కాసుల వేటలో ఎడారి దేశాలకు వెళ్లడం ఎంత ప్రమాదమో.. అక్కడి పరిస్థితులు, మనుషులు ఎలా ఉంటారో యదార్థంగా చెప్పే ఘటన ఇది. సాటి మనిషిని.. మనిషిలా చూడడం చేతగాని సమాజం మధ్యలో చిత్రహింసలు పడ్డ యువతి గాధ ఇది.
సాక్షి, మంగళూరు : ‘వాళ్లు నన్ను జంతువుకంటే హీనంగా హింసించారు.. బానిసకన్నా దరుణంగా చూశారు’ అక్కడి వాళ్ల గురించి చెప్పడానికి ఇంతకన్నా నా దగ్గర పదాలు లేవని మంగళూరుకు చెందిన జసింతా మెండోంకా అన్నారు. డబ్బు సంపాదించుకోవాలని వెళ్లిన నేను.. సౌదీ అరేబియాలో ఒక ఇంట్లో 14 నెలలు బానిసకన్నా హీనంగా బతికాను అని ఆమె ఆవేదనతో చెప్పుకొచ్చారు.
ఖతర్లో మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి.. హోమ్మెయిడ్స్ (ఇంట్లో పనిమనుషులు)కు మంచి డిమాండ్ ఉందుకు తగ్గ వేతనం ఉంటుందని ముంబైలోని ఒక రిక్రూటింగ్ ఏజెన్సీ నన్ను మాయ చేసిందని ఆమె చెప్పారు. వారి మాటలు నమ్మి.. హోమ్ మెయిడ్గా పనిచేసేందుకు అంగీకరించాను.. వాళ్లు ఖతర్తో ఉద్యోగం అని చెప్పి నన్ను మొదట దుబాయ్ తీసుకెళ్లారు. మొదట అక్కడ నుంచి సౌదీ అరేబియా తీసుకెళ్లారు. సౌదీలోని యాంబు టౌన్లో ఒక ఇంట్లో హోమ్ మెయిడ్గా ఉంచారు. ఆ ఇంట్లో గడిపిన 14 నెలలు నరకం అంటే ఏమిటో చూశాను. అక్కడ నన్ను బానిసా చూశారు.. కుక్క కంటే హీనంగా హింసించారు. చిన్న పిల్లల దగ్గనుంచి ఇంటి యజమారి ముగ్గురు భార్యలతో సహా అందరూ శారీరకంగా నన్ను హింసించారు.
గాలి, వెలుతురు కూడా ఆడని నాలుగుగోడల మధ్యలో నన్న పడుకోమనేవారు.. తినడానికి తిండి పెట్టేవారు కాదు.. నీళ్లు ఇమ్మంటే.. పిల్లలు మూత్రం పోసేవారు. ఆ పరిస్థితుల్లో అక్కడ నుంచి నేను పారిపోయేందుకు 2016లో ప్రయత్నించాను. అయితే పోలీసులు నన్ను పట్టుకుని వారికి అప్పగించారు. అప్పటినుంచి పరిస్థితి మరింత దారుణంగా తయారైందన్నారు.
సౌదీలో దారుణ పరిస్థితుల్లో ఉన్న నేను ఉడిపిలోని హ్యూమన్ రైట్స్ ప్రొటక్షన్ ఫౌండేషన్తో మాట్లాడాను. నా బాధను అర్థం చేసుకున్న ఫౌండేషన్ పెద్దలు.. నన్ను కాపాడారు. ఏప్రిల్ నెల నుంచి ప్రయత్నం చేస్తే.. నేను సెప్టెండబర్ 22న తిరిగి మంగళూరుకు రాగలిగాను అని చెప్పారు. మోసం చేసిన రిక్రూటింగ్ ఏజెన్సీ మీద కేసు వేస్తానని చెప్పారు. మోసపూరిత ట్రావెల్ ఏజెన్సీలను నమ్మి ఎవరూ.. ఎడారి దేశాలకు వెళ్లొద్దని హితవు చెప్పారు.