- ఇప్పపువ్వు కోసం వెళ్లిన మహిళపై అత్యాచారం
తాడ్వాయి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఇప్పపువ్వు కోసం అడవిలోకి వెళ్లిన గిరిజన మహిళపై అటవీశాఖ బేస్ క్యాంప్ సిబ్బంది అత్యాచారం చేశారు. మండలంలోని బయ్యక్కపేట సమీపంలోని ముసలమ్మపెంట, గొత్తి కోయగూడాలకు చెందిన సోడి. సోమిడి(17)సోడి. బీమమ్మ (22), మరో మహిళ(22)అనే ముగ్గురు మహిళలు ఇప్పపువ్వు కోసం ముసలమ్మపెంట గూడెం అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ విధినిర్వహణలో ఉన్న అటవిశాఖ బేస్ క్యాంపు అధికారులు సంతోష్, విజయ్ మహిళల వెంట పడ్డారు.
వారిని వెంటాడిన అధికారులు ఒక మహిళను పట్టుకొని అఘాయిత్యానికి పాల్పడ్డారు. పెనుగులాటలో అక్కడి నుంచి పరుగులు తీసిన మిగిలిన ఇద్దరు మహిళలు గూడెంలోకి వెళ్లి పెద్ద మనుషులకు సమాచారం ఇచ్చారు. దీంతో శనివారం బాధితురాలి తల్లిదండ్రులు తాడ్వాయి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.