అభిమాన నాయకుడు వైఎస్ జగన్ వస్తున్నాడని తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా రామచంద్రాపురం తరలివచ్చారు. పోలీస్స్టేషన్ ఎదురుగా ఉన్న వీధులన్నీ జనంతో కిటకిటలాడాయి. సీ రామాపురం, నెన్నూరు వెళ్లే మార్గాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వైఎస్ జగన్ ప్రసంగం పూర్తయ్యే వరకూ జనం కదల్లేదు. వైఎస్ఆర్ గురించి ప్రస్తావించిన ప్రతిసారీ జనంలోంచి పెద్ద ఎత్తున స్పందన కనిపించింది.
సాక్షి ప్రతినిధి, తిరుపతి :
‘‘ఈ వ్యవస్థ మారాలి. అవినీతి, మోసాలతో కూడిన రాజకీయాలు తగ్గాలి. రాజకీయాల్లో విశ్వసనీయత పెరగాలి. ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చలేని నాయకుడు ఎవరైనా సరే..తన∙పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయే రోజులు రావాలి. ఇది జగన్ ఒక్కడి వల్లనే సాధ్యం కాదు. మీరంతా నాకు తోడూ నీడగా నిలబడాలి. చల్లని మనస్సుతో ఆశీర్వదించాలి. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేయడానికి కంకణం కట్టుకున్న మీ బిడ్డకు అండగా నిలబడాలి. లక్ష్యం నెరవేరేలా సహకరించా లని.. విపక్షనేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముకుళిత హస్తాలతో ప్రజలను కోరారు. శనివారం సాయంత్రం 4 గంటలకు చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విపక్షనేత వైఎస్ జగన్ ప్రసంగించారు.
సొంత జిల్లాను, సొంతూరున్న చంద్రగిరి నియోజకవర్గ ప్రగతిని పట్టించుకోని సీఎం చంద్రబాబు రాష్ట్రాన్నేం ఉద్దరిస్తారని విమర్శించారు. నియోజకవర్గంలో 138 పంచాయతీలుండగా 70 శాతం గ్రామాల్లో నేటికీ తాగునీటి సమస్య తాండవిస్తోందన్నారు. చంద్రగిరి, ఎర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు మండలాల్లో ఏనుగుల దాడులు పెరిగి పంట పొలాలు దెబ్బతింటున్న ఏ ఒక్క రైతుకైనా నష్టపరిహారం ఇప్పించారా అని ప్రశ్నించారు. దారుణమైన మోసాలతో ఉన్న ఉద్యోగాలన్నీ ఊడబెరికే పనులు చేస్తున్న చంద్రబాబు పాలనకు స్వస్తి పలకాలని ప్రజలకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
పాదయాత్ర సాగిందిలా...
శనివారం ఉదయం 8.30 గంటలకు కుప్పం బాదూరు నుంచి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైంది. పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, తలశిల రఘురాంలతో పావుగంట పాటు మాట్లాడిన వైఎస్ జగన్ పాదయాత్రకు ఉపక్రమించారు. తిరుపతి నుంచి వచ్చిన పార్టీ నేతలు పెంచలయ్య, బండ్ల లక్ష్మీపతి, బాలిశెట్టి కిషోర్, గణేష్ నిరుద్యోగ భృతి విషయంలో సీఎం చంద్రబాబు చేసిన మోసాలను గుర్తు చేస్తూ రూ.2 వేల నోటుతో తయారు చేసిన టోపీలను వైఎస్ జగన్కు అందజేశారు. కుప్పం బాదూరులోని పలువురు మహిళలు జగన్ను కలిసి పింఛన్లు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి బార్ అసోసియేషన్ సభ్యులైన న్యాయవాదులు పలువురు కలిసి ప్రజా సంకల్పయాత్రకు మద్దతు పలికి తమ సమస్యలను వివరించారు.
రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సేవా సమితి నాయకులు వైఎస్ జగన్ను కలిసి రాజకీయంగా తమ సామాజికవర్గానికి ప్రాధాన్యత అవసరమని కోరారు. కుప్పం ద్రవిడ యూనివర్సిటీ మాజీ వీసీ కంకణాల రత్నయ్య వైఎస్ జగన్ను కలిసి కొంతసేపు పాదయాత్ర చేశారు. దళిత మహాజన సంఘం నాయకులు వైఎస్ జగన్ను కలిసి ఎస్సీ వర్గీకరణ అంశం 24 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉందని, ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందేలా చూడాలని కోరారు. ఒడ్డుకాల్వ ప్రాంతంలో జిల్లా ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు వైఎస్ జగన్ను కలిసి ఇళ్లు, ప్రత్యేక రాయితీలపై వినతిపత్రం అందజేశారు. యూఎస్ఏలోని సార్లెట్ నుంచి మదన్మోహన్రెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి వచ్చి పాదయాత్రకు మద్దతు పలికారు.