-
ఇంటర్సిటీల మధ్య వందే మెట్రోలు!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ మార్గాల్లోనే!హైదరాబాద్ నుంచి నల్లగొండ మీదుగా గుంటూరు, సికింద్రాబాద్ నుంచి పెద్దపల్లి మీదుగా కరీంనగర్, సికింద్రాబాద్–కర్నూలు, కాచిగూడ–కర్నూలు, సికింద్రాబాద్–నాందేడ్, సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్నగర్, సికింద్రాబాద్ నుంచి వికారాబాద్ మీదుగా రాయచూర్ తదితర ప్రాంతాలకు ఈ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొదట ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉన్న సికింద్రాబాద్–గుంటూరు, సికింద్రాబాద్–విజయవాడ వంటి రూట్లలో వందే మెట్రోలను ప్రవేశపెట్టొచ్చు. అనంతరం దశలవారీగా ఇతర మార్గాలకు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యమైన స్టేషన్లలోనే హాల్టింగ్.. వందే మెట్రో రైళ్లు ప్రస్తుతం హైదరాబాద్లో నడుస్తున్న మెట్రో రైళ్ల తరహాలోనే ఉంటాయి. మొదట 12 కోచ్లతో ప్రారంభించి డిమాండ్కు అనుగుణంగా ఆ తరువాత 16 కోచ్ల వరకు పెంచనున్నారు. మెట్రో రైళ్ల తరహాలోనే పూర్తిగా ఏసీ సదుపాయం, ఆటోమేటిక్గా తలుపులు తెరుచుకొని మూసుకొనే ఏర్పాటు ఉంటుంది. ప్రారంభ స్టేషన్ నుంచి గమ్యస్థానం వరకు ముఖ్యమైన స్టేషన్లలోనే ఈ రైళ్లకు హాల్టింగ్ సదుపాయం ఉండనుంది. ప్రస్తుతం పుష్పుల్ రైళ్లకు ఉన్నట్లుగానే ముందు, వెనుక రెండు ఇంజన్లు ఉంటాయి. దీంతో ఈ రైళ్లను ప్రత్యేకంగా పిట్ లైన్లకు తరలించాల్సిన అవసరంలేదు. తక్కువ సమయంలోనే తిరుగు ప్రయాణ సేవలను అందించే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్లు ఉండవు... ఈ రైళ్లన్నీ సాధారణ రైళ్ల తరహాలోనే సేవలు అందిస్తాయి. దీంతో ప్రయాణికులు అప్పటికప్పుడు టికెట్లు కొనుక్కొని బయలుదేరొచ్చు. కూర్చొని ప్రయాణం చేసేందుకు వీలుగా సీట్లు ఉంటాయి. అయితే ప్రస్తుతం ఉన్న రైళ్ల కంటే వీటిలో కొద్దిగా టికెట్ ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోవాలనుకొనే వారికి ఈ రైళ్లలో ప్రయాణం లాభదాయకం. వివిధ మార్గాల్లో నడిచే ఇంటర్ సిటీ రైళ్ల స్థానంలోనే వందే మెట్రోలు రానున్నాయి. అయితే ప్రస్తుతం సికింద్రాబాద్–విజయవాడ మధ్య నడుస్తున్న ఇంటర్సిటీ ట్రైన్ యథాతథంగా సేవలను కొనసాగించనుంది. -
వేసవి సెలవుల్లో ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక వారాంతపు రైళ్లను నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మండ్రూప్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైలు (ట్రైన్ నంబర్ 07234) ఈ నెల 28నుంచి జూన్ 30వ తేదీ వరకు ప్రతి ఆదివారం సికింద్రాబాద్ నుంచి సంత్రగచి వరకు నడుస్తుందని పేర్కొన్నారు. సికింద్రాబాద్లో రాత్రి 11.40 బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బరంపూర్, కుర్దారోడ్డు, భువనేశ్వర్, కటక్, బద్రాక్, ఖరగ్పూర్ మీదుగా మంగళవారం ఉదయం 5 గంటలకు సంత్రగచి చేరుతుందన్నారు. ఈ ట్రైన్ (నంబర్ 07235) తిరిగి ఈనెల 30వ తేదీ నుంచి జూలై 2 వరకు మంగళవారాల్లో సంత్రగచిలో మధ్యాహ్నం 12.20కి బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. విజయవాడకు బుధవారం ఉదయం 8.45కు వస్తుంది. 18 బోగీలతో నడిచే ఈ రైళ్లలో ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యం ఉండదన్నారు. స్టేషన్లలో బుకింగ్ కౌంటర్ల వద్ద టికెట్లు పొందవచ్చునని తెలిపారు. యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ టికెట్లు తీసుకోవచ్చని తెలిపారు. -
ఔటర్ రింగ్ రైల్ సర్వే షురూ!
సాక్షి, హైదరాబాద్: ప్రతిపాదిత రీజినల్ రింగురోడ్డును అనుసరిస్తూ నిర్మించబోయే ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు అలైన్మెంట్ రూపొందించేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు ప్రారంభించింది. ప్రాజెక్టుకు సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే పనులకు శ్రీకారం చుట్టింది. స్థూలంగా లైన్ మార్గం ఎలా ఉండాలో డెస్్కటాప్ స్టడీ మొదలుపెట్టింది. ఇది పూర్తి కాగానే, హెలికాప్టర్ ద్వారా లైడార్ సర్వే ప్రారంభించనుంది. దీని ద్వారా అక్షాంశ రేఖాంశాలను ఫిక్స్ చేస్తూ అలైన్మెంట్ సిద్ధమవుతుంది. హైదరాబాద్కు అన్నివైపులా విస్తరించి ఉన్న ఔటర్ రింగురోడ్డు చుట్టూ 50 కి.మీ. నుంచి 70 కి.మీ.దూరంలో రీజినల్ రింగురోడ్డును నిర్మించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే 158 కి.మీ. నిడివి గల ఉత్తర భాగానికి కేంద్రప్రభుత్వం త్వరలో టెండర్లు పిలవబోతోంది. ప్రస్తుతం భూసేకరణ పనులు జరుగుతున్నాయి. ఇక దాదాపు 182 కి.మీ. నిడివితో ఉండే దక్షిణ భాగానికి సంబంధించి కన్సల్టెన్సీ సంస్థ అలైన్మెంటును రూపొందించి ఎన్హెచ్ఏఐకి సమర్పించింది. త్వరలో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే దానికి ఆమోదముద్ర పడనుంది. ఈ రీజినల్ రింగురోడ్డును అనుసరిస్తూ ఔటర్ రింగ్ రైల్ పేరుతో రైల్వే లైన్ నిర్మించేందుకు కూడా కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. గతేడాది ఈ ప్రాజెక్టు ఫైనల్ లొకేషన్ సర్వే కోసం రైల్వే శాఖ రూ.13.95 కోట్లను మంజూరు చేసింది. ఇప్పుడు ఆ పనులు మొదలయ్యాయి. ఆ అలైన్మెంటు కోసం ఎన్హెచ్ఏఐని కోరిన రైల్వే ఉత్తర భాగం రింగురోడ్డు అలైన్మెంటు ఇప్పటికే ఖరారైంది. కానీ, దక్షిణ రింగురోడ్డు అలైన్మెంటు ఖరారు కాలేదు. ఈ మేరకు ఎన్హెచ్ఏఐని కోరిన రైల్వే అధికారులు అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రాథమిక అలైన్మెంటు సిద్ధం చేసుకుని, వెంటనే ఏరియల్ లైడార్ సర్వే ప్రారంభిస్తారు. హెలికాప్టర్లో లైడార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని.. 300 మీటర్ల వెడల్పుతో అలైన్మెంటు కోసం 3డీ మ్యాపింగ్ చేస్తారు. నీటి వనరులు, కాలువలు, గుట్టలు, నిర్మాణాలు.. ఇలాంటి వాటిని గుర్తించి తదనుగుణంగా మార్గాన్ని ఖరారు చేస్తారు. గ్రేడియంట్ ఆధారంగా స్టేషన్ల పాయింట్లను కూడా గుర్తిస్తారు. అక్షాంశరేఖాంశాలను ఫిక్స్ చేస్తూ అలైన్మెంటు ఖరారు చేస్తారు. దాన్ని 3డీ మ్యాపింగ్ చేస్తారు. భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నందున, దీని వల్ల ఆదాయం ఎంత ఉంటుందని తేల్చే రేట్ ఆఫ్ రిటర్న్స్ (ఆర్ఓఆర్) ట్రాఫిక్ సర్వే కూడా చేయనున్నారు. ఆదాయం బాగా ఉంటుందని తేలితే రెండో లైన్ కోసం కూడా ప్రతిపాదిస్తారు. ముందుగా ఒక్క లైన్ను మాత్రమే నిర్మిస్తారు. లైన్తోపాటు విద్యుదీకరణ పనులను కూడా సమాంతరంగా చేపట్టనున్నట్టు తెలిసింది. సరుకు రవాణా రైళ్లకూ ప్రాధాన్యం రింగురోడ్డును ఆసరా చేసుకుని రింగ్ రైల్ ప్రాజెక్టు నిర్మించటం దేశంలోనే తొలిసారి. దీన్ని కూడా సరుకు రవాణా రైళ్లకు ఎక్కువగా ఉపయోగపడేలా చూస్తున్నారు. ప్రస్తుతం గూడ్సు రైళ్లు సికింద్రాబాద్ లాంటి రద్దీ స్టేషన్ల గుండా సాగాల్సి వస్తోంది. అయితే ఔటర్రింగ్ రైల్ కారిడార్ పలు రైల్వే మార్గాలతో అనుసంధానమై ఉండటంతో సరుకు రవాణా రైళ్లు నగరంలోకి ప్రవేశించాల్సిన అవసరం లేకుండానే గమ్యం వైపు పరుగుపెట్టే వీలు కలుగుతుంది. ఇది రైల్వే ట్రాఫిక్కు కూడా రిలీఫ్ క ల్పిస్తుంది. 536 కి.మీ... రూ.12 వేల కోట్లు.. ♦ రీజినల్ రింగురోడ్డు దాదాపు 343 కి.మీ. నిడి వి ఉండనుండగా, దాని చుట్టూ విస్తరించే రైల్వే లైన్ మాత్రం దాదాపు 536 కి.మీ. నిడివితో ఉండనుంది. ఈ ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం రూ.12వేల కోట్లుగా అంచనా. ♦ వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చే ప్రధాన రైల్వే లైన్లను అనుసంధానిస్తూ ఈ ప్రాజెక్టు కొనసాగుతుంది. రైల్వే ట్రాక్ మీదుగా రోడ్డును నిర్మించినట్టుగానే ఆయా ప్రాంతాల్లో రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జిలను నిరి్మస్తారు. అక్కన్నపేట, యాదాద్రి, చిట్యాల, బూర్గుల, వికారాబాద్, గజ్వేల్ తదితర ప్రాంతాల్లో ఆ తరహా వంతెనలు నిర్మించే అవకాశం ఉందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ♦ ఈ రైలు మార్గంలో దాదాపు 50 వరకు రైల్వే స్టేషన్లు ఉండే అవకాశం ఉందని ప్రాథమికంగా తేల్చారు. ♦ 75 మీటర్ల వెడల్పుతో ఈ మార్గం సిద్ధమవుతుంది. స్టేషన్ ఉండే చోట రెండు కి.మీ. పొడవుతో 200 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరిస్తారు. ♦ ఈ ప్రాజెక్టులో ప్రతి కి.మీ.కు రూ.20 కోట్ల వరకు ఖర్చవుతుంది. భూసేకరణలో సగం మొత్తాన్ని కేంద్రం భరించనుంది. -
త్వరలో చర్లపల్లి టెర్మినల్ నుంచి 25 రైళ్లు
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల అనంతరం చర్లపల్లి రైల్వే టెర్మినల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం కృష్ణా, గోల్కొండ, శాతవాహన, ఇంటర్సిటీ రైళ్లకు చర్లపల్లిలో హాల్టింగ్ సదుపాయం ఉంది. ఇది వినియోగంలోకి వచ్చిన తరువాత 25 రైళ్లను ఇక్కడి నుంచే నడిపించేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలను సిద్ధం చేసింది. సికింద్రాబాద్ స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు కొనసాగుతున్న దృష్ట్యా కూడా ప్రస్తుతం ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే కొన్ని రైళ్లను చర్లపల్లికి మార్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల అనంతరం చర్లపల్లి టెర్మినల్ను వినియోగంలోకి తేవాలని నిర్ణయించినట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు. రైల్వేశాఖ సుమారు రూ.430 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ విస్తరణ చేపట్టిన సంగతి తెలిసిందే. అత్యాధునిక సదుపాయాలతో, ఆరులైన్లతో స్టేషన్ను విస్తరించారు. రైళ్లను శుభ్రం చేసేందుకు, నిలిపి ఉంచేందుకు వీలుగా పిట్లైన్లను ఏర్పాటు చేశారు. చర్లపల్లి టెర్మినల్ వినియోగంలోకి వస్తే పలు రైళ్లు సికింద్రాబాద్ వెళ్లకుండా ఇక్కడినుంచే నడుస్తాయి. ఇక్కడినుంచి ప్రతి రోజూ 60 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చని అధికారవర్గాలు చెపుతున్నాయి. చర్లపల్లి ప్రారంభమయ్యాక ఇకనుంచి ఈ రైళ్లు అక్కడినుంచే.. ► కాజీపేట్ నుంచి సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్ల మీదుగా వెళ్లే ముంబై–భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్ప్రెస్, మచిలీపట్నం–షిరిడీ వీక్లీ ఎక్స్ప్రెస్, కాకినాడ–షిరిడీ ట్రైవీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను చర్లపల్లి టెర్మినల్ నుంచే నడిపించే అవకాశం ఉంది. ► అలాగే బీదర్ నుంచి మచిలీపట్నం వరకు నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, కాకినాడ–లింగంపల్లి మధ్య నడిచే గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, కాజీపేట – హడప్సర్ (పూణే) ట్రైవీక్లీ, లింగంపల్లి–కాకినాడ మధ్య నడిచే కోకనాడ ట్రైవీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, టాటానగర్ నుంచి యశ్వంత్పూర్ వరకు నడిచే వీక్లీఎక్స్ప్రెస్, షాలిమార్–హైదరాబాద్ ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్, హైదరాబాద్–చెన్నై ఎక్స్ప్రెస్ రైళ్లను చర్లపల్లి నుంచే నడపనున్నారు. ► జమ్ముతావి–తిరుపతి మధ్య నడిచే హమ్సఫర్ వీక్లీ, గోరఖ్పూర్ నుంచి వచ్చే యశ్వంత్పూర్ వీక్లీ సూపర్ ఫాస్ట్ఎక్స్ ప్రెస్, నిజాముద్దీన్ ఢిల్లీ– బెంగళూరు సిటీ మధ్య నడిచే రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తదితర రైళ్లను కూడా చర్లపల్లి నుంచి నడిపించే ప్రతిపాదనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ► ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా నిర్మించిన మౌలాలి–సనత్నగర్ మార్గం ఇప్పటికే పూర్తయింది. ఈ రూట్లో ప్రస్తుతం గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. చర్లపల్లి టెర్మినల్ను ప్రారంభించిన అనంతరం ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా ఈ రూట్లో నడిపించే అవకాశం ఉంది. దీంతో చర్లపల్లి మీదుగా ముంబై, ఢిల్లీ వైపు రాకపోకలు సాగించే రైళ్లు సికింద్రాబాద్కు వెళ్లకుండా చర్లపల్లి నుంచి మౌలాలి, సనత్నగర్, లింగంపల్లి మీదుగా నడుస్తాయి. సిటీ స్టేషన్లపై తగ్గనున్న ఒత్తిడి.. చర్లపల్లి టెర్మినల్ వినియోగంలోకి వస్తే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపైన ఒత్తిడి తగ్గనుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రతి రోజూ 200 రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. 1.86 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ వినియోగంలో ఉన్న 10 ప్లాట్ఫామ్లపైన ఒత్తిడి పెరగడం వల్ల కొన్ని రైళ్లను నగర శివార్లలోనే నిలిపివేయవలసి వస్తోంది. దీంతో ఉదయం వేళల్లో స్టేషన్కు రావలసిన రైళ్లు సకాలంలో చేరుకోవడం లేదు. దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు సిటీ శివార్లలోనే పడిగాపులు కాయవలసి వస్తోంది. చర్లపల్లి ప్రారంభమైతే సిగ్నల్ కోసం ఇలా ఎదురుచూడవలసిన అవసరం లేకుండా చర్లపల్లి నుంచే రాకపోకలు సాగించవచ్చు. అలాగే కాచిగూడ, నాంపల్లి స్టేషన్లపైన కూడా ఒత్తిడి తగ్గుతుందని చెపుతున్నారు. -
గరీబ్రథ్ జాడేది?
♦ హైదరాబాద్–విశాఖపట్నం మధ్య నిత్యం తిరిగే గోదావరి ఎక్స్ప్రెస్ ప్రయాణ సమయం 12 గంటల 35 నిమిషాలు. ఇందులో మూడో శ్రేణి ఏసీ తరగతి టికెట్ ధర రూ.1395 ♦ సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య వారంలో మూడురోజులు తిరిగే దురొంతో ఎక్స్ప్రెస్ ప్రయాణ సమయం 10 గంటల 15 నిమిషాలు. ఇందులో మూడో శ్రేణి ఏసీ తరగతి టికెట్ ధర రూ.1630 ♦ సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య రోజూ తిరిగే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ ప్రయాణ సమయం 11 గంటలే. ఇందులో మూడో శ్రేణి ఏసీ తరగతి టికెట్ ధర రూ.1085 మాత్రమే. ♦ గోదావరి, దురొంతో ఎక్స్ప్రెస్లతో పోలి స్తే గరీబ్రథ్కు డిమాండ్ ఎక్కువ. కానీ, ఆ శ్రేణి రైళ్ల సంఖ్య పెంచేందుకు కేంద్రప్ర భుత్వం ససేమిరా అంటోంది. కేవలం రంగు మార్పు, ఎల్హెచ్బీ కోచ్ల ఏర్పాటుకే పరిమితమవుతున్నట్టు తెలుస్తోంది. సాక్షి, హైదరాబాద్: పేదలు కూడా తక్కువ ధరతో ఏసీ కోచ్లలో ప్రయాణించే వెసులుబాటు కల్పించాలన్న ఉద్దేశంతో 17 ఏళ్ల క్రితం రైల్వేశాఖ గరీబ్రథ్ కేటగిరీ రైళ్లు ప్రారంభించింది. లాలూప్రసాద్యాదవ్ రైల్వేశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఇవి పట్టాలెక్కాయి. సులభంగా ప్రజలకు తెలిసేలా పూర్తి ఆకుపచ్చ రంగుతో ఈ రైళ్లు ఉన్నాయి. వీటిల్లో అన్నీ ఏసీ మూడో శ్రేణి కోచ్లే. గరిష్ట వేగం గంటకు దాదాపు 130 కిలోమీటర్లు. సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లకంటే ఇవి వేగంగా పరుగుపెడతాయి. అందుకే వాటితో పోలిస్తే ఇవి కొంత తొందరగా గమ్యం చేరుతాయి. సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్ల మూడోశ్రేణి ఏసీ కోచ్లలో ఉండే టికెట్ ధర కంటే దాదాపు 15 శాతం తక్కువ ధరకే గరీబ్రథ్ రైళ్లలో ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. ♦ 2008 ఫిబ్రవరిలో సికింద్రాబాద్–యశ్వంతపూర్ మధ్య, అదే సంవత్సరం అక్టోబరులో సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య రెండు రైళ్లను దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించారు. దేశవ్యాప్తంగా ఈ రైళ్లు వారంలో కొన్ని రోజులు మాత్రమే తిరు గుతాయి. ఒక్క విశాఖపట్నం గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ మాత్రమే నిత్యం తిరుగుతుంది. డిమాండ్ ఎక్కువగా ఉన్నందున అందులో టికెట్ దొర కటం గగనమే. ♦ గతేడాది సంక్రాంతి రోజున సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య వందేభారత్ రైలును ప్రారంభించారు. 16 కోచ్లతో తిరుగుతున్న ఆ రైలులో ఆక్యుపెన్సీ రేషియో 114– 120 శాతంగా ఉంటోంది. దీంతో ఇటీవలే అదే రూట్లో 8 కోచ్లుండే మరో వందేభారత్ను ప్రారంభించారు. కానీ, దీనికంటే ఎక్కువ డిమాండ్ ఉన్నా.. ఆ మార్గంలో రెండో గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ను మాత్రం కేటాయించటం లేదు. ♦ ఇతర నగరాలకు కూడా గరీబ్రథ్ రైళ్లు నడపా లని కోరుతున్నా పట్టించుకోవటం లేదు. సాధా రణ ఎక్స్ప్రెస్ రైళ్ల ఏసీ కోచ్ టికెట్ ధరలను కూడా పేదలు భరించలేరన్న ఉద్దేశంతో గరీబ్రథ్ రైళ్లను ప్రారంభించారు. అలాంటిది వందేభారత్ కేటగిరీ రైలు టికెట్ ధరలను అసలే భరించలేరు. కానీ, వాటి సంఖ్యను మాత్రం పెంచుతూ, 17 ఏళ్లు గడుస్తున్నా రెండో గరీబ్రథ్ను ప్రారంభించలేదు. త్వరలో ఎల్హెచ్బీ కోచ్లు ప్రస్తుతం గరీబ్రథ్ రైళ్లు సంప్రదాయ ఐసీఎఫ్ కోచ్లతో తిరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు వీటితో తీవ్ర ప్రాణనష్టం జరుగుతోందన్న ఉద్దేశంతో.. అన్ని రైళ్లకు ఎల్హెచ్బీ కోచ్లు ఏర్పాటు చేయాలని గతంలోనే కేంద్రం నిర్ణయించింది. వేగంగా ఆ పనులు జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు గరీబ్రథ్ కేటగిరీ రైళ్లకు మాత్రం వాటిని ఏర్పాటు చేయలేదు. త్వరలో వాటన్నింటికి ఎల్హెచ్బీ కోచ్లు ఏర్పాటు చేయాలని తాజాగా రైల్వే నిర్ణయించింది. తొలినుంచి ఆకుపచ్చ రంగు కోచ్లే ఉన్నందున, ఇప్పుడు వాటి రంగు మార్చాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎరుపురంగు వేయాలని భావిస్తున్నట్టు అనధికార సమాచారం. ఎల్హెచ్బీ కోచ్లు ఏర్పాటు చేసినప్పుడు, 3 ఏసీ ఎకానమీ నమూనా కోచ్లు ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. వీటిల్లో బెర్తుల సంఖ్య ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం గరీబ్రథ్లో ఒక్కో కోచ్లో 78 మంది ప్రయాణించే వెసులుబాటు ఉంది. ఆ సంఖ్య 83కు చేరుతుందని సమాచారం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement