చౌకబారు ప్రచారం చాలించు

Gadikota Srikanth Reddy comments on CM Chandrababu - Sakshi

     సీఎంపై ఎమ్మెల్యే గడికోట ధ్వజం

     ఒక్క నోటీసుకే ఇంత హడావిడా?

     కరువు గురించి ఆలోచించకుండా ఆపరేషన్‌ గరుడ అంటూ కట్టుకథలు

     మీరు మోపిన అక్రమ కేసులతో మాకు రోజూ నోటీసులు

     మహారాష్ట్ర మంత్రి భార్యకు టీటీడీ సభ్యత్వాన్ని రద్దు చేసే దమ్ముందా?

సాక్షి, హైదరాబాద్‌: ప్రచారం కోసం సీఎం చంద్రబాబు పడుతున్న పాట్లు హాస్యాస్పదంగా ఉన్నాయని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. తనపై బీజేపీ, వైఎస్సార్‌ సీపీ కుట్ర చేస్తున్నాయని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఓ కేసులో కోర్టుకు హాజరుకాని వ్యక్తికి నోటీసులిస్తే అందులో తమ ప్రమేయం ఎలా ఉంటుందని సూటిగా ప్రశ్నించారు. సినీ నటులతో ఆపరేషన్‌ గరుడ అంటూ కట్టుకథలు చెప్పిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కరువు పరిస్థితుల గురించి ఆలోచించకుండా ఆపరేషన్‌ గరుడ అని మరో ఆర్నెళ్ల తరువాత ఆపరేషన్‌ పెరుగువడ అని పచ్చ మీడియాలో చర్చ నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. గడికోట శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 

నోటీసులనూ ప్రచారం కోసం వాడుకుంటారా?
కోర్టుకు హాజరు కావాలంటూ ఇచ్చిన నోటీసును కూడా చంద్రబాబు రాజకీయం చేయడం, ప్రచారం కోసం వాడుకోవటం దారుణమని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. సమైక్య రాష్ట్రం కోసం ఆందోళనలతోపాటు చంద్రబాబు పాలనలో  ప్రత్యేక హోదా, రైతు సమస్యలపై ధర్నాలు చేసినందుకు మోపిన అక్రమ కేసుల వల్ల తమకు రోజూ ఏదోఒక నోటీసులు వస్తున్నాయని తెలిపారు. నిజంగానే చంద్రబాబు మీద కుట్ర జరుగుతుంటే మహారాష్ట్ర మంత్రి భార్యకు టీటీడీ బోర్డులో కల్పించిన సభ్యత్వాన్ని రద్దు చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు.

ఇకనైనా రైతులను పట్టించుకోండి
చంద్రబాబు చౌకబారు ప్రచారాన్ని మానుకుని దుర్బిక్షంతో అల్లాడుతున్న రైతుల గురించి కాస్తయినా పట్టించుకోవాలని గడికోట హితవు పలికారు. కొన్నేళ్లుగా రాయలసీమలో దుర్భర పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క కేబినేట్‌ మీటింగ్‌లోనైనా కరువు పరిస్థితిపై చర్చించని ముఖ్యమంత్రి జలహారతి అనడం విడ్డూరంగా ఉందన్నారు. రాయలసీమలో 400 మి.మీ వర్షపాతం కురవాల్సి ఉంటే 62 శాతం తక్కువగా ఉందని ప్రభుత్వ నివేదికలే వెల్లడిస్తున్నాయని గడికోట చెప్పారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాయలసీమ కరవును దృష్టిలో ఉంచుకుని పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామరŠాధ్యన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచితే ఇప్పుడు నీటిపారుదల మంత్రిగా ఉన్న వ్యక్తి ప్రకాశం బ్యారేజీ వద్ద ఆందోళన చేశారని గుర్తుచేశారు.   

23 అనుమతులు వైఎస్‌ హయాంలోనే..
అధికారంలో ఉండగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయాలనే ఆలోచన చంద్రబాబు ఏనాడూ చేయలేదని గడికోట పేర్కొన్నారు. దేవాదుల, నెట్టెంపాడు, ప్రాణహిత చేవెళ్ల గురించి ఆయనెప్పుడూ ఆలోచించలేదన్నారు. అలాంటి వ్యక్తి బాబ్లీ గురించి, రైతుల గురించి పట్టించుకుంటారా? అని ప్రశ్నించారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమను కాపాడినా, ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమందికి మేలు చేసినా ఏనాడూ ప్రచారం చేసుకోలేదన్నారు. పోలవరానికి 23 అనుమతులు వైఎస్‌ హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు ప్రతిసారీ టెంకాయ కొట్టి అన్నీ తానే చేస్తున్నట్టు ఫోజులిస్తున్నారని విమర్శించారు. 

పంటలసాగు కుదేలు
ఏటా సాగు విస్తీర్ణం తగ్గుతుంటే వ్యవసాయ రంగం ఏపీ నెంబర్‌వన్‌గా ఉందని చంద్రబాబు మోసపూరిత మాటలు చెబుతున్నాడని శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. పప్పుధాన్యాల విస్తీర్ణం 11 రాష్ట్రాల్లో పెరిగితే ఏపీలో మాత్రం తగ్గిందన్నారు. నూనెగింజల సాగు విస్తీర్ణం తొమ్మిది రాష్ట్రాల్లో పెరిగితే ఏపీలో మాత్రం తగ్గిందని చెప్పారు. చెరకు 8 రాష్ట్రాల్లో పెరిగితే మన దగ్గర తగ్గిందని వివరించారు. పత్తి సాగు తెలంగాణలో 1.8 లక్షల హెక్టార్లలో పెరిగిందని, ఏపీలో కేవలం 10 వేల హెక్టార్లలోనే పెరిగిందని తెలిపారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 2008–09లో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో  దాదాపుగా 71.12 లక్షల హెక్టార్లలో సాగు జరిగిందని వివరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 59 లక్షల హెక్టార్లకు సాగు పడిపోయిందన్నారు. నాబార్డు నివేదిక పరిశీలిస్తే ఏపీలో రైతు కుటుంబాల ఆదాయం దేశంలోనే 28వ స్థానంలో ఉందని గడికోట తెలిపారు. అప్పుల ఊబిలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామని చెప్పారు. చంద్రబాబు పాలనలో మేలు జరిగినట్లు ఒక్క రైతుతోనైనా చెప్పించగలరా? అని ప్రశ్నించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top