భీమవరం ప్రకాశంచౌక్ : రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళలకు క్యాన్సర్ పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే మహిళలకు క్యాన్సర్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కేంద్రంలో మహిళలకు గర్భాశయ ముఖ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ పరీక్షలు చేసి రోగ నిర్ధారణకు చర్యలు తీసుకుంటారని అన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మంజూరు చేయించి ఆసుపత్రి నిర్మాణానికి తమ కుటుంబం నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇచ్చిందన్నారు. వంద పడకల ఆసుపత్రి వినియోగంలోకి వచ్చిన వెంటనే, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని తల్లి బిడ్డల ఆసుపత్రిగా మార్చుతామని అన్నారు. ఈ ఆస్పత్రిలో జిల్లాలోనే ఎక్కువ శాతం డెలివరీలు నమోదు అవుతున్నాయని తెలిపారు. ప్రజల ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని, దీనిలో భాగంగానే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 3,500కి పైగానే వ్యాధులకు విస్తరింప చేశారన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరాస్వామి, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కొప్పర్తి వీర రాఘవులు, పేరిచర్ల సత్యనారాయణ రాజు, డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ గోవిందబాబు, డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ విజయ్, డాక్టర్ సిహెచ్ నాయుడు, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక క్రమశిక్షణతో
సహకార సంఘాలు బలోపేతం
సహకార సంఘాల స్టేట్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎల్ఎన్టీ శ్రీనివాస్
పోడూరు: ఆర్థిక క్రమశిక్షణతో సహకార సంఘాలు మరింత బలోపేతమవుతాయని సహకార సంఘాల స్టేట్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎల్ఎన్టి. శ్రీనివాస్ అన్నారు. కేంద్ర సహకార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిన్నూరు సొసైటీలో పాలకొల్లు, యలమంచిలి, నరసాపురం, మొగల్తూరు డీసీసీబీ బ్రాంచీల పరిధిలో సహకార సంఘాల అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన స్టేట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ సహకార సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, సిబ్బంది సమన్వయంతో సేవలందించడం ద్వారా సభ్యులకు నాణ్యమైన సేవలు అందించగలమన్నారు. నష్టాల్లో ఉన్న సహకార సంఘాల సభ్యుల అవసరాలు, అందుబాటులో ఉన్న వనరుల అంచనాతో క్రమబద్ధమైన వ్యాపార అభివృద్ధి, విస్తరణ ప్రణాళికను రూపొందించుకోవడం ద్వారా అభివృద్ధి సాధించాలన్నారు. జిన్నూరు సొసైటీ అధ్యక్షుడు డీటీడీసీ బాబు మాట్లాడుతూ తమ సొసైటీ సభ్యులు, సిబ్బంది కృషితో గత నాలుగేళ్లుగా నూరుశాతం వసూళ్లు సాధిస్తున్నామన్నారు. సొసైటీ గొడౌన్ నిర్మాణం నిమిత్తం తన సొంతస్థలం దాదాపుగా 12 సెంట్లు సొసైటీకి విరాళంగా ఇచ్చినట్లు వివరించారు. ఎస్ఎల్డీఓ ఎస్.శ్రీనివాసరావు మాట్లాడుతూ సహకార సంఘాల వ్యవస్థపై పీహెచ్డీ చేసిన స్టేట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ సలహాలు, సూచనలు పాటించడం ద్వారా సహకార సంఘాలు తమ వ్యాపార అభివృద్ధి, విస్తరణ, రుణ వసూళ్లలో పురోగతి సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆడిటర్లు జె.వెంకటేశ్వరరావు, విజయశ్రీ, ఆనందరాజు, జిన్నూరు సొసైటీ సీఈఓ పెచ్చెట్టి రామకృష్ణ, సహకార సంఘాల అధ్యక్షులు, సీఈఓలు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
గణపవరం: కళాశాల నుంచి ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. గణపవరం ఎస్సై వి.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. గణపవరం మండలం వరదరాజపురం గ్రామానికి చెందిన మన్నే వెంకటదుర్గారావు (18) పెంటపాడులోని గోయెంకాలో ఇంటర్ చదువుతున్నాడు. ఈ నెల 9 రాత్రి కళాశాల నుంచి ఇంటికి వస్తుండగా పిప్పర కల్యాణమండపం వద్ద మరో మోటార్ సైకిలిస్టు వేగంగా వచ్చి ఢీకొనడంతో దుర్గారావు తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.