చంద్రబాబు మాకు అన్యాయం చేస్తున్నారు..
నంద్యాలటౌన్/కోవెలకుంట్ల: ‘సుగాలి, ఎరుకల కులస్తులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. పట్టణాలకు దూరంగా అడవులు, కొండల్లో నివసిస్తూ దుర్భర జీవితం గడుపుతున్నారు. అలాంటి మాకు సీఎం చంద్రబాబు అన్యాయం చేస్తూ ఎస్టీ జాబితాలో వాల్మీకులను చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ఎస్టీ సంఘం నాయకులు గోపాల్నాయక్, హేమంత్ తదితరులు ఆదివారం ఎర్రగుడిలో వైఎస్ జగన్కు విన్నవించారు. ఇప్పటికీ చాలా తండాలకు రహదారులు, ఆస్పత్రులు లేవని, బోయలను తమతో పోల్చి రిజర్వేషన్లు ఇవ్వడం తగదన్నారు. గిరిజనులను అన్ని విధాలా ఆదుకోవాలని తుగ్గలి మండలం ఉప్పర్లపల్లెకు చెందిన గిరిజన సంఘం నేతలు బీమానాయక్ తదితరులు వైఎస్ జగన్ను కోరారు. బ్యాంకు పూచీకత్తు లేకుండా నేరుగా కార్పొరేషన్ల ద్వారా రూ.3 లక్షల చొప్పున రుణాలు ఇవ్వాలన్నారు. తమ పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య, ఆడపిల్లల పెళ్లిళ్లప్పుడు తల్లిదండ్రులకు రూ.2 లక్షలు నగదు ఇవ్వాలని, 500 జనాభా కలిగిన తండాలను రెవెన్యూ పంచాయతీలుగా ప్రకటించి అభివృద్ధి చేయాలని కోరారు.