కేటీఆర్కు ‘లీడర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం
అవార్డులు ప్రకటించిన బిజినెస్ వరల్డ్
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావును మరో పురస్కారం వరించింది. ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ ‘లీడర్ ఆఫ్ ది ఇయర్’అవార్డుకు మంత్రిని ఎంపిక చేసింది. అలాగే పట్టణ మౌళిక వసతుల్లో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణకు మరో పురస్కారం దక్కింది. కొత్త రాష్ట్రాన్ని దేశ యవనికపై తనదైన శైలిలో నిలిపారంటూ కేటీఆర్ను ఈ సందర్భంగా బిజినెస్ వరల్డ్ ప్రశంసించింది. మంత్రి నిర్వహిస్తున్న బాధ్యతలు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్న తీరు, దేశవ్యాప్తంగా ఆయనకు లభించిన పేరు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేసినట్లు వెల్లడించింది.
ఇంటింటికీ తాగునీరు సరఫరా కోసం పట్టణాల్లో మిషన్ భగీరథ.. అలాగే హరితహారం, డబుల్ బెడ్రూం ఇళ్లు లాంటి కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకొని ఉత్తమ పట్టణ మౌలిక సదుపాయాలున్న రాష్ట్రంగా తెలంగాణకు పురస్కారం ప్రకటించామని తెలిపింది. ఈ నెల 20న ఢిల్లీలో నిర్వహించనున్న 5వ జాతీయ స్మార్ట్ సిటీ సదస్సులో పురస్కారాలు స్వీకరించి ప్రసంగించాలని బిజినెస్ వరల్డ్ ఆహ్వానించింది.