శశికళకు ఝలక్ ఇచ్చిన పన్నీరు వర్గం | Sakshi
Sakshi News home page

శశికళకు ఝలక్ ఇచ్చిన పన్నీరు వర్గం

Published Fri, Feb 17 2017 1:23 PM

శశికళకు ఝలక్ ఇచ్చిన పన్నీరు వర్గం

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణం చేయడం, రేపు బలపరీక్ష ఎదుర్కోనున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు మళ్లీ దూకుడు పెంచారు. దెబ్బకు దెబ్బ తీస్తూ, ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అన్నా డీఎంకే నుంచి శశికళను, ఆమె బంధువులు దినకరన్, వెంకటేష్‌లను బహిష్కరించారు. పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్‌ ఈ ముగ్గురిపై వేటు వేసినట్టు ప్రకటించారు.

అమ్మ వారసత్వం కోసం, పార్టీ కోసం శశికళ, పన్నీరు సెల్వం వర్గాలు పోరాడుతున్న సంగతి తెలిసిందే. పన్నీరు సెల్వం, మధుసూదన్లను తొలుత శశికళ పార్టీ నుంచి బహిష్కరించగా.. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆమె ఎన్నిక చెల్లదని, తమను బహిష్కరించే హక్కు ఆమెకు లేదని మధుసూదన్ చెప్పారు. శశికళతో పాటు దినకరన్, వెంకటేష్‌లను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని మధుసూదన్ ఇప్పటికే ఎన్నికల సంఘానికి లేఖ రాయగా, ఆయన వర్గీయులు నేరుగా కలసి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఈసీ పరిశీలనలో ఉంది. జయలలిత గతంలో దినకరన్, వెంకటేష్‌లను పార్టీ నుంచి బహిష్కరించారు. జయ మరణం తర్వాత శశికళ మళ్లీ వాళ్లను పార్టీలోకి తీసుకుని దినకరన్‌ను ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement