అతి వేగం.. ప్రాణాలు తీసింది
బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకుల మృతి
రాజపూడి శివారులో ఘటన
తూర్పుగోదావరి, జగ్గంపేట: ఐదు నిమిషాల్లో వాళ్లు ఇంటికి క్షేమంగా చేరుకుంటారు. అయితే వారిని అతివేగం మృత్యువు రూపంలో వచ్చి ప్రాణాలు తీసింది. జగ్గంపేట గోకవరం రోడ్డులో మండల పరిధిలోని రాజపూడి శివారులో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న కోన కుమారస్వామి (29), సిరసపల్లి సోముబాబు(30) మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం రాజపూడి నుంచి ఇంటికి వెళ్లేందుకు కుమారస్వామి, సిరసపల్లి సోముబాబు బయల్దేరారు.
సుమారు రెండు కిలో మీటర్ల దూరం గల గ్రామానికి చేరుకునే ప్రయత్నంలో కుక్క అడ్డురావడంతో వేగంగా వెళుతున్న బైక్ అదుపుతప్పి ఇద్దరూ రోడ్డుపై పడిపోవడంతో తలలకు బలమైన గాయాలయ్యాయి. రక్తపు మడుగుల్లో ఉన్న ఇద్దరిని జగ్గంపేటలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గంలోనే ప్రాణాలు కోల్పోయారు. కుటుం బసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, కుమారస్వామి అవివాహితుడని, సోముబాబుకు భార్య ఉందని ఎస్సై తెలిపారు. మృతదేహాలకు పె ద్దాపురం ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. గ్రామంలో ఉత్సాహం ఉండే ఇద్దరు యువకుల అకాల మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతదేహాలకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారు.