కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. కదిరి పరిసర ప్రాంతాల నుంచే కాకుండా చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాలు, కర్ణాటక నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఖాద్రీశా తమను చల్లగా చూడు స్వామీ అంటూ వేడుకున్నారు.
పండ్ల తోటల పెంపకానికి
దరఖాస్తుల ఆహ్వానం
పుట్టపర్తి: ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉద్యాన పంటలు సాగు చేసుకునే రైతులకు ఉచితంగా పండ్ల మొక్కలు అందించనున్నట్లు ఏపీఓ రామకృష్ణారెడ్డి తెలిపారు. జాబ్కార్డు కలిగి ఉన్న సన్న, చిన్నకారు రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. పండ్ల మొక్కలు అందించటంతో పాటు మూడేళ్లపాటు వాటి నిర్వహణ కోసం రైతుకు డబ్బులు చెల్లిస్తామని తెలిపారు. మామిడి, చీనీ, జీడి మామిడి, నిమ్మ, జామ, తైవాన్ జామ, సపోట, కొబ్బరి, సీతాఫలం, దానిమ్మ, నేరేడు, చింత, రేగు, డ్రాగన్ ప్రూట్తో పాటు గులాబీ, మల్లె పూల తోటల పెంపకానికి ఈ పథకం కింద ప్రోత్సాహకాలందిస్తున్నట్లు వివరించారు. ఆసక్తి కలిగిన వారు ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
సజావుగా
‘సప్లిమెంటరీ’ పరీక్షలు
పుట్టపర్తి: జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు రెండోరోజు శనివారం సజావుగా జరిగాయని విద్యా శాఖాధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని డీవీఈఓ రఘునాథరెడ్డి, డీఈఓ మీనాక్షి తెలిపారు.