ముంబై :మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వారసుడిగా మన్ననలు అందుకుంటున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనతకు చేరువయ్యాడు. పలు రికార్డులను తన పేరిట లిఖించుకునే క్రమంలో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడిన కోహ్లి మరో మైలురాయిని దాటబోతున్నాడు. న్యూజిలాండ్ తో జరిగే తొలి వన్డే ద్వారా అతని కెరీర్ లో 200వ వన్డే మ్యాచ్ ఆడబోతున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించబోతున్న 13వ భారత క్రికెటర్ గా కోహ్లి నిలవనున్నాడు. ఓవరాల్ గా రెండొందల వన్డే ఆడుతున్న 72వ క్రికెటర్.
ఇప్పటివరకూ 199 వన్డేలు ఆడిన కోహ్లి 8, 767 పరుగులు చేశాడు. ఈ క్రమలోనే 30 వన్డే సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అతని యావరేజ్ 55.13 ఉండగా, స్ట్రైక్ రేట్ 91.47 గా ఉంది. ప్రస్తుతం అత్యధిక వన్డే సెంచరీలు చేసిన జాబితాలో కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో సెంచరీ చేస్తే మాత్రం పాంటింగ్ రికార్డును కోహ్లి అధిగమిస్తాడు.