అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో జరిగిన పురపాలకసంఘ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తం 75 పురపాలక సంఘాలకుగాను బీజేపీ 47 చోట్ల గెలుపొందింది. 2013 పురపాలక ఎన్నికల్లో 59 మున్సిపాలిటీల్లో బీజేపీ గెలవగా, ప్రస్తుతం ఆ సంఖ్య 12కు తగ్గి 47కి పరిమితమవడం గమనార్హం. కాంగ్రెస్ 2013లో కేవలం 8 స్థానాలు సాధించగా, తాజాగా ఆ సంఖ్యను రెట్టింపు చేసుకుని 16 మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది.
ఆరు పురపాలక సంఘాల్లో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాలేదు. ఎన్సీపీ, బీఎస్పీలు చెరో మున్సిపాలిటీని చేజిక్కించుకున్నాయి. నాలుగు మున్సిపాలిటీలు స్వతంత్రుల వశమయ్యాయి. స్పష్టమైన ఆధిక్యం రాని ఆరింటిలో మూడు చోట్ల బీజేపీ, కాంగ్రెస్లు సరిసమానంగా 14 వార్డుల్లో గెలిచాయి. 75 మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 2,060 వార్డులుండగా బీజేపీ 1,167, కాంగ్రెస్ 630, ఎన్సీపీ 28, బీఎస్పీ 15, స్వతంత్రులు 202, చిన్న పార్టీలు 18 గెలుపొందాయి.