టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేది బీజేపీనే | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేది బీజేపీనే

Published Mon, Jul 9 2018 1:21 AM

Laxman fires on TRS Govt - Sakshi

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేది బీజేపీయేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. ఆదివారం రాత్రి ఆర్టీసీ కల్యాణమండపంలో బీజేపీ జనచైతన్యయాత్ర విజయవంతం అయిన సందర్భంగా డాక్టర్‌ లక్ష్మణ్‌కు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మురళీధర్‌రావు మాట్లాడుతూ బీజేపీ చేపట్టిన జన చైతన్య యాత్రకు రాష్ట్రంలో మంచి స్పందన వచ్చిందని, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారని, ఇది 2019 ఎన్నికల విజయానికి సంకేతమన్నారు. ఇటీవల ఢిల్లీలో అమిత్‌షా అధ్యక్షతన జరిగిన జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో అమిత్‌షా జనచైతన్య యాత్రపై చర్చించామని.. ఇది మంచి నిర్ణయమని కితాబిచ్చారని చెప్పారు. ఈ యాత్ర ప్రారంభమైంది కానీ ఇంకా పూర్తికాలేదని, ఇది ఇంటర్వెల్‌ మాత్రమేనని స్పష్టం చేశారు.

ఈ నెల 19న రాష్ట్రానికి అమిత్‌షా వస్తున్నారని, 2019 ఎన్నికల విషయంపై చర్చలు జరుగుతాయన్నారు. అనంతరం మళ్లీ యాత్ర ప్రారంభమవుతుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ రాచరిక పాలనను అంతమొందించే వరకు విశ్రమించేది లేదన్నారు. రాష్ట్రంలో నిరంకుశత్వం పెరిగిపోయిందని, ఈ ప్రభుత్వాన్ని ప్రజలు సహించలేకపోతున్నారన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీదే గెలుపని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ధర్మారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బద్దం బాల్‌రెడ్డి, యెన్నం లక్ష్మినారాయణ, నాయకులు చింతా సాంబమూర్తి, ప్రేమేందర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, భరత్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement