ఈ-కామర్స్ ద్వారా ఇప్పటి వరకు చిన్న, మధ్య తరహా వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపిన అమెజాన్.. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగాన్ని అతలాకుతలం చేయబోతుంది. 'బ్యాంకు ఆఫ్ అమెజాన్'తో భారత్, మెక్సికో దేశాల్లో పేమెంట్ సర్వీసులను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. పెట్టుబడులు, కొనుగోళ్ల కోసం ఫైనాన్స్ టెక్నాలజీ స్టార్టప్లను కూడా సంప్రదిస్తున్నట్టు సీబీఐ ఇన్సైట్స్ రీసెర్చ్ రిపోర్టు చేసింది. భారత్లో ఇంటివద్దే క్యాష్-పిక్అప్ సర్వీసుల కోసం అమెజాన్ ప్రత్యేకంగా తన వినిమోగదారులకు డిజిటల్ వాలెట్ కూడా తీసుకొస్తుంది. బ్యాంక్ ఎలా పని చేస్తుందో అదే విధమైన సర్వీసులను అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కనెక్టివిటీ ఇస్తోంది. వీటితోపాటు స్టార్టప్ కంపెనీలు కొనుగోలు చేయడం, ఉన్నవాటిలో పెట్టుబడులు పెట్టటం ద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోంది.
మెక్సికోలో కూడా క్రెడిట్, డెబిట్ కార్డులకు ప్రత్యామ్నాయంగా అమెజాన్ క్యాష్పేమెంట్ సర్వీసులను తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. కాగ, అమెరికాలో ప్రారంభించిన ఈ సర్వీసులకు అనూహ్య స్పందన వస్తోంది. సంప్రదాయ సర్వీసులను ఇది అందించనప్పటికీ, అమెరికా ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం అధికంగానే ఉంది. ఇప్పటికే మూడు కోట్ల మంది అమెరికన్లు బ్యాంకింగ్ వ్యవస్థకు దూరం అయ్యారు. ఈ వ్యవస్థపై నేషనల్ బ్యాంకులకు అమెరికా రెగ్యులేటర్ హెడ్ కెయిత్ నోరికా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సగం బ్యాంకులు, క్రెడిట్ యూనియన్లు, పెద్ద టెక్ కంపెనీలు ముప్పు ఎదుర్కోనున్నాయని అటు ఇన్ఫోసిస్ ఫైనాకిల్ సర్వే కూడా రిపోర్టు చేసింది. అయితే దీనిపై అమెజాన్ మాత్రం స్పందించడం లేదు.