ప్రొద్దుటూరు క్రైం : ఆర్టీపీపీకి డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్గా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేయడంపై ఎంవీఆర్ కుమారుడు మల్లేల రాజారాంరెడ్డి, రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్ మల్లేల ఝాన్సీరాణి హర్షం వ్యక్తం చేశారు. వారు లింగాపురంలోని వారి స్వగృహంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివంగత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి రాయలసీమ సమస్యలపై అనేక పోరాటాలు చేశారన్నారు. ఇందులో భాగంగానే 1985లో 21 రోజులు నిరాహార దీక్ష చేసిన ఫలితంగా నాటి ప్రభుత్వం రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేసిందన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటు వల్ల వేలాది మందికి ఉద్యోగాలు, పరోక్షంగా ఉపాధి లభించిందన్నారు. ఎంవీఆర్ పేరును ఆర్టీపీపీకి పెట్టడంపై ఎంవీఆర్ అభిమానులు, నాడు రాయలసీమ విమోచన సమితిలో పాల్గొని నిరాహార దీక్ష చేసిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఎంవీ రమణారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అరుదైన గౌరవంగా భావిస్తున్నామని వారు చెప్పారు.
అటవీ ఉద్యోగుల త్యాగాలు మరువలేనివి
కడప అర్బన్ : అటవీ ఉద్యోగులు చేసిన త్యాగాలు మరువలేనివని నాలుగవ జిల్లా అదనపు న్యాయమూర్తి దీనబాబు అన్నారు. రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కడపలోని డీఎఫ్ఓ కార్యాలయంలో అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలను వుంచి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కడప డీఎఫ్ఓ పి.వి సందీప్రెడ్డి, సోషల్ ఫారెస్ట్ డీఎఫ్ఓ గురుప్రభాకర్, స్క్వాడ్ డీఎఫ్ఓ నాగార్జునరెడ్డి, రేంజ్ అధికారులు, ఎఫ్బీఓలు, సిబ్బంది పాల్గొన్నారు.