హైదరాబాద్: రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుం దని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. చంచల్ గూడ జైల్లో ఉన్న మంద కృష్ణ మాదిగను ఆమె మంగళవారం ములాఖత్లో పరామర్శిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుట్ర పూరితంగా మంద కృష్ణపై అక్రమ కేసులు నమోదు చేశారన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎన్ని విధ్వం సాలు చేసినా ఒక్క రోజు కూడా జైల్లో ఉండలేదని, అదే శాంతియుతంగా నిరసన తెలిపిన మంద కృష్ణను వారం రోజుల పాటు జైల్లో పెట్టడం దుర్మార్గమని అన్నారు. తెలంగాణలో నెలకొన్న దుస్థితిని చూసి ఆంధ్రా ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఆమెతో పాటు మాజీ మంత్రి శంకర్రావు కూడా కృష్ణను కలిశారు.
మంద కృష్ణను కలిసిన చాడ, విమలక్క...
జైల్లో ఉన్న మంద కృష్ణను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, అరుణోదయ మండలి అధ్యక్షురాలు విమలక్క కూడా మంగళవారం ములాఖత్లో పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకట్రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సీఎం చొరవ తీసుకుని అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలన్నారు. భారతి మరణానికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. ఉద్యమంలో ఎవరి చేతుల మీద నిమ్మరసం తాగి దీక్ష విరమించారో ఆయన్నే నేడు జైలుకు పంపిన ఘనత కేసీఆర్కు దక్కిందని విమలక్క అన్నారు.