. బీజాపూర్ జిల్లా పామేడు నుంచి చింతవాగు, ధర్మారం, జీడిపల్లి, కవరుగట్ట, కొండపల్లి, బట్టిగూడెం మీదుగా పువ్వర్తి వరకు 60 కిలోమీటర్ల ప్రయాణం సాగింది. పామేడు, ధర్మారం గ్రామాల వరకే ఛత్తీస్గఢ్తోపాటు ప్రభుత్వ పాలన కనిపిస్తుంది. అక్కడివరకే పోలీస్స్టేషన్, ప్రభుత్వ ఆస్పత్రి, అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాల వంటివి ఉన్నాయి. తర్వాత చింతవాగు దాటి కొద్దిదూరం అడవిలోకి వెళ్లగానే జనతన సర్కార్కు స్వాగతం పలుకుతున్నట్టుగా మావోయిస్టులు హిందీలో చెక్కలపై రాసి చెట్లకు తగిలించిన బోర్డులు వరుసగా కనిపించాయి. జనతన సర్కార్ ఆ«దీనంలోని ఈ ప్రాంతాల్లో ఎక్కడా బీటీ రోడ్డు లేదు. ఎటు వెళ్లాలన్నా కాలిబాట, ఎడ్లబండ్ల దారులే ఆధారం. పోడు భూములు.. స్తూపాలు జనతన సర్కార్ ఆ«దీనంలోని గ్రామాల్లో మావోయిస్టులు తవ్వించిన చెరువులు, పోడు వ్యవసాయ భూములు, రేకుల షెడ్లలోని స్కూళ్లు కనిపించాయి. కానీ ఎక్కడా తరగతులు నడుస్తున్న ఆనవాళ్లు లేవు. అక్కడక్కడా కొందరు టీచర్లు కనిపించినా మాట్లాడేందుకు నిరాకరించారు. అక్కడక్కడా సంతల్లో హెల్త్ వర్కర్లు మాత్రం కనిపించారు. పరిమితంగా దొరికే ఆహారం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా స్త్రీలు, పిల్లల్లో పోషకాహర లోపం కనిపించింది. అయితే గతంలో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని వారు చెప్పారు. ఏ గ్రామంలోనూ గుడి, చర్చి, మసీదు వంటివి లేవు. జనతన సర్కార్లో మతానికి స్థానం లేదని స్థానికులు చెప్పారు. కొన్నిచోట్ల చనిపోయినవారికి గుర్తుగా నిలువుగా పాతిన బండరాళ్లు, మావోయిస్టుల అమరవీరుల స్తూపాలు మాత్రమే కనిపించాయి. బస్తర్ అడవుల్లో, ఇతర ప్రాంతాల్లో ఇప్పసారా, లంద, చిగురు వంటి దేశీ మద్యం దొరుకుతుంది. కానీ జనతన సర్కార్ ఆ«దీనంలోని ప్రాంతాల్లో ఎక్కడా మద్యం ఆనవాళ్లు కనిపించలేదు. చాలా మందికి ఆధార్ కార్డుల్లేవు జనతన సర్కార్ పరిధిలోని గ్రామాల్లో సగం మందికిపైగా తమకు ఆధార్కార్డు, ఓటర్ గుర్తింపుకార్డులు లేవని చెప్పారు. వారికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అంతంతగానే దక్కుతున్నాయి. పువ్వర్తి సమీపంలోని మిర్చిపారా గ్రామానికి చెందిన మడకం సంజయ్ మాట్లాడుతూ.. ‘‘రేషన్ బియ్యం తీసుకుంటున్నాం. అది కూడా మా గ్రామాలకు పది– ఇరవై కిలోమీటర్ల దూరంలో జనతన సర్కార్కు ఆవల ఉండే మరో గ్రామానికి వెళ్లి రెండు, మూడు నెలలకు ఓసారి తెచ్చుకుంటాం..’’ అని చెప్పాడు. ఇక ఎన్నికల ప్రక్రియపై పటేల్పారా గ్రామానికి చెందిన నందా మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ చాలా గ్రామాలకు నామ్ కే వాస్తే అన్నట్టుగా సర్పంచ్లు ఉన్నారు. ఎక్కువ మంది ఎన్నికలను బహిష్కరిస్తారు. అయినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుండటంతో.. సమీప పట్టణాల్లో నివాసం ఉండేవారు నామినేషన్ దాఖలు చేస్తారు. వారిలో ఒకరు సర్పంచ్ అవుతారు. కానీ చాలా గ్రామాల్లో వారి పెత్తనమేమీ ఉండదు. పరిపాలనలో గ్రామ కమిటీలదే ఆధిపత్యం..’’ అని వివరించాడు. సమష్టి వ్యవసాయం చాలా ఊర్లలో ట్రాక్టర్లు కనిపించాయి. వాటికి రిజిస్ట్రేషన్ నంబర్లు లేవు. ఆ ట్రాక్టర్లను ఊరంతా ఉపయోగించుకుంటారని తెలిసింది. ఇక్కడి ప్రజలకు ఎలాంటి విద్యుత్ సౌకర్యం లేదు. అంతా దట్టమైన అడవి అయినా ఎక్కడా అటవీ సిబ్బంది ఛాయల్లేవు. ఇటీవలికాలంలో చేతిపంపులు, సోలార్ లైట్లు వంటివి కనిపిస్తున్నాయి. వినోదం విషయానికొస్తే.. సంప్రదాయ ఆటపాటలతో పాటు కోడిపందేలను ఆదివాసీలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నాం ఇక్కడి ప్రజలకు రక్షణ కల్పించేందుకు, ప్రభుత్వం తరఫున సేవలు అందించేందుకు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని పువ్వర్తి వద్ద విధులు నిర్వర్తిస్తున్న సుక్మా జిల్లా ఏఎస్పీ గౌరవ్ మొండల్ చెప్పారు. ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో సర్వే చేపట్టి తాగునీరు, విద్యుత్, స్కూల్, ఆస్పత్రి వంటి సౌకర్యాలు, ఇతర ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. అయితే క్యాంపుల ఏర్పాటులో ఉన్న వేగం ప్రభుత్వ పథకాల అమల్లో కనిపించడం లేదేమని ప్రశి్నస్తే.. క్షేత్రస్థాయిలో పరిస్థితులే అందుకు కారణమన్నారు. ఇక క్యాంపుల ఏర్పాటు సమయంలో ఆదివాసీలు భయాందోళన చెందినా, తర్వాత శత్రుభావం వీడుతున్నారని మరో అధికారి తెలిపారు. ఈక్రమంలోనే జనతన సర్కారులోకి చొచ్చుకుపోగలుతున్నామన్నారు. ఇప్పటికీ మావోయిస్టులదే పైచేయి.. ప్రభుత్వ బలగాలు ఎంతగా మోహరిస్తున్నా ఇప్పటికీ అడవుల్లో మావోయిస్టులదే ఆధిపత్యం. దీనిపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘ఇక్కడి ప్రజలకు ఆటపాటలే ప్రధాన వినోద సాధనాలు. మావోయిస్టులు చేతన నాట్యమండలి వంటివాటి ద్వారా ఇక్కడి ప్రజల్లో విప్లవ భావాలను రేకెత్తిస్తారు. పిల్లలకు ఏడేళ్లు దాటగానే గ్రామ కమిటీల్లో చోటు కల్పించి, భావజాలాన్ని నేర్పుతారు. మావోయిస్టుల పట్ల ఎవరైనా వ్యతిరేకత చూపితే ప్రమాదం తప్పదనే భయాన్ని నెలకొల్పారు’’ అని ఆరోపించారు. హిడ్మా అడ్డాలో క్యాంపు వేసి.. పువ్వర్తి జనాభా 400కు అటుఇటుగా ఉంటుంది. అందులో దాదాపు వంద మంది మావోయిస్టు దళాల్లో ఉన్నారు. వీరిలో హిడ్మా కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరుకోగా.. ఆయన సోదరుడు దేవా బెటాలియన్ కమాండర్గా ఉన్నారు. పువ్వర్తిలో హిడ్మా కోసం ప్రత్యేక సమావేశ మందిరం, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండేవి. అక్కడికి కొన్ని అడుగుల దూరంలోనే హిడ్మా సొంతిల్లు ఉంది. ప్రస్తుతం ఇవన్నీ భద్రతా దళాల ఆధీనంలో ఉన్నాయి. ఆధునిక పరికరాల సాయంతో వందల మంది కార్మికులు క్యాంపు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. ఇటీవలి వరకు రోడ్డుకూడా లేని ఈ గ్రామంలోకి ఇప్పుడు పదుల సంఖ్యలో లారీల్లో వస్తుసామగ్రి, రేషన్ తరలించారు. బుల్డోజర్లు, పొక్లెయినర్లు నిర్విరామంగా తిరుగుతున్నాయి. సీఆర్పీఎఫ్, స్పెషల్ టాస్్కఫోర్స్, డి్రస్టిక్ట్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్ ఇలా వివిధ దళాలకు చెందిన సుమారు ఐదు వేల మంది సిబ్బంది మోహరించారు. గ్రామం నలువైపులా గుడారాలు, బంకర్లు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యలో మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు.. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్యాంపులు తమకు ఇబ్బందిగా మారుతున్నాయని చాలా మంది ఆదివాసీలు అంటున్నారు. కొండపల్లికి చెందిన మడావి మాట్లాడుతూ.. ‘‘క్యాంపులు ఏర్పాటైన తర్వాత మా గ్రామాల్లోకి వచ్చే భద్రతాదళాలు విచారణ పేరుతో జబర్దస్తీ చేస్తున్నాయి. రాత్రీపగలు తేడా లేకుండా కాల్పుల శబ్దాలు వినవస్తున్నాయి. విచారణ పేరిట ఎవరైనా గ్రామస్తుడిని తీసుకెళ్తే.. తిరిగి వచ్చే వరకు ప్రాణాలపై ఆశలేనట్టే. అందుకే భద్రతా దళాలు వస్తున్నట్టు తెలియగానే పెద్దవాళ్లందరం అడవుల్లోకి పారిపోతున్నాం’’ అని చెప్పాడు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని మరో గ్రామస్తుడు మాట్లాడుతూ.. ‘‘స్థానికులమైన మాకు భద్రతాదళాల నుంచి కనీస మర్యాద లేదు. అభివృద్ధి పేరిట అడవుల్లోకి వస్తున్నవారు గ్రామపెద్దల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు..’’ అని పేర్కొన్నాడు. -
అరణ్యానికి ఆసరా
అడవులనూ, ఆదివాసీలనూ రక్షించుకోవటం అంటే మానవాళి తనను కాపాడుకోవటమేనని బ్రెజిల్ పర్యావరణవేత్త చికో మెండిస్ ఏనాడో చెప్పిన మాట. దాన్ని విస్మరించటం ఎంత అనర్థదాయకమో, అది చివరకు ఎటువంటి విపరిణామాలకు దారితీస్తుందో పాలకులు గ్రహించటం లేదు. కనుకనే అడవుల నిర్వచనానికి సంబంధించినంతవరకూ నిఘంటు అర్థానికీ, 1996లో తాము వెలువరించిన తీర్పునకూ తు.చ. తప్పకుండా కట్టుబడివుండాలని మొన్న సోమవారంనాడు సర్వోన్నత న్యాయ స్థానం చెప్పవలసి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు కావస్తున్నా మన దేశంలో ‘అడవి’కి నిర్దిష్టమైన నిర్వచనం లేదు. దేశంలో అటవీభూముల విస్తీర్ణం ఎంతో స్పష్టమైన, సమగ్రమైన రికార్డు కూడా లేదు. ఒక అంచనా ప్రకారం మన దేశంలో మొత్తం ఎనిమిది లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులున్నాయి. ఇది మరో 1,540 చదరపు కిలోమీటర్ల మేర పెరిగిందని మూడేళ్ల క్రితం కేంద్రం ప్రకటించింది. అయితే 1980 నాటి అటవీ సంరక్షణ చట్టానికి నిరుడు ఆగస్టులో తీసుకొచ్చిన సవరణల వల్ల ఆ చట్టం పరిధి కుంచించుకుపోయిందనీ, ఫలితంగా 1,97,000 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతానికి ముప్పు ఏర్పడిందనీ పిటిషనర్లు ఆరోపించారు. వివాదాస్పదమైన 1ఏ నిబంధన అటవీప్రాంతంగా రికార్డుల్లో వుండి 1980–96 మధ్య చట్టబద్ధంగా అటవీయేతర ప్రయోజనాలకు వినియోగిస్తున్న భూములు, అంతర్జాతీయ సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలోవుండి వ్యూహా త్మక అవసరాలకు వినియోగపడే ప్రాంతం ఈ చట్టం పరిధిలోనికి రాదని చెబుతోంది. అలాగే మావోయిస్టు ప్రాంతాల్లో ఆంతరంగిక భద్రతకై చేపట్టే నిర్మాణాల కోసం అయిదు హెక్టార్ల వరకూ అటవీయేతర భూమిగా రికార్డుల్లోవున్న ప్రాంతాన్ని సేకరించవచ్చని చెబుతోంది. ఇక జూ, సఫారీ వంటి అవసరాల కోసం కూడా ఈ తరహా భూమిని తీసుకోవచ్చని వివరిస్తోంది. అడవులే అయిన ప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వంవల్లనో, మరే ఇతర కారణంవల్లనో రికార్డుల్లోకి ఎక్కని భూముల న్నిటికీ ఈ చట్టసవరణవల్ల ముప్పు ఏర్పడుతుందని పిటిషనర్ల వాదన. ఈ కేసులో సుప్రీంకోర్టు వెలు వరించిన తాత్కాలిక ఆదేశాల పర్యవసానంగా 1980 నాటి అటవీ సంరక్షణ చట్టం నిబంధనలూ, 1996లో సర్వోన్నత న్యాయస్థానం టీఎన్ గోదావర్మన్ కేసులో ఇచ్చిన ఆదేశాలూ వర్తిస్తాయి. అడవులను సంరక్షించాలని పర్యావరణవేత్తలు కోరినప్పుడల్లా అభివృద్ధి మాటేమిటన్న ప్రశ్న వినబడుతూ వుంటుంది. ఆ రెండూ పరస్పర విరుద్ధాలన్నట్టు... ఒకటి కోల్పోతేనే రెండోది సాధ్యమ న్నట్టు మాట్లాడతారు. ఇది సరికాదు. ఏ కారణంతో అడవుల్ని హరించినా అది ఆత్మవినాశనానికే దారితీస్తుంది. అడవులంటే కేవలం వృక్షాలు మాత్రమే కాదు... అక్కడుండే ఆదివాసులూ, ఆ అడవిని ఆలంబనగా చేసుకుని జీవించే వన్యమృగాలతో సహా సమస్త జీవరాశులూ కూడా! అడవులను ధ్వంసం చేసినప్పుడు ఆవాసం కరువై వన్యమృగాలు జనావాసాల్లోకి చొరబడతాయి. ఆదివాసులు జీవిక కరువై ఇబ్బందుల్లో పడతారు. ఇవన్నీ కొట్టొచ్చినట్టు కనబడేవి. కానీ పర్యావరణానికి కలిగే చేటు అపారమైనది. అటవీప్రాంతం తగ్గితే కరువు, అకాలవర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అందువల్ల అభివృద్ధికీ, పర్యావరణ పరిరక్షణకూ సమతూకం వుండేలా ప్రభుత్వ విధానాలుండాలి. 2006 నాటి పర్యావరణ (పరిరక్షణ) చట్టం కింద రూపొందించిన పర్యావరణ ప్రభావ మదింపు నిబంధనలు కొంతమేరకు ఈ సమతూకాన్ని సాధించాయి. అయితే దాన్ని నీరు గార్చిన పర్యవసానంగా మైనింగ్ కోసం, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల కోసం, మౌలిక సదుపాయ ప్రాజెక్టుల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం ఇస్తున్న అనుమతులు ఆ సమతూకాన్ని దెబ్బతీసి కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చాయని ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రిక వెలువరించిన కథనాలు వెల్లడించాయి. వివిధ కారణాలవల్ల పర్యావరణ అనుమతులు పొందని కంపెనీలకు ఆర్నెల్లపాటు మినహాయింపునిచ్చిన 2017 నాటి కేంద్ర నిబంధనలే ఇందుకు కారణం. 2017–24 మధ్య వివిధ కార్పొరేట్ సంస్థలకు చెందిన బాక్సైట్, బొగ్గు, ఇనుము మైనింగ్లతోపాటు, సిమెంట్ ఫ్యాక్టరీలు, సున్నపురాయి వంటి వంద ప్రాజెక్టులకు అనుమతులు మంజూరయ్యాయని ఆ కథనం చెబుతోంది. 1996లో జస్టిస్ జేఎస్ వర్మ, జస్టిస్ బీఎన్ కృపాల్ ఇచ్చిన తీర్పు అడవికి విస్తృత నిర్వచనాన్నిచ్చింది. దాని ప్రకారం చట్టం నిర్వచనానికి సరిపోయే అటవీప్రాంతాలతోపాటు యాజమాన్యం ఎవరిదన్న అంశం జోలికి పోకుండా అడవిగా చట్టం గుర్తించిన అన్ని ప్రాంతాలూ అడవులు గానే భావించాలి. నిరుడు అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు తీసుకొచ్చిన సందర్భంగా పార్లమెంటులో మాట్లాడిన కేంద్ర పర్యావరణమంత్రి భూపేందర్ యాదవ్ ఆ చట్టం వల్ల ఆదివాసీ ప్రాంతా ల్లోని పాఠశాలల్లో కనీసం ఆడపిల్లల కోసం మరుగుదొడ్లు కూడా నిర్మించలేకపోతున్నామని వాపోయారు. ఇందులో నిజం లేదు. 2006 నాటి అటవీ హక్కుల చట్టం అలాంటి అవసరాల కోసం మినహాయింపునిస్తోంది. పర్యావరణ సమతూకాన్ని సాధించగలిగినప్పుడే దేశంలో హరితావరణాన్ని కాపాడు కోగలుగుతాం. చాలా దేశాలు అడవుల్ని కోల్పోయిన పర్యవసానంగా జరిగిన నష్టాన్ని గమనించుకుని వాటి పునరుద్ధరణకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయి. బ్రెజిల్ వంటి దేశాలు అడవులను ప్రాణప్రదంగా చూసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి. ధర్మాసనం చెప్పినవిధంగా ఏప్రిల్ 15కల్లా దేశంలోని అన్ని రకాల అటవీ భూములపై సమగ్ర వివరాలను వెబ్సైట్లో పొందుపరచాలి. అడవుల రక్షణపై పౌరుల అవగాహనను పెంపొందించే చర్యలకు ఉపక్రమించాలి. -
Lok Sabha polls 2024: ఎన్నికలప్పుడే పేదలు గుర్తొస్తారు
భోపాల్: రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370కిపైగా స్థానాలు కచి్చతంగా గెలుచుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీయేకు 400కు పైగా స్థానాలు లభిస్తాయని సాక్షాత్తూ ప్రతిపక్ష నేతలే చెబుతున్నారని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని ఝాబూవా జిల్లాలో ఆదివారం గిరిజనుల బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించారు. కాంగ్రెస్ గిరిజన వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. ఆ పారీ్టకి గ్రామీణులు, రైతులు, పేదలు కేవలం ఎన్నికల సమయంలోనే గుర్తుకొస్తారని ఎద్దేవా చేశారు. కొన్ని రోజుల క్రితం దక్షిణాది రాష్ట్రాల్లో శ్రీరాముడితో సంబంధం ఉన్న ఆలయాలను దర్శించుకున్నానని, స్థానిక ప్రజల నుంచి తనకు అపరిమితమైన ప్రేమ లభించిందని చెప్పారు. కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు గ్రహించాయని, అందుకే దింపుడు కళ్లం ఆశతో కుటిల ప్రయత్నాలకు పాల్పడుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. టూటీ చేయడం, ప్రజలను విభజించడం.. ఇదే కాంగ్రెస్ విధానమని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు జనం సొమ్ము దోచుకోవడం, అధికారం పోయాక భాష, ప్రాంతం, కులం పేరిట విడదీయడం కాంగ్రెస్కు అలవాటుగా మారిపోయిందన్నారు. అవినీతి, విభజన రాజకీయాలు అనే ఆక్సిజన్తో కాంగ్రెస్ బతుకుతోందన్నారు. ప్రజలకు నిజాలు తెలుసని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆటలు సాగనివ్వబోమని తేలి్చచెప్పారు. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని అన్నారు. గిరిజనులు, పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నందుకే ప్రతిపక్షాలు తనను దూషిస్తున్నాయని ఆరోపించారు. ప్రతి బూత్లో అదనంగా 370 ఓట్లు గత లోక్సభ ఎన్నికల కంటే ఈసారి ప్రతి పోలింగ్ బూత్లో బీజేపీకి అదనంగా 370 ఓట్లు వేయాలని ప్రజలను నరేంద్ర మోదీ కోరారు. మొత్తం 543 లోక్సభ సీట్లకు గాను తమకు 370కిపైగా సీట్లు కట్టబెట్టాలన్నారు. మధ్యప్రదేశ్లో డబులు ఇంజన్ ప్రభుత్వం డబుల్ స్పీడ్తో పని చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. రూ.7,550 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఈ సందర్భంగా మోదీ ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందని ఆక్షేపించారు. గిరిజన మహిళ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి కాకుండా అడ్డుకొనేందుకు కాంగ్రెస్ ప్రయతి్నంచిందని ధ్వజమెత్తారు. విలువలతో కూడిన విద్య కావాలి భారతీయ విలువల ఆధారిత విద్యా వ్యవస్థ తక్షణావసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు స్వామి దయానంద సరస్వతి 200వ జయంతి సందర్భంగా గుజరాత్లోని మోర్బీ జిల్లా తాంకారాలో ఆదివారం వేడుకల్లో ఆయన వర్చువల్గా ప్రసంగించారు. భారతీయ వ్యవస్థ వేదాల వైపు మళ్లాలంటూ దయానంద సరస్వతి పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ఆయన గొప్ప సామాజిక సంస్కర్త అని కొనియాడారు. సమాజం నుంచి బానిసత్వం, మూఢనమ్మకాలను తొలగించేందుకు కృషి చేశారని తెలిపారు. ఆర్య సమాజ్ ఆధ్వర్యంలోని పాఠశాలలు విలువలతో కూడిన విద్యనందిస్తున్నాయని ప్రశంసించారు. 21వ శతాబ్దంలో జాతి నిర్మాణం అనే బాధ్యత చేపట్టాలని ఆర్య సమాజ్కు విజ్ఞప్తి చేశారు. దయానంద సరస్వతి జని్మంచిన గుజరాత్లో తాను కూడా జని్మంచడం అదృష్టంగా భావిస్తున్నానని మోదీ అన్నారు. -
గిరిజన గృహాల్లో విద్యుత్ వెలుగులు
సాక్షి, అమరావతి: అడవులు, కొండల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి గిరిజన గృహానికీ విద్యుత్ సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం రూ.140 కోట్లను వెచ్చిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు గత నెలలో రాష్ట్రంలో విద్యుత్ సదుపాయం లేని గిరిజన గ్రామాలపై అధ్యయనం చేశాయి. అడవులు, కొండ ప్రాంతాల్లోని గిరిజనుల గృహాలకు విద్యుత్ లైన్లు వేయడానికి సాంకేతికంగా, ఆర్థికంగా ఉన్న సాధ్యాసాధ్యాలను వీరు అధ్యయనం చేశారు. గిరిజనుల నుంచి ఎటువంటి రుసుం తీసుకోకుండా ఉచితంగా విద్యుత్ సదుపాయం కల్పిస్తోంది. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నంద్యాల జిల్లాలో 213 గిరిజన ఆవాసాల విద్యుదీకరణకు రూ.5 కోట్లు కేటాయించింది. ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రూ.24 కోట్లతో 1982 గిరిజనుల ఇళ్లకు విద్యుత్ సర్విసులు అందిస్తోంది. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 8,819 గిరిజన గృహాల విద్యుదీకరణకు రూ.33.49 కోట్లతో డీపీఆర్ సిద్ధమైంది. ఇంకా ఏవైనా విద్యుత్ అందని గిరిజన గృహాలను కూడా డిస్కంలు గుర్తిస్తున్నాయి. అలాగే గిరిజన ప్రాంతాల విద్యుదీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎంజేఏఎన్ఎంఏఎన్) పథకానికి కూడా మన రాష్ట్రం ఎంపికైంది. ఈ పథకం ద్వారా విద్యుత్ లైన్లు వేయడం సాధ్యం కాని ప్రాంతాల్లో సౌర విద్యుత్ను ప్రభుత్వం అందిస్తుంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అర్హులైన గిరిజన లబ్దిదారులందరికీ ప్రభుత్వం సబ్సిడీతో నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఇంధన వినియోగ చార్జీలు, ట్రూ–అప్, ఎఫ్ఏపీసీఏ చార్జీలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. గత ప్రభుత్వం చెల్లించాల్సిన ఎస్టీ వినియోగదారుల రాయితీ బకాయిలను కూడా ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించింది. గత ప్రభుత్వ హయాంలో 0–75 యూనిట్ల పరిమితి ఉండేది. 100 యూనిట్ల పరిమితి దాటిన వినియోగదారుల సర్విసులకు విద్యుత్ సరఫరా నిలిపివేసేవారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ బకాయిలను కూడా చెల్లించడంతో పాటు యూనిట్ల పరిమితిని కూడా 200కు పెంచింది. ఎస్టీల విద్యుత్ సబ్సిడీ గత ప్రభుత్వంతో పోలిస్తే రెట్టింపునకు పైగా పెరిగింది. దీంతో సర్వీసులూ పెరిగాయి. 5 లక్షలకు పైగా ఎస్టీ కుటుంబాలకు ఇప్పుడు ఉచిత విద్యుత్ అందుతోంది. ప్రతి ఆవాసానికీ విద్యుత్ ఈపీడీసీఎల్ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలో విద్యుత్ సదుపాయం లేని 271 గిరిజన మారుమూల హాబిటేషన్స్ను గుర్తించాం. 4944 గిరిజన కుటుంబాలకు విద్ద్యుదీకరణ చేయడానికి రూ.29.96 కోట్లతో గతంలో ప్రతిపాదనలు రూపొందించాం. తాజాగా 1,474 గిరిజన ఆవాసాల్లో 8,819 గిరిజన గృహాల విద్యుదీకరణకు రూ. 33.49 కోట్లతో డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధమైంది. ఇంకా విద్యుదీకరణ చేయని 245 హాబిటేషన్స్లో 1,544 గృహాల విద్యుదీకరణకు పాడేరు డివిజన్లోని గిరిజన ప్రాంతాల్లో సర్వే చేశాం. ప్రతిపాదనలు కూడా రూపొందించాం. –ఎల్ మహేంద్రనాథ్, ఎస్ఈ, విశాఖపట్నం ఆపరేషన్ సర్కిల్, ఏపీఈపీడీసీఎల్ -
మనసున్న ముఖ్యమంత్రి జగన్
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో గిరిజనులకు అత్యధికంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ మాజీ ఎంపీ, ఆచార్య అజ్మీర సీతారాంనాయక్ అన్నారు. గిరిజనులకు అన్ని విధాలుగా మేలు చేస్తున్న మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ప్రశంసించారు. ఆదివారం విజయవాడలో ‘గిరిజన శంఖారావం’ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీతారాంనాయక్ మాట్లాడుతూ.. ఏపీలో ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి ముందడుగు వేయడం గొప్ప విషయమన్నారు. ఏపీలో గిరిజనులకు జరుగుతున్నంత సంక్షేమం, అభివృద్ధి దేశంలో మరెక్కడా అందడం లేదని చెప్పారు. అందుకే ఏపీలోని గిరిజనులు జగన్ను దేవుడిగా అభిమానిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పపూలు ఏరుకుని బతికే కుటుంబానికి చెందిన తాను ఉమ్మడి ఏపీలో మొదటి పీహెచ్డీ చేసిన గిరిజన వ్యక్తినని చెప్పారు. విద్య ద్వారానే సమాజంలో ఉన్నతంగా ఎదుగుతామన్నారు. రాష్ట్రంలో గిరిజనులకు ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యత ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకరరావు మాట్లాడుతూ.. సీఎం జగన్ రాష్ట్రంలోని గిరిజనులకు ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యతను మరింతగా పెంచాలనే తపనతో పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో గిరిజనుల మాట వినే ప్రభుత్వం ఉందని, దాన్ని మళ్లీ నిలబెట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గిరిజనులకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు, ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర్నాయక్ మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం గిరిజనులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. కానీ సీఎం జగన్ రెండు మంత్రివర్గాల్లోనూ గిరిజనులకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారని చెప్పారు. ఎమ్మెల్సీలుగా గిరిజనులకు అవకాశం ఇచ్చి చరిత్ర సృష్టించారని చెప్పారు. అడవులకే పరిమితం అనుకున్న గిరిజన బిడ్డలను సీఎం జగన్ రాజకీయ రంగంలో కూడా చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకొని.. మరింతగా అభివృద్ధి చెందుదామని పిలుపునిచ్చారు. జీపీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు జి.మల్లిఖార్జున నాయక్, జీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కె.రాజునాయక్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే గిరిజన తండాలకు రోడ్లు, తాగునీటి సౌకర్యం, విద్య, వైద్యం.. తదితర సదుపాయాలన్నీ అందుబాటులోకి వచ్చాయన్నారు. రాష్ట్రంలో పెత్తందారులతో జరుగుతున్న యుద్ధంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా, అగ్రవర్ణ పేదల నాయకుడైన సీఎం జగన్ను గెలిపించుకుందామని కోరారు. గిరిజనులకు ఎంతో మేలు చేస్తున్న సీఎం జగన్ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ సభ్యులు కె.రామలక్ష్మి, జె.లిల్లీ, నెల్లూరు నగర మేయర్ పొట్టూరి స్రవంతి, కదిరి రూరల్ జెడ్పీటీసీ కృష్ణ నాయక్, పలు కార్పొరేషన్ల డైరెక్లర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ, గిరిజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ బంజార కళాకారుడు బిక్షు నాయక్ బృందం ప్రదర్శించిన గిరిజన కళారూపాలు ఆకట్టుకున్నాయి. -
‘పీఎం జన్ మన్’తో గిరిజనుల అభివృద్ధికి కృషి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం జన్మన్ యోజన) పథకం ప్రవేశపెట్టిందని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ చెప్పారు. ఈ పథకం అమలుపై వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు(సీఎస్లు)తో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గిరిజన తెగల్లో కూడా బాగా వెనుకబడిన తెగలున్నాయని.. వారిని ఇప్పటివరకు ఎవరూ అంతగా పట్టించుకోలేదన్నారు. అలాంటి వారందరి అభివృద్ధి కోసమే ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. 2023–24 నుంచి 2025–26 వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కేంద్రం వాటాగా రూ.15,336 కోట్లు, రాష్ట్రాల వాటాగా రూ.8,768 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర పథకాల ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణం, రహదారుల అభివృద్ధి, మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా ఆరోగ్య పరిరక్షణ, నిరంతర నీటి సౌకర్యం, ప్రతి ఇంటికీ విద్యుత్, అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు, మలీ్టపర్పస్ కేంద్రాలు, సోలార్ వీధి దీపాలు, మొబైల్ టవర్లు, ఒకేషనల్ విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎస్లకు రాజీవ్ గౌబ సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పథకాల ద్వారా లబ్ధి కలిగించాలన్నారు. ఈ నెల 15న ప్రధాని మోదీ వర్చువల్గా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొత్త బల్లుగుడ, పాత బల్లుగుడకు చెందిన ఆదివాసీలతో మాట్లాడతారని చెప్పారు. అనంతరం సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి ఈ అంశంపై రాష్ట్ర అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని పీవీటీజీ ఆవాసాల్లోని వారందరికీ వివిధ పథకాలను మిషన్ మోడ్లో పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఉన్నతాధికారులు కె.విజయానంద్, బి.రాజశేఖర్, ఎంటీ కృష్ణబాబు, గోపాలకృష్ణ ద్వివేది, ప్రవీణ్ ప్రకాశ్, జి.జయలక్షి్మ, కాంతిలాల్ దండే, సురేష్ కుమార్, లక్ష్మీశా, జె.వెంకట మురళి, బాలూ నాయక్, కృష్ణా రెడ్డి పాల్గొన్నారు. -
గిరిజన ఉపాధిలో వికాసం
సాక్షి, అమరావతి: ఏజెన్సీలోని వన్ ధన్ వికాస్ కేంద్రాలు(వీడీవీకే)లతో గిరిజన ఉపాధిలో వికాసం కనిపిస్తోంది. వీటి ఏర్పాటుతో గిరిజనులకు ఉన్నతమైన జీవనోపాధి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది. గిరిజనులు సేకరించిన ఫలసాయంతోపాటు గిరిజన రైతులు పండించిన ఉత్పత్తులను నాణ్యత చెడిపోకుండా అందమైన ప్యాకింగ్తో అమ్మకాలు చేయిస్తోంది. గిరి ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తూ అడవి బిడ్డలకు లాభదాయకంగా మలుస్తోంది. కొనుగోలుదారులకు సైతం ప్రయోజనాలను అందిస్తోంది. రాష్ట్రంలోని 8 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పరిధిలో వీడీవీకేలు అనుకున్న లక్ష్యాలను సాధిస్తూ గిరిజనులకు ఎంతో మేలు చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేసిన వీడీవీకేల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఆయా ఐటీడీఏల పరిధిలో ప్రాజెక్ట్ ఆఫీసర్లు వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ వాటిని పర్యవేక్షిస్తున్నారు. విక్రయిస్తున్న ఉత్పత్తులివీ.. అటవీ ప్రాంతంలో గిరిజనులు సేకరించిన అటవీ ఫలసాయంతోపాటు వారు పండించిన ఉత్పత్తులు కూడా అందంగా ప్యాక్చేసి వీడీవీకేల్లో విక్రయిస్తున్నారు. ప్రధానంగా తేనె, కాఫీ, పసుపు, మిరియాలు, రాజ్మా, రాగులు, రాగి పిండి, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అడవి దుంపల నుంచి తీసిన పాలపిండి, జీడిపప్పు, నల్లజీడి పిక్కలు, మినుములు, చింతపండు, శీకాయ, శీకాయ పొడి, కుంకుడు, చీపుర్లు, అడ్డాకులతోపాటు ఇంట్లో తయారు చేసిన ధనియాల పొడి, నువ్వులు, కారం, కరివేపాకు, మునగాకు పొడులు కూడా విక్రయిస్తుండటం విశేషం. రూ.61.63 కోట్లతో 415 వీడీవీకేలు రాష్ట్రంలో 2019–20 నుంచి 2021–22 వరకు గిరిజన సంక్షేమ శాఖ 415 వీడీవీకేలను ఏర్పాటు చేయించింది. ఇందుకోసం రూ.61.63 కోట్లు మంజూరు చేయగా.. ఇప్పటివరకు రూ.36.04 కోట్లు విడుదల చేశారు. గిరిజన మహిళలతో గ్రూపులు ఏర్పాటు చేయించి.. వారికి పెట్టుబడి సాయం అందిస్తున్నారు. గిరిజనులు పండించిన ఉత్పత్తులు, సేకరించిన ఫలసాయాలకు వీటిద్వారా కనీస మద్దతు ధర దక్కేలా చేస్తున్నారు. సేకరించిన అటవీ ఉత్పత్తులకు అదనపు విలువను జోడించేలా గిరిజన మహిళలకు శిక్షణ ఇవ్వడం, మార్కెటింగ్కు అనుగుణంగా వాటిని సిద్ధం చేయడం వంటి లక్ష్యాలు సాధించడంలో వీడీవీకేల ద్వారా చేస్తున్న ప్రయత్నాల వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. గిరిజన ఉత్పత్తుల సేకరణ నుంచి మార్కెటింగ్ వరకు వీడీవీకేల ద్వారా అందిస్తున్న తోడ్పాటు గిరిజన మహిళల ఆర్థిక పురోగతికి దోహదం చేస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటైన వీడీవీకేలు సూపర్ మార్కెట్లను తలపిస్తున్నాయి. నెలకు రూ.25 వేలకు పైనే మిగులుతోంది గిరిజన మహిళలు గ్రూపుగా ఏర్పడి వీడీవీకే ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీతో కూడిన పెట్టుబడి సాయం అందిస్తుంది. ఐటీడీఏ, డీఆర్డీఏ పర్యవేక్షణలో ఇవి గిరిజన ప్రాంతాల్లో వినూత్న సూపర్ మార్కెట్ల మాదిరిగా ఆదరణకు నోచుకుంటున్నాయి. వీటికి మంచి డిమాండ్ ఉండటంతో నెలకు కనీసం రూ.లక్షకుపైగా విక్రయాలు జరిగితే పెట్టుబడి పోనూ రూ.25 వేలు లాభం మిగులుతోంది. గ్రూపు సభ్యులు లాబాల్లో వాటా పంచుకుని మెరుగైన జీవనం గడిపేందుకు వీడీవీకేలు దోహదం చేస్తున్నాయి. – జి.పైడమ్మ, వీడీవీకే నిర్వాహకురాలు, పాడేరు -
ఆ పల్లెను చూసింది నలుగురు ఎమ్మెల్యేలే!
రాష్ట్రంలో అంతరించిపోతున్న ఆదిమ జాతుల్లో ఒకటైన కొండరెడ్లకు ఓటు హక్కు కల్పించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీంతో ఈ ఏడాది కొత్తగా 71 మంది కొండరెడ్లు ఓటుహక్కు పొందారు. సమాజానికి దూరంగా అడవుల్లో నివసించే కొండరెడ్లను సైతం ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయడంపై జిల్లా యంత్రాంగం చేసిన కృషిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్రాజ్ సైతం అభినందించారు. దీంతో ఒక్కసారిగా కొండరెడ్లు ఫోకస్లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలపై కొండరెడ్ల జీవన స్థితిగతులతో పాటు అక్కడి ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. దట్టమైన అడవిలో..: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ – దమ్మపేట మార్గంలోని దట్టమైన అటవీ మార్గంలో ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఒక ఫారెస్ట్ చెక్ పోస్టు వస్తుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గం లేని కాలిబాటలో 13 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే.. . కొండరెడ్లు నివాసముండే పూసుకుంట అనే గ్రామం వస్తుంది. ఇక్కడ 138 మంది కొండరెడ్లు నివసిస్తున్నారు. ఇందులో 80 మందికి గతంలో ఓటుహక్కు ఉండగా ఈ ఏడాది కొత్తగా 14 మందికి ఓటుహక్కు వచ్చింది. ఆ గ్రామం చూసిన ఎమ్మెల్యేలు నలుగురే..: గడిచిన డెబ్బై ఏళ్లుగా ఈ గ్రామాన్ని సందర్శించింది కేవలం నలుగురు ఎమ్మెల్యేలే. వారే జలగం ప్రసాదరావు, తుమ్మల నాగేశ్వరరావు, వగ్గేల మిత్రసేన, తాటి వెంకటేశ్వర్లు. కొండ రెడ్ల ఓట్లు తక్కువగా ఉండటం, ఇతరులతో కలవకుండా వేరుగా నివసిస్తుండడంతో బడా నేతలు కానీ రాజకీయ పార్టీలు దృష్టి పెట్టడం లేదు. ఎన్నికల వేళ కేవలం ఓటర్లుగానే పరిగణిస్తున్నారు తప్ప అరుదైన గిరిజన జాతిగా గుర్తించడం లేదు. ఫలితంగా ఈ జాతి అంతరించిపోయే ప్రమాదాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. గవర్నర్ రాకతో..: రాష్ట్ర గవర్నర్ తమిళసై 2022 ఏప్రిల్లో ప్రత్యేకంగా పూసుకుంట గ్రామాన్ని సందర్శించారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలో ప్రధాన రహదారి నుంచి 13 కి.మీ దూరంలో పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉన్న ప్రజలను ఆమె పలకరించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ గ్రామానికి ప్రభుత్వపరంగా వివిధ పక్కా భవనాలు మంజూరయ్యాయి. తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయగా, రవాణా సౌకర్యం కోసం ఎలక్ట్రిక్ ఆటో సమకూర్చారు. అలాగే, ఇక్కడి ప్రజలకు వెదురుతో అలంకరణ వస్తువులు తయారు చేయించడంపై శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పారు. ఆ సౌకర్యాలు మూణ్నళ్ల ముచ్చటే..: గవర్నర్ రాకతో హడావుడిగా వచ్చిన సౌకర్యాలు ఇప్పుడు మూలనపడ్డాయి. ఆర్వో ప్లాంట్లో వాటర్ ట్యాంక్ పగిలిపోగా, బ్యాటరీ ఆటో రిపేరుకు వచ్చింది. శిక్షణా కేంద్రానికి వేసిన తాళం తీయడం లేదు. వీటిపై ఐటీడీఏ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. వెదురు బుట్టల మార్కెటింగ్పై దృష్టి సారించకపోవడంతో స్థానికులు వాటి తయారీపై ఆసక్తి చూపడం లేదు. గతంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్లదీ ఇదే పరిస్థితి. కొండ దిగినా..: డెబ్బై ఏళ్లుగా ప్రభుత్వాలు, ఐటీడీఏ చేసిన ప్రయత్నాలతో కొండలు దిగి కింద ఉన్న అడవుల్లో కొందరు గ్రామాలను ఏర్పాటు చేసుకుంటే మరికొందరు మైదాన ప్రాంతాల సమీపాన ఉండే అడవుల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కానీ ప్రభుత్వ పరంగా వీరి కోసం అమలు చేసే పథకాల అమలులోనూ చిత్తశుద్ధి లోపించడంతో సరైన ఫలితాలు రావట్లేదు. దాంతో వారు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు. ప్రమాదపుటంచున..: అడవుల్లో ఉండటం, జీవన విధానం, సంస్కృతి, ఆహారపు అలవాట్లు, వేషభాషల ఆధారంగా 1975లో దేశవ్యాప్తంగా ఆరుదైన ఆదిమజాతులను (ప్రిమిటీవ్ ట్రైబల్ గ్రూప్) ప్రభుత్వం గుర్తించింది. అయితే రానురానూ ఈ ఆదిమ జాతుల జనాభా వేగంగా తగ్గిపోతుండటంతో 2006లో అత్యంత ప్రమాదంలో ఉన్న ఆదిమ జాతులుగా పేరు మార్చారు. ఈ కేటగిరీకి చెందిన 12 రకాల ఆదిమ జాతులు ఉమ్మడి ఏపీలో ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో నాలుగు రకాలైన ఆదిమ తెగలే ఉన్నాయి. 2018–19లో రాష్ట్ర గిరిజన శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొలం (జనాభా 40 వేలు), తోటి (4 వేలు), నల్లమల్ల అడవుల్లో చెంచులు (16 వేల జనాభా)తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 2 వేల మంది కొండరెడ్లు ఉన్నట్టు తేలింది. తాజాగా ఓటర్ల జాబితాకు వచ్చేసరికి కొండరెడ్ల జనాభా సగానికి సగం తగ్గిపోయి కేవలం 1,054కే పరిమితమైంది. ఇందులో 692 మందికి ఓటు హక్కు ఉంది. వీరంతా దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో ఉన్న ఏడు కొండరెడ్డి గూడెల్లో నివాసం ఉంటున్నారు. రోడ్డు కావాలి.. మా ఊరికి రోడ్డు కావాలని ఎప్పటి నుంచో చెబుతున్నాం. వర్షాకాలం వస్తే ఊరు దాటడం కష్టం. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే దేవుడే దిక్కు. నీళ్ల ప్లాంటు, అంబులెన్స్, ఆటోలు పని చేయడం లేదు. – ఉమ్మల దుర్గ, పూసుకుంట చదువు ఆపేశాను నాకు ఇటీవలే ఓటు హక్కు వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నేను, తమ్ముడు తొమ్మిదో తరగతితోనే చదువు ఆపేసి పనులకు వెళ్తున్నాం. – ఇస్మాయిల్రెడ్డి, వీరారెడ్డిగూడెం -తాండ్ర కృష్ణగోవింద్ -
ఓ ఆదివాసి వీరనారి పోరాటం!
మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి వీరమరణం పొందిన ఆదివాసీ వీరనారి రాణి దుర్గావతి. మధ్యప్రదేశ్లోని గోండు తెగకు చెందిన బుందేల్ ఖండ్ సంస్థానాధీశుడు చందవేల్కు 1524 అక్టోబర్ 5న దుర్గావతి జన్మించింది. దుర్గావతి భర్త దళపత్ షా గోండు రాజ్యాన్ని పాలిస్తూ మరణించాడు. కుమారుడు వీరనారాయణ్ మైనర్ కావడంతో దుర్గావతి గోండ్వానా రాజ్య పాలన చేపట్టింది. రాణి దుర్గావతి పైనా, ఆమె పాలిస్తున్న గోండ్వానా రాజ్య సంపద పైనా మనసు పారేసుకున్న అక్బర్ సేనాని ఖ్వాజా అబ్దుల్ మజీద్ అసఫ్ ఖాన్... అక్బర్ అనుమతిని తీసుకొని గోండ్వానాపై దండెత్తాడు. సుశిక్షితులైన వేలాది మొఘల్ సైనికులు ఒకవైపు, అసంఘ టితమైన ఆదివాసీ సైన్యం ఒకవైపు యుద్ధ రంగంలో తలపడ్డారు. మొఘల్ సైన్యానికి ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. కానీ ఆదివాసీ సైనికులకు సంప్రదాయ ఆయుధాలే దిక్కయ్యాయి. మొఘల్ సైన్యం రాకను తెలుసుకున్న దుర్గావతి రక్షణాత్మకంగా ఉంటుందని భావించి ‘నరాయ్’ అనే ప్రాంతానికి చేరుకొంది. ఇక్కడ ఒకపక్క పర్వత శ్రేణులు ఉండగా మరోపక్క గౌర్, నర్మద నదులు ఉన్నాయి. ఈ లోయలోకి ప్రవేశించిన మొఘల్ సైన్యంపై గెరిల్లా దాడులకు దిగింది దుర్గావతి. ఇరువైపులా సైనికులు మరణించారు. దుర్గావతి ఫౌజ్దార్ అర్జున్ దాస్ వీరమరణం పొందాడు. ఆమె గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తే సైనికాధికారులు రాత్రి గుడ్డి వెలుతురులో ప్రత్యక్ష యుద్ధం చేయాలని సలహా ఇచ్చారు. మరుసటిరోజు ఉదయానికి పెద్ద తుపాకులను వాడమని మొఘల్ సైన్యాధికారి అసఫ్ ఖాన్ సైనికులను ఆదేశించాడు. రాణి ఏనుగునెక్కి మొఘల్ సైనికులపై విరుచుకుపడింది. యువరాజు వీర్ నారాయణ్ కూడా యుద్ధరంగంలోకి దూకి మొఘల్ సైనికులను మూడుసార్లు వైనక్కి తరిమాడు. కానీ అతడు తీవ్రంగా గాయపడడంతో సురక్షితమైన ప్రదేశానికి వెళ్లిపోయాడు. రాణి దుర్గావతికి కూడా చెవి దగ్గర బాణం తగిలి గాయపడింది. ఆ తర్వాత ఒక బాణం ఆమె గొంతును చీల్చివేసింది. వెంటనే ఆమె స్పృహ కోల్పోయింది. స్పృహ వచ్చిన తర్వాత ఆమె ఏనుగును తోలే మావటి యుద్ధ రంగం నుంచి సురక్షిత ప్రదేశానికి తప్పించుకు వెళదామని సలహా ఇచ్చాడు. ఆమెకు అపజయం ఖాయం అని అర్థమయ్యింది. శత్రువుకు భయపడి పారిపోవడం లేదా అతడికి చిక్కి మరణించడం అవమానకరం అని భావించి తన సురకత్తిని తీసుకుని పొడుచుకొని ప్రాణాలు వదిలింది రాణి. దీంతో ఒక మహోజ్వల ఆదివాసీ తార నేలకొరిగినట్లయ్యింది. – గుమ్మడి లక్ష్మీ నారాయణ, ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి (చదవండి: దేశంలోనే తొలి బధిర మహిళా అడ్వకేట్ సారా! చివరికి సుప్రీం కోర్టు..) -
10,574 చోట్ల జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రతి గడపకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 10,574 చోట్ల జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహిస్తున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం కిల్లోగూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల ఆవరణలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ శిబిరాలకు వస్తున్న ప్రతి వ్యక్తి వివరాలను ఆన్లైన్లో పొందుపరచడంతోపాటు ఆరోగ్యశ్రీ ద్వారా పెద్దాస్పత్రులు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పైసా ఖర్చు లేకుండానే ఉన్నత వైద్యం అందిస్తామన్నారు. మూడు రోజుల్లోనే ఈ శిబిరాల ద్వారా 3.35 లక్షల మందికి వైద్యపరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. వీటిలో 11,780 కేసులను ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రిఫర్ చేసి ఉన్నత వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా 297 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందుకు 250 మంది వైద్య నిపుణులను కేటాయించామన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనిచేస్తున్నారని వెల్లడించారు. గిరిజనులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు గిరిజనులంటే సీఎం జగన్కు అపారమైన ప్రేమ అని మంత్రి రజిని తెలిపారు. రూ.600 కోట్లతో మన్యం జిల్లా పార్వతీపురంలో మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేశారని చెప్పారు. అలాగే పాడేరులో రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతోందని, వచ్చే ఏడాది ఇది ప్రారంభమవుతుందని వెల్లడించారు. దీంతోపాటు 600 పడకలతో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. దీంతో మన్యం ప్రజలు కేజీహెచ్కు వెళ్లే ఇబ్బందులు తప్పుతాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో బర్త్ వెయిటింగ్ సేవలను గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు 40.. 104, 108 వాహనాలను కేటాయించామన్నారు. 20 లక్షల మంది గిరిజనులకు సికిల్సెల్ ఎనీమియా నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నామన్నారు. రోగులకు నెలకు రూ.10 వేల పింఛన్ కూడా అందిస్తున్నామని చెప్పారు. అనంతరం వైద్య శిబిరానికి వచి్చన గిరిజనులకు మందుల కిట్లు పంపిణీ చేశారు. గర్భిణులకు సీమంతం నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలకు వచ్చే గిరిజనులకు ఉచితంగా ఆహారం, తాగునీరు పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. దత్తత గ్రామానికి చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా? టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు బాౖMð్సట్ తవ్వకాలతో మన్యాన్ని దోచుకోవాలని ప్రయత్నాలు చేశారని మంత్రి విడదల రజిని విమర్శించారు. పెదలబుడును చంద్రబాబు దత్తత తీసుకుని ఒక మంచి పని అయిన చేశారా అని నిలదీశారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా ఉన్న జీవోను రద్దు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ నివాస్, ఐటీడీఏ పీవో వి.అభిõÙక్, ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర తదితరులు పాల్గొన్నారు. -
Tribal University: తొమ్మిదేళ్ల కల తీరేలా..!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించడంతో సుమారు తొమ్మిదేళ్ల్ల నిరీక్షణకు తెరపడింది. ఉమ్మడి ఏపీ విభజన సమయంలోనే.. ఏపీ, తెలంగాణలలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏపీలోని విజయనగరం జిల్లా మర్రివలసలో 2019లోనే సెంట్రల్ ట్రైబల్ వర్సిటీని స్థాపించారు. రాష్ట్రంలో మాత్రం వర్సిటీకి స్థలం విషయంలో పేచీతో ఇన్నాళ్లూ జాప్యం జరిగింది. ఇప్పటికైనా ఈ అంశంపై స్పష్టత రావడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ ఏర్పాటయ్యే పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, గిరిజనులకు విద్యావకాశాలు పెరుగుతాయని అంటున్నారు. ఇన్నాళ్లూ లేఖలతోనే.. గిరిజన వర్సిటీ నిర్మాణానికి 500 ఎకరాల స్థలం కావాలని, అనుకూలమైన స్థలం ఉంటే వచ్చి పరిశీలిస్తామని 2016లోనే కేంద్ర ఉన్నత విద్యామండలి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో రాష్ట్ర రెవెన్యూ, అటవీశాఖ అధికారులు ఉమ్మడి సర్వే నిర్వహించి.. ములుగు జిల్లాలోని బండాకెపల్లి శివార్లలో 335.4 ఎకరాలను సేకరించారు. 2017 ఫిబ్రవరిలో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర అధికారులకు ఆ స్థలాన్ని చూపించారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2018 జనవరిలో సమగ్ర నివేదిక (డీపీఆర్) సిద్ధం చేసి కేంద్ర మానవ వనరుల శాఖకి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)కు అందించింది. తరగతులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. హెచ్సీయూ 2019లో రాష్ట్ర ఉన్నత విద్యామండలిని సంప్రదించగా.. తాత్కాలికంగా తరగతుల ప్రారంభం కోసం ములుగు మండలంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ)లో ఏర్పాట్లు చేస్తామని చెప్పింది. ఒకేచోట 500 ఎకరాల స్థలం సమకూర్చే వీలు లేకపోవడంతో ములుగు–జాకారం ప్రాంతంలోని మేడారం జాతర సమీపంలో గట్టమ్మ గుట్ట వద్ద 335 ఎకరాలను, పసర వద్ద 165 ఎకరాలను ఇస్తామని చెప్పింది. కానీ తరగతులు ప్రారంభించడానికి కనీసం 50 ఎకరాల స్థలంలో నిర్మాణాలు ఉండాలని.. అంతేగాకుండా వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమి మొత్తాన్ని ఒకేచోట కేటాయించాలని స్పష్టం చేసింది. ఈ అంశాలపైనే కేంద్రం–రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇన్నాళ్లూ పేచీ కొనసాగింది. అయితే ఇప్పుడు వర్సిటీని మంజూరు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించడంతో.. సదరు స్థలంలో అవసరమైన విద్యుత్, రోడ్లు, నీళ్లు వంటి మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సి ఉండనుంది. గిరిజనులకు రిజర్వేషన్లు ఎంతశాతం? దేశవ్యాప్తంగా గిరిజనులకు 7.5శాతం రిజర్వేషన్ అమల్లో ఉండగా.. తెలంగాణలో 10శాతంగా ఉంది. మరి గిరిజన వర్సిటీలో గిరిజనులకు ఎంత మేర రిజర్వేషన్ ఇస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. సూపర్ న్యూమరరీ విధానంలో సీట్లు పెంచి అయినా గిరిజన విద్యార్థులకే ఎక్కువ సీట్లు కేటాయించాలన్న డిమాండ్ ఉంది. ఏపీలో ఉన్నట్టుగానే..! ఏపీలో ఇప్పటికే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నడుస్తున్న నేపథ్యంలో.. అక్కడ అమలు చేస్తున్న కోర్సులనే ములుగు వర్సిటీలోనూ అమలు చేసే అవకాశం ఉందని యూజీసీకి చెందిన ఓ ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు. సాధారణ కోర్సుల తోపాటు ప్రత్యేకంగా గిరిజన కళలు, సంస్కృతిపైనా కోర్సులను అందుబాటులోకి తీసుకురావొచ్చని పేర్కొన్నారు. గిరిజనులకు ఎక్కువ సీట్లు ఇస్తేనే ప్రయోజనం ఇన్నాళ్లకైనా గిరిజన వర్సిటీ ఇవ్వడం సంతోషకరం. కానీ దీనివల్ల గిరిజనులకు ఒరిగేదేమీ లేదు. గిరిజనుల పేరిట యూనివర్సిటీ పెట్టి వారికి కేవలం ఏడున్నర శాతం రిజర్వేషన్ ఇవ్వడమేంటి? అదేం గిరిజన యూనివర్సిటీ? ఇదేమిటని కేంద్రాన్ని అడిగితే యూజీసీ నిబంధనలు అంటున్నారు. అలాంటప్పుడు జనరల్ యూనివర్సిటీ పెట్టుకోండి అని చెప్పా.. గిరిజనులకు అత్యధికంగా సీట్లు ఇచ్చినప్పుడే అది గిరిజన వర్సిటీ అవుతుంది. దీనిపై కేంద్రమంత్రికి మళ్లీ లేఖరాస్తా. – అజ్మీరా సీతారాం నాయక్, మాజీ ఎంపీ, కేయూసీ రిటైర్డు ప్రొఫెసర్ -
డోలీ కష్టాలకు చెక్
శృంగవరపుకోట: గిరిశిఖర గ్రామాల్లో డోలీ మోతలు ఇకపై కనిపించవని ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ కృషితో గిరిశిఖర గ్రామాలకు చేరుకునేందుకు మార్గం సుగమమవుతోందని చెప్పారు. కొండ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలు చకచకా సాగుతున్నాయని, దీనికి విజయనగరం జిల్లా ఎస్.కోట మండలంలోని దబ్బగుంట నుంచి పల్లపుదుంగాడకు వేస్తున్న రోడ్డే నిదర్శనమని అన్నారు. ధారపర్తి పంచాయతీ పరిధిలోని గిరిశిఖర గ్రామాలైన దారపర్తి, పల్లపుదుంగాడ గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన మంగళవారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పాలనను వివరించారు. పథకాల అందుతున్న తీరును గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. పల్లపుదుంగాడలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ 2019లో ఎన్నికల సమయంలో గ్రామానికి వచ్చినపుడు ప్రాణాల మీదికి వస్తే డోలీ మోతలే దిక్కు అని, దబ్బగుంట నుంచి పల్లపుదుంగాడకు రోడ్డు వేయమని గిరిజనులు అడిగారన్నారు. ఆ మేరకు అటవీశాఖ అనుమతులు సాధించి దబ్బగుంట నుంచి పల్లపుదుంగాడకు ఐదు కిలోమీటర్ల రోడ్డును రూ.4.50 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. పల్లపుదుంగాడ నుంచి దారపర్తి వరకూ మరో 6 కి.మీ మేర రోడ్డు నిర్మాణానికి రూ.5 కోట్లతో ప్రతిపాదనలు పంపించామన్నారు. జల్జీవన్ మిషన్ కింద పల్లపుదుంగాడలో ప్రతి ఇంటికి కుళాయిలు వేసి తాగునీరు ఇచ్చామని.. పొర్లు, కురిడి, గూనపాడు, ధారపర్తి గ్రామాల్లో కుళాయిలు వేసే పనులు జరుగుతున్నాయని చెప్పారు. అనంతరం ధారపర్తి ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఎమ్మెల్యే సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పినిశెట్టి వెంకటరమణ, స్టేట్ ఫోక్ అకాడమీ డైరెక్టర్ వి.రాంబాబు పాల్గొన్నారు. -
గోండు సామ్రాజ్యంలో అక్కా చెల్లెళ్ళ పోటీ?.. ఆదివాసీలు ఎటువైపు!
ఎన్నికల్లో వేర్వేరు పార్టీల నుంచి బంధువులు పోటీ పడటం కొత్తేమీ కాదు. అన్నదమ్ములు, అక్కా తమ్ముళ్ళ ఇలా రక్త సంబంధీకులు కూడా చాలా చోట్ల పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కారు, హస్తం పార్టీల నుంచి అక్కా చెల్లెళ్ళ పోటీ పడబోతున్నారు. ఆ ఇద్దరు ఎవరో..యుద్ధంలో గెలిచేదెవరో చూద్దాం. ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం ఆసిఫాబాద్ నియోజకవర్గంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల యుద్ధం ఆసక్తికరంగా మారుతోంది. కాంగ్రెస్ చేతిలో ఉన్న ఈ సీటు దక్కించుకోవడానికి అధికార బీఆర్ఎస్.. సీటు నిలుపుకోవడానికి కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నాయి. అన్ని పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఆరు నూరైనా ఆసిఫాబాద్ దక్కించుకోవాల్సిందేనని కేడర్ను సిద్ధం చేస్తున్నాయి. ఆదివాసీలైన గోండుల ప్రాబల్యం ఉన్న ఈ నియోజకవర్గంలో గెలుపోటములు నిర్ణయించేది వారే. అన్ని పార్టీలు ఆ వర్గం నుంచే అభ్యర్థిని బరిలో దించడం సర్వసాధారణం. అందుకే గోండుల సామ్రాజ్యంలో గులాబీ జెండాను ఎగురవేయడానికి అసిపాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కోవ లక్ష్మి 2014లో ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కోవ లక్ష్మి తప్పకుండా విజయం సాధిస్తారని గులాబీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. ఇదే సమయంలో కోవ లక్ష్మిని కట్టడి చేయడానికి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహం రచిస్తోంది. కోవ లక్ష్మి మీద ఆమె స్వంత చెల్లెలిని బరిలో దించే ఆలోచన చేస్తోంది. ఆసిఫాబాద్ సర్పంచ్గా పనిచేసిన మర్సకోల సరస్వతిని అభ్యర్థిగా నిలిపేందుకు పావులు కదుపుతోంది. కోవ లక్ష్మి, మర్సకోల సరస్వతి మాజీ రాష్ట్ర మంత్రి కోట్నాక భీమ్రావు బిడ్డలు కావడం విశేషం. గులాబీ పార్టీ అక్క లక్ష్మికి టిక్కెట్ ఖరారు చేసింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి చెల్లెలు సరస్వతి దరఖాస్తు చేసుకున్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సరస్వతి అయితేనే కోవ లక్ష్మికి సరైన ప్రత్యర్థి అవుతారని భావిస్తున్నారు. అయితే కోవలక్ష్మి ఒకసారి ఎమ్మెల్యేగా, ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండటంతో ప్రజల్లో వ్యతిరేకత ఉందని టాక్ నడుస్తోంది. అక్క మీద ఉన్న వ్యతిరేకతే తనకు అనుకూలంగా మారుతుందని సరస్వతి భావిస్తున్నారట. అక్కడ మీద తాను తప్పకుండా విజయం సాధిస్తానని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సరస్వతి గతంలో ఒకసారి తెలుగు దేశం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రజల్లో పలుకుబడి లేని చెల్లెలు తనకు పోటీయే కాదంటున్నారు కోవ లక్ష్మి. తాను సునాయసంగా విజయం సాధిస్తానని చెబుతున్నారు. ఆసిఫాబాద్లో ఉత్కంఠ రేపుతున్న అక్కా చెల్లెళ్ళ యుద్ధంలో ఆదివాసీలు ఎటువైపు నిలుస్తారో చూడాలి. -
దళితులు, గిరిజనులకు సముచిత గౌరవం
సాగర్: గత ప్రభుత్వాలకు దళితులు, ఓబీసీలు, గిరిజనులు ఎన్నికలప్పుడే గుర్తుకు వచ్చేవారని ప్రధాని మోదీ ఆరోపించారు. దళిత బస్తీలు, నిరుపేదలుండే ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో నీటి వసతి కూడా ఉండేది కాదన్నారు. తమ ప్రభుత్వం మాత్రం దళితులు, ఓబీసీలు, గిరిజనులకు సముచిత గౌరవం ఇచ్చిందని, జల్ జీవన్ మిషన్ ద్వారా వారి ఇళ్లలోకే మంచినీరు అందిస్తోందని చెప్పారు. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా బడ్తుమా గ్రామంలో శనివారం ప్రధాని సంత్ రవిదాస్ జ్ఞాపకార్థం 11 ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్లతో నిర్మించే ఆలయం–స్మారక నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం బినా–కోటా డబుల్ లేన్ రైలు మార్గాన్ని జాతికి అంకితం చేయడంతోపాటు వివిధ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ధానాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. -
వెదురుతో వండే కూర గురించి విన్నారా? దాని టేస్టే వేరట..!
ముంచంగిపుట్టు: కూరగాయల్లో ఎన్నో రకాలు ఉంటాయి. మన్యంలో అయితే మరెన్నో రకాల కూరగాయలు లభ్యమవుతాయి. వెదురు నుంచి తీసిన కూరని ఎప్పుడైన వండుకొని తిని ఉంటారా? వినడానికే ఎంతో కొత్తగా ఉన్న మన్యం వాసులు మాత్రం వెదురు నుంచి తీసిన చిగురును కూర వండుకొని తింటారు. దీనిని మన్యం వాసులు వెదురు కొమ్ములు, వెదురు కంజి అని కూడా పిలుస్తారు. కానీ వెదురు కంజి కూర టేస్టే వేరు. వెదురు కొమ్ములు సీజన్ మొదలైయింది. ప్రస్తుతం మన్యంలో మండల కేంద్రాలు, వారపు సంతల్లో వెదురు కంజి అమ్మకాలు హాట్ కేకుల్లా జరుగుతున్నాయి. అటవీ, కొండ ప్రాంతాల్లో ఉన్న వెదురు బొంగు నుంచి లేత వెదురును తీసి చిగురును సేకరిస్తారు. దానిని శుభ్రపరిచి ముక్కలుగా చేస్తారు. వాటిని సంతల్లో రూ.20 నుంచి రూ.50 లు వరకు వాటాలుగా విక్రయిస్తారు. వెదురు కంజిని రెండు రకాలుగా కూర తయారికి వినియోగిస్తారు. పచ్చి వెదురు కంజిని ఒక రకంగా కూర తయారు చేస్తారు. వెదురు కంజిని ఎండబెట్టి మరో విధంగా కూర తయారికీ వినియోగిస్తారు. పచ్చిగా ఉన్నప్పుడు అప్పటికప్పుడే కూర తయారు చేసుకోవాలి. ముఖ్యంగా కూర తయారు చేసే ముందు రెండు మూడు సార్లు వెదురు కంజినీ బాగా కడుగుకోవాలని గిరిజనులు చెబుతున్నారు. ఎండబెట్టుకొని ఉంటే ఏడాది కాలంలో ఎప్పుడైనా కూర తయారికి వినియోగించుకోవచ్చు. ఈ వెదురు కంజి కూరను మన్యం వాసులంతా చాలా ఇష్టంగా తింటారు. వెదురు కంజిని వేపుడు, పచ్చడి, పులుసు వంటి రకాలుగా కూరును తయారు చేస్తారు. ఎన్నో ఉపయోగాలు వెదురు కంజి కూర తయారు చేసే ముందు రెండు, మూడు సార్లు నీటితో శుభ్రం చేస్తారు. అప్పుడు వెదురు కంజిలో ఉండే చేదుపోతుంది. బాగా ఉడకబెట్టి దాని కషయాన్ని తీసుకుంటారు. దీంతో రక్తం శుద్ధి అవుతుందని, శరీరానికి తక్షణ శక్షి అందుతుందని, జీర్ణశక్తి మెరుగుపడడంతో పాటు నులిపురుగులను నివారిస్తుందని గిరిజనులు చెబుతారు. వెదుర కంజి ద్రావణాన్ని మారుమూల గిరిజనులు పాము, తేలు కాటులకు ఔషధంగా సైతం వినియోగిస్తారు. వెదురు కంజి ఉపయోగాలెన్నో అని గిరిజనులు చెబుతారు. సంతల్లో జోరుగా అమ్మకాలు వారపు సంతల్లో వెదురు కొమ్ముల అమ్మకాలు బాగున్నాయి. కొమ్ముల వాటా రూ20, రూ.50 చొప్పున అమ్ముతున్నాము. గతంలో మా గిరిజన ప్రాంతానికి చెందిన వారే కొనుగోలు చేసేవారు. ఇప్పుడు మైదాన ప్రాంతం నుంచి వచ్చి కూడా వెదురు కొమ్ములను కొనుగోలు చేస్తున్నారు. కొమ్ములను పచ్చిగాను, ఉడకబెట్టి విక్రయిస్తున్నాం. శనివారం ముంచంగిపుట్టు వారపు సంతలో కొమ్ములు తెచ్చిన గంటల వ్యవధిలోనే అమ్ముడు పోయాయి. – కె.దొణ, పెదతమ్మెంగుల గ్రామం, ముంచంగిపుట్టు మండలం రుచికరంగా వంటకాలు వెదురు కొమ్ములతో తయారుచేసిన వంటకాన్ని ఎక్కువగా గర్భిణులకు అందజేస్తారు. దీనిలో ఉండే ఔషధ గుణాలు గర్భిణులకు ఎంతో మేలు చేస్తాయి. గిరిజన ప్రాంతంలో వాతావరణం చల్లగా ఉండడం వల్ల శరీరానికి వెంటనే వేడి చేసే గుణం వెదురు కంజి కూరల్లో ఉంటుంది. వెదురు కొమ్ముల కూర రుచికరంగా ఉంటుంది. ఈ నాలుగు నెలలు మాత్రమే వెదురు కొమ్ములు లభ్యమవుతాయి.అడవీ, కొండ ప్రాంతాల్లో లేత వెదురు నుంచి వెదురు కొమ్ములను సేకరిస్తారు .వారపు సంతలో విక్రయిస్తారు. – రాధమ్మ, సుజనకోట గ్రామం, ముంచంగిపుట్టు మండలం (చదవండి: పూర్తిగా శాఖాహారిగా మారితే ప్రమాదమా? చనిపోతారా!) -
గిరిజనోత్సాహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 34 తెగలకు చెందిన 27.39 లక్షల గిరిజనులు ఉన్నారు. 26 జిల్లాలకు గాను 9 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థల (ఐటీడీఏ) పరిధిలో 16,068 గిరిజన ఆవాసాలున్నాయి. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలు గిరిపుత్రుల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచాయి. 2019–20 నుంచి 2023–24 వరకు ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం మొత్తం రూ.20,948.15 కోట్లు వెచ్చించింది. నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాల్లో ప్రతి గిరిజనులకు రెండుకు మించిన పథకాల ద్వారా లబ్ధి కలిగింది. ప్రత్యక్షంగా (డీబీటీ), పరోక్షంగా (నాన్ డీబీటీ) ఇప్పటివరకు గిరిజనులకు రూ.14,712.08 కోట్ల ప్రయోజనం చేకూరింది. ఆదివాసీలకు ఇంత భారీస్థాయిలో ఆర్థిక ప్రయోజనం చేకూరడం రాష్ట్ర చరిత్రలోనే రికార్డు. వైద్య రంగానికి సంబంధించి.. గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక వైద్య కళాశాలల నిర్మాణంతోపాటు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.746.30 కోట్లను మంజూరు చేసింది. రక్తహీనత కారణంగా బాలింతలు, శిశువులు మరణిస్తున్న విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ గిరిజన ప్రాంతాల్లో గిరి గోరుముద్ద, బాల సంజీవని, పోషకాహార బుట్ట వంటి ప్రత్యేక వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏజెన్సీలో 2,652 మంది గిరిజన కమ్యూనిటీ హెల్త్ వర్కర్ (సీహెచ్డబ్ల్యూ)లకు 1995 నుంచి ఉన్న కేవలం రూ.400 జీతాన్ని రూ.4 వేలకు పెంచారు. నేడు సాలూరులో ఆదివాసీ దినోత్సవం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని బుధవారం సాలూరులో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ముఖ్య అతిథిగా హాజరవుతారు. 20 రకాల గిరిజన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యారంగంలో ఇలా.. రాష్ట్రవ్యాప్తంగా 2,506 గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్ని నిర్వహిస్తూ.. 1,55,599 మంది విద్యార్థులకు వసతి, ఇతర సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.920.31 కోట్లు కేటాయించింది. నాడు–నేడు మొదటి దశలో రూ.140 కోట్లతో గిరిజన విద్యా సంస్థలను తీర్చిదిద్దింది. రూ.153.853 కోట్లతో కురుపాంలో ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేసింది. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల భూమిని కేటాయించింది. ఉపాధి పరంగా.. అర్హులైన ప్రతి ఎస్టీ కుటుంబానికి కనీసం రెండు ఎకరాల భూమిని అందించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసింది. 2019 ఆగస్టు నుంచి 2,15,309 ఎకరాల విస్తీర్ణంలో 1,26,997 ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను, 39,272 ఎకరాల విస్తీర్ణంలో 26,287 డీకేటీ పట్టాలను పంపిణీ చేసింది. ఈ భూముల అభివృద్ధి కోసం ఉపాధి హామీ పథకం ద్వారా రూ.రూ.3,796.39 కోట్లు కేటాయించారు. 3 వేలకు పైగా బోర్లు వేయడంతోపాటు 2.27 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు, కాఫీ, మిరియాల సాగును అభివృద్ధి చేశారు. -
చీమల చట్నీ-గోంగూర, తింటారు నోరూర! తేడా వస్తే చీమల చికిత్స కూడా!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గల్లీలో ఉండే చిన్న హోటల్లోనే పొద్దున ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా ఇంకా ఎన్నో వెరైటీ టిఫిన్లు దొరుకుతాయి. ఇక మధ్యాహ్నం అన్నం, రెండు మూడు రకాల కూరలు, పప్పు, చారు, పెరుగు ఇవన్నీ లేనిదే ముద్ద దిగదు. ఇక ఏ స్టార్ హోటల్కి వెళ్లినా ఏ దేశపు వంటకాలైనా ఆర్డర్చేస్తే చాలు టేబుల్పై హాజరు... ఇవీ మైదాన ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు. కానీ అడవుల్లో జీవించే ఆదివాసీలు ఏం తింటారు? సీజన్లో దొరికే గోంగూర, చింతపండు, మిరపకాయలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఆహార సేకరణ కష్టంగా మారిన సమయంలో ఎర్రచీమలతో పచ్చడి నూరుకుని కూడా తింటుంటారు. అయితే మారిన పరిస్థితుల్లో విద్య, ఉద్యోగాల కోసం అడవుల నుంచి బయటపడుతున్న వారి ఆహారపు అలవాట్లలో ఇప్పుడిప్పుడే కొంత మార్పు చోటు చేసుకుంటోంది. వలస ఆదివాసీలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, తూర్పుగోదావరి జిల్లాలు రెండు దశాబ్దాలుగా ఛత్తీస్గఢ్, ఒడిశాకు చెందిన ఆదివాసీలకు ఆశ్రయం ఇస్తున్నాయి. వలస ఆదివాసీల్లో అనేక తెగలు ఉండగా, వీరిలో 90 శాతం మంది రోడ్డు, నీళ్లు, విద్యుత్ సౌకర్యం లేకుండా అటవీ ప్రాంత పల్లెల్లోనే ఉంటున్నారు. పోడు సాగు చేసుకోవడం, ఇంటి ఆవరణలోనే తినే ఆహార పదార్థాలను పండించుకోవడం వీరి జీవనశైలి. గోంగూర.. పండుగే.. వానాకాలంలో మొలకెత్తే గోంగూర ఆగస్టులో తినేందుకు అనువుగా ఎదుగుతాయి. ఆ సమయంలో ఆదివాసీలు గోంగూర పండుగ చేసుకుంటారు. చింతకాయలు అందుబాటులోకి వచ్చే వరకు గోంగూరే వీరి ప్రధాన ఆహారం. వానాకాలం ముగిసేలోగా అందుబాటులో ఉన్న గోంగూర ఎండబెట్టుకుని వేసవి వరకు వాడుకుంటారు. ఎండాకాలంలో చింతకాయలు రాగానే పచ్చడి చేసుకుంటారు. గోంగూరతో పాటు పచ్చకూర (చెంచలి), బొద్దుకూర, నాగళి, టిక్కల్ అనే ఆకుకూరలు, కొన్ని రకాలైన దుంపలను కూడా వండుకుంటారు. కారం కావాలంటే.. మొదట్లో అటవీ ఫలసాయం తప్ప వ్యవసాయం తెలియని ఆదివాసీలను కారం రుచి మైమరపించింది. గోంగూర, చింతకాయ పచ్చడికి అవసరమైన మిరపకాయలు అపురూపమైన ఆహారంగా మారింది. దీంతో మిరపకాయల కోసమే ఎత్తయిన కొండలు గుట్టలు ఎక్కుతూ దిగుతూ.. వాగులు, వంకలు దాటుతూ రాష్ట్రాల సరిహద్దులు చెరిపేసి గోదావరి తీరానికి చేరుకునేవారు. ప్రారంభంలో భద్రాద్రి ఏజెన్సీలో కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంటను దొంగిలించుకెళ్లేవారట. ఆ తర్వాత ఇక్కడ పనిచేసి, కూలీగా మిర్చి తీసుకెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఇక పోడు సాగు కోసం ఆదివాసీలు అడవిని నరికేటప్పుడు ఇప్ప, మద్ది, తునికి, చింత, పాల చెట్లు తారసపడితే ముట్టుకోరు. ఇక ఇప్ప చెట్టునయితే దైవంతో సమానంగా కొలుస్తారు. చీమలు... ఆహారంగానే కాదు.. వైద్యానికి కూడా ఆకు రాలే కాలం మొదలైన తర్వాత వసంతం వచ్చే వరకు ఆదివాసీలకు ఆహార సేకరణ కష్టంగా మారుతుంది. ఈ సమయంలో చీమలను ఆహారంగా తీసుకుంటారు. సర్గీ, సాల్, మామిడి ఆకులపై ఎర్రచీమలను వాటి గుడ్లను సేకరిస్తారు. అనంతరం ఉప్పు, కారం, టమాటా కలిసి రోట్లో వేసి రుబ్బుతారు. ఇలా తయారు చేసిన చట్నీని బస్తరియాగా పిలుస్తారు. ఈ పచ్చడిని వారు ఇష్టంగా తింటారు. ఎర్రచీమల్లో ఔషధ గుణాలు కలిగిన ఫామిక్ యాసిడ్ ఉండడమేకాక ప్రొటీన్, కాల్షియం సమృద్ధిగా ఉండి జ్వరం, జలుబు, దగ్గు, కంటి సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు తగ్గుతాయని నమ్ముతారు. అలాగే ఒంట్లో నలతగా ఉన్నా, తలనొప్పి, జ్వరంగా అనిపించినా చీమల చికిత్సకే మొగ్గు చూపుతారు. చెవులు, ముక్కుల ద్వారా చీమలు శరీరంలోకి వెళ్లకుండా ముఖాన్ని వస్త్రంతో కప్పేసుకుని చీమల గూడును ఒంటిపై జల్లుకుంటారు. వందల కొద్ది చీమలు శరీరాన్ని కుడుతుండగా.. మంట పుట్టి క్షణాల్లో ఒళ్లంతా చెమటలు వస్తాయి. రెండు, మూడు నిమిషాలు ఉన్న తర్వాత చీమలు తీసేస్తారు. తద్వారా ఒంట్లో ఉన్న విష పదార్థాలు చెమట రూపంలో బయటకు వెళ్లి ఉపశమనం కలుగుతుందని వారి నమ్మకం. కాగా, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలనే పండించి ఆహారంగా తీసుకునేవీరు క్రమంగా బియ్యానికి అలవాటు అవుతున్నారు. వ్యవసాయంలో ఎరువులు సైతం ఉపయోగిస్తున్నారు. గతంలో ఆవు పాలు తీసుకోని వీరు.. ఇప్పుడిప్పుడే పాలను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. ఇక ప్రభుత్వ గిరిజన పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు నెమ్మదిగా మైదాన ప్రాంత ఆహారపు అలవాట్లు చేసుకుంటున్నారు. చీమల చట్నీకి జీఐ ట్యాగ్.. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని ఆదివాసీలు తమ ఆహారంలో చీమల చట్నీకి తొలి ప్రాధాన్యమిస్తున్నారు. ఎర్రచీమలతో తయారు చేసే ఈ పచ్చడి ఔషధపరంగానూ ఉపయోగపడుతుందని వారు నమ్ముతున్నారు. చీమల చట్నీకి జీఐ టాగ్ సైతం లభించడం గమనార్హం. జొన్నలు, సజ్జలు తింటే తొందరగా ఆకలి వేయదు ఇంతకు ముందు జొన్నలు, సజ్జలు తినేవాళ్లం. పొద్దున తిని అడవికి వెళితే రాత్రి వరకు ఆకలి అనేది ఉండకపోయేది. కానీ బియ్యంతో చేసిన అన్నం అయితే రోజుకు రెండుసార్లు తినాల్సి వస్తోంది. ఇది తప్పితే బియ్యంతో చేసిన అన్నం బాగుంది. – మామిడి అరవయ్య (కూలీ, రెడ్డిగూడెం ఎస్టీ కాలనీ, పాల్వంచ మండలం) -
సహపంక్తి భోజనం.. రాత్రి బస
సాక్షి, హైదరాబాద్: గిరిజన ఆదివాసీలను ఆకట్టుకునే దిశలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పిలుపు మేరకు బుధవారం పార్టీ రాష్ట్ర నాయకత్వం తండాలు, గూడేల్లో బస చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోని రెండు లేదా మూడు తండాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. ‘గిరిజన ఆదివాసీ సంరక్షణ హస్తం’పేరుతో చేపట్టనున్న ఈ కార్య క్రమం ద్వారా రాష్ట్రంలోని ఆదివాసీలు, గిరిజనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను వివరించడంతో పాటు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే మేలు, చేపట్టబోయే ఇతర కార్యక్రమాల గురించి నేతలు వివరించనున్నారు. నివాళి.. నృత్య ప్రదర్శనలు.. నిద్ర బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. తొలుత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, కొమురం భీం, సేవాలాల్ మహరాజ్, ఇందిరాగాంధీ చిత్రపటాలకు నేతలు పూలమాలలు సమర్పించి నివాళులర్పిస్తారు. తర్వాత గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రదర్శనలు, కళాకారులతో నృత్యాలు, పాటలు పాడించడం లాంటివి నిర్వహించనున్నారు. తండాలు, గూడేల్లోని స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమకారులను సన్మానించడంతో పాటు అక్కడి గిరిజనులతో కలిసి సహపంక్తి భోజనాలు చేయనున్నారు. భోజనాల అనంతరం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేదా తండా నాయకుడి ఇంట్లో నిద్రించనున్నారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనులు, ఆదివాసీల వెన్నంటే ఉంటుందని చెప్పడమే ఈ కార్యక్రమ లక్ష్యమని, తండాలు, గూడేలను అక్కున చేర్చుకోవడం ద్వారా అక్కడి గిరిజనులను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు వెల్లడించారు. 13న గాంధీభవన్లో సభ: మల్లురవి యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) వల్ల ఆదివాసీ గిరిజనులకు తీరని నష్టం జరుగుతుందని, ఆదివాసీలను నిర్మూలించడమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళుతోందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లురవి చెప్పారు. ఈ నెల 13న ఆదివాసీలు, గిరిజనులతో వారి సమస్యలపై గాందీభవన్లో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం గాందీభవన్లో టీపీసీసీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు టి.బెల్లయ్య నాయక్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీలకు హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని, వచ్చే ఎన్నికల తర్వాత ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళుతుందని అన్నారు. -
విశాఖ ఏఎస్ఆర్ నగర్లో 134 టిడ్కో ఇళ్ల పంపిణీ
తాటిచెట్లపాలెం: మహావిశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) 45వ వార్డు తాటిచెట్లపాలెం దరి ఏఎస్ఆర్ నగర్లో 134 టిడ్కో ఇళ్లను శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారుల్లో ఎక్కువమంది గిరిజనులున్నారు. వైఎస్సార్సీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, నెడ్క్యాప్ చైర్మన్ కె.కె.రాజు, వార్డు కార్పొరేటర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనోకు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వారితో కలిసి టిడ్కో బ్లాకులను ప్రారంభించారు. ఇక్కడ నిర్మించిన మొత్తం 288 ఇళ్లలో మొదటి విడతగా 134 ఇళ్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారులకు పట్టాలు, ఇంటి తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా కె.కె.రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు డబ్బు కట్టించుకుని ఇళ్లు ఇవ్వడంలో విఫలమయ్యాయని చెప్పారు. వారి నగదును వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాపసు ఇచ్చి, లబ్ధిదారులకు ఉచితంగా టిడ్కో ఇళ్లు ఇస్తోందని తెలిపారు. ఈ కాలనీలో చిన్నచిన్న పనులున్నా.. వర్షాకాలం సమీపించడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడకూడదని త్వరితగతిన ప్రారంభించినట్లు చెప్పారు. వచ్చే దసరాకు వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి సమక్షంలో లబ్ధిదారులందరికీ పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తామని తెలిపారు. అప్పటికి మిగిలిన పనులన్నీ పూర్తిచేయాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భారీ ఫ్లెక్సీకి కాలనీవాసులతో కలిసి కె.కె.రాజు, హనోకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీశ్, ఫ్లోర్లీడర్ బాణాల శ్రీనివాసరావు, జీవీఎంసీ జోన్–5 జోనల్ కమిషనర్ ఆర్.జి.వి.కృష్ణ, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పాపునాయుడు, టిడ్కో ఎస్ఈ డి.ఎన్.మూర్తి, కార్పొరేటర్లు కంటిపాము కామేశ్వరి, బి.గంగారాం, వార్డు అధ్యక్షుడు పైడి రమణ తదితరులు పాల్గొన్నారు. -
నైపుణ్య విద్యను ప్రోత్సహించేలా...!
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)–2020 అమ లులోకి వచ్చి జూలై 29 నాటికి మూడేళ్లవుతోంది. మునుపటి విద్యా వ్యవస్థ లలోని భారీ అంతరాలను గుర్తించి నాణ్యమైన విద్యా వకాశాలు అందరికీ సమా నంగా అందించడం దీని ప్రధాన లక్ష్యం. ప్రీస్కూల్ విద్య నుండి ఆరో తర గతి వరకు మాతృభాష బోధనా మాధ్యమంగాఉండాలని ఎన్ఈపీ ఉద్దేశం. అదేవిధంగా, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ల కోసం కరిక్యులం, క్రెడిట్ ఫ్రేమ్వర్క్ కింద చేసిన సవరణలు ఏకకాలంలో రెండు పూర్తికాల విద్యా కార్యక్రమాలను కొనసాగించడాన్ని అనుమతిస్తున్నాయి. భౌతిక, ఆన్లైన్ మోడ్తో సహా, 4–సంవత్సరాల అండర్ గ్రాడ్యు యేట్ పాఠ్యాంశాలను ప్రోత్సహించడం వంటివి ఉన్నత విద్యలోని ముఖ్యాంశాలు. ఎన్ఈపీ–2020 నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. అలానే తల్లిదండ్రులు, తోటివారి ఒత్తిడి నుండి విద్యార్థికి ఉపశమనం కలిగించడానికి కూడా ప్రాధాన్యం ఇస్తోంది. విద్యార్థులు ఒక సంస్థ నుండి మరొక సంస్థకు, ఒక కోర్సు నుండి మరొక దానికి మారడానికి అవకాశం కల్పిస్తోంది. నైపుణ్య విద్యను ప్రోత్సహించడంలో భాగంగా ఎన్ఈపీ నేరుగా విద్యా సంస్థలతో పరి శ్రమలకు సంబంధాలు ఏర్పరచి చదువుకునే సమయంలోనే సమాంతరంగా వారికి వివిధ వృత్తుల్లో శిక్షణ ఇచ్చి జీవితంలో స్థిరపడే అవకాశాలను కల్పిస్తోంది. వినూత్న బోధనా పద్ధతులపై శిక్షణ అందించడం, ఐసీటీ సాధనాల విస్తృత వినియోగం వంటివి కూడా ఎన్ఈపీలో ముఖ్యమైన అంశాలు. ఎన్ఈపీ అధునాతన పాఠ్యాంశాలు, బోధనపై దృష్టి కేంద్రీకరిస్తూనే విద్యార్థుల సంభావిత అవ గాహన, విమర్శనాత్మక ఆలోచనలనూ ప్రోత్సహి స్తోంది. యోగా, ఫిజికల్ ఎడ్యుకేషన్, పెర్ఫార్మింగ్, విజువల్ ఆర్ట్స్తో పాటు పాఠ్యాంశాలను పునరుద్ధ రించడం, సమగ్ర పరచడం, గిరిజన జీవనశైలిని అర్థం చేసుకోవడానికి గిరిజన గ్రామానికి వెళ్లి జీవించడం, ‘డూయీంగ్ వైల్ లెర్నింగ్’ వంటి విద్యార్థి–కేంద్రీకృత పాఠ్యాంశాలు ఇందుకు నిద ర్శనం. ఎన్ఈపీ–2020 కింద విద్యార్థుల అంతర్లీన అవసరాలను అభివృద్ధి చేయడానికి నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్వర్క్ (ఎన్హెచ్ఈక్యూఎఫ్) వంటి వివిధ ప్రోగ్రామ్లు ప్రారంభించబడ్డాయి. ఎన్ఈపీ–2020 ఈక్విటీ, ఇన్క్లూజన్ అలాగే భాగస్వామ్య పాలన సిద్ధాంతాలపై ఆధారపడింది. అందువల్ల దివ్యాంగులు, మహిళలు, ఎల్జీ బీటీక్యూలు, ఎస్సీ, ఎస్టీలు, పీవీటీజీలు, డీఎన్టీలు వంటి వారికి సాధికారత కల్పించడం, వారికి సమానమైన అవకాశాలను అందిస్తూ అందు బాటులో ఉండటం ఇందులోని చాలా ముఖ్యమైన అంశం. గిరిజనుల కోసం ‘ఏకలవ్య మోడల్ రెసిడె న్షియల్ పాఠశాల’లను బలోపేతం చేయడం, కొత్త ఉపాధ్యాయుల నియామకానికి ప్రాధాన్యత ఇవ్వ డం, కొత్త ఈఎమ్ఆర్ఎస్ ప్రారంభించడం, 10–15 చిన్న పాఠశాలలను కలుపుతూ ‘వన్ స్కూల్ కాంప్లెక్స్’ పునర్నిర్మాణం వంటివి ఇందు కోసం తీసుకున్న కొన్ని చర్యలు. అంతర్జాతీయీ కరణ, సహకారం, భాగస్వామ్య పద్ధతిలో పథకాలను బలోపేతం చేయడం, విదేశీ విశ్వ విద్యాలయాల ఆఫ్–షోర్ క్యాంపస్లను స్థాపించడానికి ఆహ్వానించడం, అలాగే దేశంలో డిజిటల్ ఈ–విశ్వవిద్యాలయాల స్థాపన... ఎన్ఈపీ అమలు ప్రారంభించిన తర్వాత తీసు కున్న మరికొన్ని కార్యక్రమాలు. ఎన్ఈపీ ‘ల్యాబ్ టు ల్యాండ్’, ‘ల్యాండ్ టు ల్యాబ్’ను ప్రమోట్ చేస్తుంది. మొత్తం మీద ఎన్ఈపీ–2020 గత మూడు సంవత్సరాల్లో అనేక స్పష్టమైన ఫలితాలను సాధించగలిగింది. బహుళ ప్రవేశ–నిష్క్రమణ విధానం ద్వారా ఇది విద్యార్థులకు నేర్చుకునే సౌకర్యవంత మైన మార్గాన్ని అందించింది. ఆ విధంగా ఎన్ఈపీ–2020 భారతీయ విద్యా వ్యవస్థ చరిత్రలో నిజమైన గేమ్ ఛేంజర్ అని చెప్పవచ్చు. వ్యాసకర్త వైస్ ఛాన్స్లర్, ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (ఎన్ఈపీ ప్రారంభమై మూడేళ్లు) -
గిరిజనుల అభ్యున్నతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం
సాక్షి, న్యూఢిల్లీ: గిరిజనుల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్ 5వ రాజ్యాంగ సవరణ బిల్లుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోనే కాదు.. దేశంలో ఎక్కడైనా గిరిజనులకు మేలు చేకూర్చే ఎలాంటి చర్యలనైనా వైఎస్సార్సీపీ సమర్థిస్తుందని, సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు. అంతకుముందు సభలో టీడీపీ సభ్యుడు చేసిన ఆరోపణలను ఆయన ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత గిరిజనుల అభ్యున్నతి కోసం చేపట్టిన పలు చర్యలను వివరించారు. ఆంధ్రప్రదేశ్కు మంజూరు చేసిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని గిరిజన నివాసిత ప్రాంతంలోనే నెలకొల్పేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ చూపారని తెలిపారు. ఇందుకు ప్రధానమంత్రి మోదీని ఒప్పించారని గుర్తుచేశారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన వందలాది ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిందన్నారు. గిరిజన యూనివర్సిటీ భవనాలు, క్యాంపస్ నిర్మాణం ప్రారంభమయ్యాయని చెప్పారు. అనాదిగా వైద్య, ఆరోగ్య సౌకర్యాలకు నోచుకోని గిరిజనుల కోసం ఏజెన్సీ ప్రాంతమైన పాడేరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో కూడిన వైద్యకళాశాల నిర్మాణం చేపట్టారన్నారు. పోడు వ్యవసాయమే గిరిజనుల జీవనాధారం అయినందున అటవీహక్కుల గుర్తింపు చట్టం కింద పోడుసాగు చేసే భూములకు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. 1.30 లక్షల ఎకరాల్లో 55 వేలమంది గిరిజనులకు పట్టాల పంపిణీ జరిగిందని తెలిపారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ గిరిజనుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టాక పోడుసాగు చేసే గిరిజనులకు తిరిగి పట్టాల పంపిణీ ప్రారంభించారని చెప్పారు. ఎస్టీ జాబితాలోకివాల్మికి, బోయ కులాలను చేర్చాలి మైదాన ప్రాంతంలో ఆర్థికంగా, సామాజికంగా బాగా వెనుకబడిన వాల్మికి, బోయ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ ఏడాది మార్చిలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందని విజయసాయిరెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 డి కింద ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించారని, దాని ప్రకారం ఎస్టీ జాబితాలోని కులాలకు 7 శాతం రిజర్వేషన్ ఇచ్చారని చెప్పారు. కొత్తగా ఏవైనా కులాలను ఎస్టీ జాబితాలో చేరిస్తే జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్ పరిమితి పెంచాల్సి ఉంటుంది కాబట్టి అప్పటికే ఎస్టీ జాబితాలో ఉన్న కులాలకు ఎలాంటి అన్యాయం జరగదని తెలిపారు. మహిళలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని వైఎస్సార్సీపీ తొలినుంచి డిమాండు చేస్తోందని చెప్పారు. లోక్సభ నుంచి మొదలుపెట్టి స్థానిక సంస్థల వరకు మహిళలకు 50 శాతం స్థానాలను రిజర్వు చేయడం వలన గిరిజనులకు వారికి కేటాయించిన 7 శాతం రిజర్వేషన్ కాకుండా అదనంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కుతుందని తెలిపారు. కనకమేడల ప్రసంగానికి ఖండన అంతకుముందు చర్చలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఏపీలో స్థితిగతులంటూ పేర్కొనడాన్ని విజయసాయిరెడ్డి ఖండించారు. బిల్లు గురించి మాత్రమే మాట్లాడాలని ఉప సభాపతి హరివంశ్ పలుసార్లు చెప్పినప్పటికీ రవీంద్రకుమార్ తన ప్రసంగం తీరు మార్చుకోలేదు. చివరికి ప్రసంగం తీరు మార్చుకోకుంటే మరో సభ్యుడికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని ఉప సభాపతి స్పష్టం చేశారు. బిల్లుయేతర అంశాలు పరిశీలించి వాటిని రికార్డుల నుంచి తొలగిసా్తమని విజయసాయిరెడ్డికి హామీ ఇచ్చారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
No Headline
మంచిని అడ్డుకుంటున్న టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు
జగన్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
జగనన్నపై నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నారు
రాష్ట్రంలో కుల–మతాలకు అతీతంగా పాలన
ఎవరు పిలిచినా వెంటనే పలుకుతా
ఐదేళ్లలో చీరాలను అభివృద్ధిలో ముందుంచాం
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
సాధారణ ప్రసవాలు అయ్యేలా చూడాలి
డ్రెయినేజీలపై ‘కంపు’ రాతలేల?
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement