ఆటో నడిపే మహిళలను మరింత మంది స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ కోరారు. ఆయన గురువారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లాలోని మహిళలకు ఉన్నతి యూనిట్ ద్వారా అందించిన 13 ఆటో రిక్షాలను జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా ఆటో రిక్షాల తాళాలను మహిళా లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించారు. పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) ఉన్నతి కార్యక్రమంలో నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ మహిళలకు వడ్డీ లేని రుణంతో ‘మహిళా శక్తి పథకం’లో ఆటో రిక్షాలు అందజేస్తోందన్నారు. జిల్లాలో మొత్తం 13 మండలాలకు సంబంధించి 13 మంది లబ్ధిదారులు వీటి ని అందుకున్నారని తెలిపారు. బజాజ్ కంపెనీ ఆటోలు–10, అపే కంపెనీ ఆటోలు–3 ను లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నారని, వీరికి వడ్డీ లేని రుణం ఉన్నతి ద్వారా అందించారని పేర్కొన్నారు. 48 వా యిదాల్లో అప్పు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.