ఆ ఊరిలో 75 ఇళ్లు...47 మంది ఐఏఎస్లు

ఆ ఊరిలో 75 ఇళ్లు...47 మంది ఐఏఎస్లు - Sakshi


లక్కో: అది ఉత్తరప్రదేశ్‌లోని జాన్పూర్ జిల్లాలో ఓ కుగ్రామం. పేరు మధోపట్టి. మొత్తం గ్రామంలో 75 ఇళ్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఆ ఊరు విశిష్టత ఏమిటంటే ఇప్పటి వరకు ఆ చిన్న గ్రామం ఏకంగా 47 మంది ఐఏఎస్ అధికారులను ఇచ్చింది. ముస్తఫా హుస్సేన్ అనే వ్యక్తి ఆ గ్రామం నుంచి ఎంపికైన తొలి ఐఏఎస్ అధికారి. ఆయన 1914లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో పాసయ్యారు. పీసీఎస్లో చేరారు. ఆ తర్వాత ఇందూ ప్రకాష్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో రెండో ర్యాంకు సాధించారు. ఇక ఆ తర్వాత ఊరిలోని విద్యావంతులంతా వారి బాటే పట్టారు.



 అలా అలా...47 మంది ఐఏఎస్ అధికారులను ఆ ఊరు ఇచ్చింది. అంతేకాదు ఆ ఊరికి చెందిన ఉన్నత విద్యావేత్తలు ఇస్రో, బాబా ఆటమిక్ రీసర్చ్, ప్రపంచ బ్యాంకులలో ఉన్నత పదవుల్లో పనిచేస్తున్నారు. ఇటీవలనే ఆ ఊరు అరుదైన రికార్డునూ నెలకొల్పింది. పూరిపాకలో నివసిస్తూ చదువుకున్న వినయ్ కుమార్ సింగ్, ఛత్రపాల్ సింగ్, అజయ్ కుమార్ సింగ్, శశికాంత్ సింగ్ అనే నలుగురు అన్నదమ్ములు కూడా ఐఏఎస్ అధిరులయ్యారు. అందరిలోకన్నా పెద్దవాడైనా వినయ్ కుమార్ సింగ్ 1955లోనే ఐఏఎస్ పరీక్ష పాసై బీహార్ చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు. ఛత్రపాల్ సింగ్ తమిళనాడు చీఫ్ సెక్రటరీగా పనిచేశారు.



 ఆ ఊరి విద్యార్థులంతా ఇంటర్మీడియట్ నుంచే ఐఏఎస్ లక్ష్యంగా పుస్తకాలు, గైడ్లు చదువుతూ ఉంటారని అరవింద్ కుమార్ అనే ఆ ఊరు టీచర్ ఒకరు మిడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. హిందీ మీడియంలోనే విద్యార్థులు చదువుతున్నప్పటికీ ఇంగ్లీషు నేర్చుకొని మరీ ఐఏఎస్ పరీక్షలకు ప్రిమేర్ అవుతుంటారని ఆయన చెప్పారు.  ఉత్తరప్రదేశ్లోని ఘాజిపురాకు ‘ఆర్మీ విలేజ్’ అని పేరు వచ్చినట్లుగానే మధోపట్టికి ‘ఐఏఎస్ల విలేజ్’ అని పేరు వచ్చింది. ఘాజిపురాలో ప్రతి ఇంటికి ఒకరు సైన్యంలో ఉన్నారు.



 కుగ్రామం మధోపట్టి 47 మంది ఐఏఎస్ అధికారులను ఇచ్చినప్పటికీ వారు మాత్రం ఊరికి ఏమివ్వలేక పోయారు. రోడ్లు అధ్వాన్నం. విద్యుత్, ఆరోగ్య సదుపాయాలు అంతంత మాత్రం. విద్యార్థుల ఆసక్తి మేరకు అక్కడ ఒక్క ఐఏఎస్ కోచింగ్ సెంటరైనా లేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top