తీపిని పంచాల్సిన చక్కెర పరిశ్రమల శాఖ గులాబీ నేతలకు చేదును రుచి చూపిస్తోంది. ఇక్కడ పనిచేస్తున్న ఓ ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య తగాదా కాస్తా.. ఇద్దరు నాయకుల ప్రాబల్యానికి పరీక్ష పెడుతోంది. చివరకు ఆ శాఖ అమాత్యుడు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. ఈలోగా టీఆర్ఎస్ నేతలకు చెందిన ఆ రెండు ‘ దశమ’ గ్రహాలు జూలు విదిల్చాయి. అసలు కథేంటంటే... ఓ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అల్లుడు ఒకాయన. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ పెద్దల అండతో రాష్ట్రం దాటుకుని వచ్చి, తన శాఖ కాని శాఖలో తిష్టవేశారు. ఇపుడా మాజీ మంత్రి, ఆయన తనయ మాజీ ఎమ్మెల్యే అధికార పార్టీ తీర్థం పుచ్చుకుని పోస్టును కాపాడారు. ఈ అధికారి పక్కకు తప్పుకుంటే కానీ, తనకు ఉన్నత పీఠం దక్కదని కాచుక్కూర్చున్న మరో అధికారీ తన ప్రయత్నాలకు పదును పెట్టారు. ఈయన ఓ ఉప ముఖ్యమంత్రి అక్కకు సొంత అల్లుడు. ఇంకేం, ఒక వైపు ఉప ముఖ్యమంత్రి, మరో వైపు మాజీ మంత్రి తమ వాడికోసం ప్రచ్ఛన్న పోరుకు దిగారు. ఈ దశమ గ్రహాల పంచాయితీ తీర్చడానికి చివరకు ఆ శాఖ మంత్రి ఓ మీటింగే పెట్టాల్సి వచ్చింది. ఇంకా ఏమీ తేలలేదు కానీ, చక్కెర శాఖలో ఉప ముఖ్యమంత్రి పైచేయి సాధిస్తారా..? లేక మాజీ మంత్రా..? అన్న ఆసక్తి గులాబీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ..!!