అనుమానాస్పద స్థితిలో యువతి మృతి | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

Published Sun, Aug 28 2016 4:49 PM

సంఘటనా స్థలం వద్ద పోలీసు సిబ్బంది. - Sakshi

సోంపేట : జాతీయ రహదారి పక్కన బేసిరామచంద్రాపురం గ్రామ సమీపంలో గుర్తు తెలియని యువతి (23) మృతదేహం శనివారం వెలుగు చూసింది. దీంతో బేసిరామచంద్రపురం పరిసర గ్రామాల్లో కలకలం రేగింది. బేసిరామచంద్రపురం సమీపంలో రియల్‌ ఎస్టేట్‌ ఆవరణలో ఎవరిదో మృతదేహం ఉందని స్థానికులు శనివారం సాయంత్రం పోలీసులకు సమాచారం తెలియజేశారు. దీంతో సీఐ సూరినాయుడు, బారు ఎస్‌ఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు... బేసిరామచంద్రపురం సమీపంలో లభించిన మృతదేహం 23 సంవత్సరాల యువతిగా భావిస్తున్నామని చెప్పారు. యువతి నలుపు రంగు ఫ్యాంట్, నలుపు రంగు టాప్‌ ధరించి ఉందని, చేతికి వాచీ, వెండి కడియం, వెండి రింగు ఉన్నాయని తెలిపారు. సంఘటన స్థలంలో కాళ్ల చెప్పులు దొరికాయని చెప్పారు.
 
గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్టు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు. రెండు రోజుల నుంచి మృతదేహం ఉన్నట్టు తెలుస్తుందన్నారు. పై ఆనవాలు ఉన్న యువతి కనిపించకపోతే బారువ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు. ఇదిలా ఉండగా ఈ వార్త పరిసర గ్రామాల్లో వ్యాపించగా బేసిరామచంద్రపురంతో పాటు బూరగాం, పలాసపురం, లక్కవరం గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.  

Advertisement
Advertisement