అభిమాన నేత.. సంక్షేమ ప్రదాత.. కారుచీకట్లలో కాంతులు నింపుతూ.. వెలుగుల సూరీడై వచ్చిన జననేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి గోదావరి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా రోడ్ల వెంట బారులు తీరి నీరాజనాలు పలికారు. ఊరూవాడా గంటల తరబడి వేచిచూస్తూ పూలు చల్లి అభిమానం చాటారు. మనవడూ అంటూ అవ్వాతాతలు.. సోదరుడిగా భావించిన అక్కాచెల్లెమ్మలు.. భవితకు భరోసా ఇచ్చారంటూ విద్యార్థులు.. తమ ఇంట సంక్షేమ కాంతులు నింపారంటూ పిల్లాపెద్దలు.. మళ్లీ మీరే సీఎం కావాలంటూ నినదించారు. దారి పొడవునా వైఎస్సార్సీపీ జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లతో పార్టీ శ్రేణులు, అభిమానులు.. మేమంతా సిద్ధం అంటూ గొంతు కలిపారు. మంగళవారం ఏలూరు జిల్లా నారాయణపురంలో ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిడమర్రు, గణపవరం, ఉండి మీదుగా భీమవరం చేరుకుంది. అక్కడ భారీ బహిరంగ సభ అనంతరం గరగపర్రు, పిప్పర, దువ్వ మీదుగా తేతలి వరకు దిగ్విజయంగా సాగింది.