గోల్డ్ స్టోన్ ప్రసాద్కు ఐటీ షాక్
సాక్షి, హైదరాబాద్ : నగరంలో గత జూన్లో వెలుగులోకి వచ్చిన భూస్కామ్లో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గోల్డ్ స్టోన్ ప్రసాద్కు ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. ఆయన ఆఫీసులో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తోంది. చర్లపల్లి, సికింద్రాబాద్ల్లో ఈయనకు సంబంధించిన ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఈ స్కామ్ ద్వారా రెవెన్యూ డిపార్ట్ మెంట్లో లొసుగులతో కోట్లు కొట్టేశాడని ఆరోపణలున్నాయి. అంతేకాక వివాదస్పద భూములను తనఖాపెట్టుకుని గోల్డ్ స్టోన్ ప్రసాద్కు బ్యాంకులు కోట్లాది రూపాయలు రుణాలు ఇచ్చాయి. నగర శివార్లలో ఉన్న ప్రసాద్ భూములపై ఏసీబీ కూడా ఫోకస్ చేసింది. ప్రస్తుతం గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే తనిఖీలు చేపట్టింది.
గోల్డ్ స్టోన్ ప్రసాద్ అసలు పేరు పొన్నావుల సంజీవ ప్రసాద్. గాంధీ మెడికల్ కాలేజీలో 1970 మెడిసిన్ బ్యాచ్. సైక్రియాట్రిస్ట్ గా ప్రాక్టీస్ కూడా చేశాడు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లాడు. అదే సమయంలో ప్రసాద్ ఓ డీల్ చేసి పెద్ద మొత్తంలో వెనకేసినట్లుగా ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి స్టెతస్కోపుని పక్కన పెట్టి..వ్యాపారంలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. కీ స్టోన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, పీఎస్ ఇన్వెస్ట్ మెంట్స్ పేరుతో కంపెనీ మొదలుపెట్టాడు. అప్పటినుంచి ఆయన పేరు గోల్డ్ స్టోన్ ప్రసాద్ గా మారిపోయింది.