అచ్చంపేట : మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా సంచలనం సష్టించిన దాసరి అశోక్(6) అనే బాలుడి హత్యకేసు మిస్టరీ వీడింది. క్షుద్రపూజల్లో భాగంగానే ఈ నెల 16న దాసరి అశోక్ను దారుణంగా హత్యచేశారని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దారుణానికి పాల్పడిన ఐదుగురు వ్యక్తులు బతికె యాదగిరి, మెదరి బాబు, వెంకటేషు, అచ్చమ్మ, శివ లను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు.
మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేటకు చెందిన అశోక్(6) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే 16 వతేదీ వాళ్ల అన్నతో కలిసి పాఠశాలకు వెళ్లాడు. విరామ సమయంలో అశోక్ను ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటూ తీసుకెళ్లినట్టు స్తానికులు గుర్తించారు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అయితే ఫిబ్రవరి 17 న అచ్చంపేట పట్టణ శివారులో పాడుబడిన బావిలో బాలుడు రక్తపుమడుగులో కనిపించాడు. పంది కళేబరంపై మృతదేహం పడి ఉండడంతో క్షుద్ర పూజల కోసమే బాలుడిని బలి ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాగా ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. మిగిలిన నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా క్షుద్ర పూజల కోసం బాలుడిని చంపేసినట్టు తేలింది. వారిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు.