సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: చెన్నై నుంచి కాజీపేట్కు 643 కి.మీ. దూరాన్ని మూడుగంటల్లో చేరుకునేలా భారతీయ రైల్వే ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం చెన్నై–కాజీపేట్ కారిడార్లో సెమీ హైస్పీడ్ రైలు నెట్వర్క్కు (గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా) ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేలా జర్మన్ రైల్వేస్తో మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది.
ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల మధ్య 643 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించేందుకు 11 గంటల సమయం పడుతోంది. ఈ సెమీ హైస్పీడ్ నెట్వర్క్ అభివృద్ధి జరిగితే.. 3.15 గంటల్లోనే ప్రయాణం పూర్తవుతుంది. మూడు దశల్లో, 22 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించినట్లు ఒప్పందం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. చెన్నై–గూడూరు–నెల్లూరు–తెనాలి–విజయవాడ–వరంగల్–కాజీపేట కారిడార్ 135 కిలోమీటర్లు దక్షిణ రైల్వేలో, 508 కిలోమీటర్లు దక్షిణమధ్య రైల్వేలో భాగంగా ఉంది. ఈ కారిడార్లో విద్యుదీకరణ సంపూర్ణంగా పూర్తయింది.