‘సామాజిక’ విప్లవం!

Social media users grew by 150 percent in five years - Sakshi

ఐదేళ్లలో 150 శాతం పెరిగిన సోషల్‌ మీడియా యూజర్లు 

వినియోగదారుల సంఖ్యలో రెండో స్థానంలో భారత్‌ 

2015లో 15 కోట్ల మందే... ప్రస్తుతం 37 కోట్లమంది 

2023 నాటికి 48 కోట్లకు చేరవచ్చని అంచనా 

సోషల్‌ మీడియా వేదికల్లో ఫేస్‌బుక్‌దే అగ్రస్థానం 

సాక్షి, అమరావతి: దేశంలో సోషల్‌ మీడియా యువజోరుతో ఉరకలేస్తోంది. నగరాల నుంచి పల్లె ముంగిటికి ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడం, స్మార్ట్‌ఫోన్ల ప్రభంజనంతో ‘సామాజిక’ చైతన్యం అంతకంతకూ విస్తరిస్తోంది. దేశంలో ప్రస్తుతం దాదాపు 56 కోట్ల మంది ఇంటర్నెట్‌ వాడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొబైల్‌ డేటా ద్వారా స్మార్ట్‌ఫోన్లను ఎక్కడైనా వినియోగించుకునే సదుపాయం ఉండటంతో పల్లెల్లోనూ వీటి పట్ల మొగ్గు చూపుతున్నారు. గత ఐదేళ్లలో దేశంలో సోషల్‌ మీడియా యూజర్లు ఏకంగా 150 శాతం పెరగడం గమనార్హం. సోషల్‌ మీడియా వినియోగదారుల్లో అగ్రస్థానంలో చైనా, రెండో స్థానంలోభారత్‌ నిలిచాయి. ప్రముఖ మార్కెట్, వినియోగదారుల డేటా సర్వీస్‌ సంస్థ ‘స్టాటిస్టా’ తాజా నివేదికలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. 

‘సోషల్‌’ కింగ్‌.. ఫేస్‌బుక్‌  
సోషల్‌ మీడియా వేదికల్లో ఫేస్‌బుక్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. సోషల్‌ మీడియా వినియోగించే వారిలో 83.56 శాతం మంది ఫేస్‌బుక్‌లో చురుగ్గా ఉంటున్నారు. దీంతో పోలిస్తే మిగతా సామాజిక మాధ్యమాలు బాగా వెనుకబడి ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న ఇన్‌స్ట్రాగామ్‌ను కేవలం 6.51 శాతం మంది మాత్రమే అనుసరిస్తున్నారు. యూట్యూబ్, ట్విట్టర్‌ మొదలైన వేదికలు ఇంకా వెనుకబడి ఉన్నాయి. రానున్న రోజుల్లో సోషల్‌ మీడియా పరిధి మరింత పెరుగుతుందని, సమాచార సాధనాల్లో ప్రభావవంతమైన పాత్ర పోషించడం ఖాయమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.  

70 శాతం యువతే.. 
- ‘స్టాటిస్టా’ నివేదిక ప్రకారం 2015లో దేశంలో 15 కోట్లమంది సోషల్‌ మీడియా వాడకందారులు ఉండగా ఈ ఏడాది జనవరి నాటికి ఇది 37 కోట్లకు చేరుకుంది.  
2023 నాటికి దేశంలో సోషల్‌ మీడియా యూజర్ల సంఖ్య 48 కోట్లకు చేరవచ్చని అంచనా. 
సోషల్‌ మీడియా కొత్త యూజర్లలో దాదాపు 70 శాతం మంది 18 – 24 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం.  

‘సోషల్‌’ జోరు ఇలా  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top