నేడు (22న) దేశీ స్టాక్ మార్కెట్లు కొంతమేర ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 32 పాయింట్లు క్షీణించి 10,215వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ జూన్ నెల ఫ్యూచర్స్ 10,247 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ఆరు రాష్ట్రాలలో తిరిగి కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడంతో శుక్రవారం యూఎస్ మార్కెట్లు నేలచూపులతో నిలిచాయి. డోజోన్స్, ఎస్అండ్పీ డీలాపడగా.. నాస్డాక్ స్వల్పంగా బలపడింది. యూరోపియన్ మార్కెట్లు మాత్రం 0.4-1 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే ప్రస్తుతం ఆసియాలో హాంకాంగ్, కొరియా స్వల్పంగా నష్టపోగా.. సింగపూర్, తైవాన్, చైనా 0.5 శాతం చొప్పున బలపడ్డాయి. జపాన్, ఇండొనేసియా నామమాత్ర లాభాలతో కదులుతున్నాయి. సరిహద్దులో చైనాతో సైనిక వివాదం నేపథ్యంలో నేడు మరోసారి దేశీయంగా మార్కెట్లు ప్రతికూలంగా ప్రారంభంకానున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. తదుపరి ఆటుపోట్లను చవిచూడవచ్చని అంచనా వేస్తున్నారు. కాగా.. హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ బలపడటంతో వారాంతాన సెన్సెక్స్ 524 పాయింట్లు జంప్చేసి 34,732 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 153 పాయింట్లు ఎగసి 10,244 వద్ద ముగిసింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 10,121 పాయింట్ల వద్ద, తదుపరి 9,997 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,320 పాయింట్ల వద్ద, ఆపై 10,396 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 20,988 పాయింట్ల వద్ద, తదుపరి 20,639 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్ నిఫ్టీకి తొలుత 21,578 పాయింట్ల వద్ద, తదుపరి 21,818 స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.
ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్స్
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1237 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 881 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి.