![గాలీవ](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/26/25mdks801b-110077_mr.jpg.webp?itok=nGV8EJG_)
పావగడ: తాలూకా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి గాలి వాన బీభత్సం సృష్టించింది. తాలూకా లోని లింగదహళ్లి, సాసలకుంటె, మల్లమ్మనహళ్లి, పోలేనహళ్లి గ్రామాల ప్రధాన రహదారిపై విద్యుత్ స్తంభాలు కూలి పోయాయి. లింగదహళ్లి, సాసలకుంటె గ్రామాల్లో రైతులు వీరాంజనేయ, భద్రావతి అంజినప్ప, పాపన్నకు చెందిన తోటల్లో అధిక సంఖ్యలో వక్క చెట్లు నేలకూలాయి. కొన్ని వక్క చెట్లు రహదారిపై పడి పోవడంతో వాహన రాకపోకలు నిలిచి పోయాయి. కాగా మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షం తో 150 వక్క తోటల్లో వందలాది వక్క చెట్లు నేల రాలి లక్షలాది రూపాయల ఆస్తి నష్టం తో అల్లాడిపోయిన అరసికెరె గ్రామం ఇంకా తేరుకోక ముందే సాసలకుంటె, పోలేనహళ్లి గ్రామాల్లో వరుణుడు మరో బీభత్సాన్ని సృష్టించాడు. శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ప్రారంభమైన వర్షం రాత్రి 12 గంటల వరకు ఏకధాటిగా కురిసింది. దీంతో సాసలకుంటె గ్రామంలో వంకలు పారాయి. అయితే గాలి వాన దెబ్బకు పోలేనహళ్లిలో కోళ్లఫారం షెడ్డు రేకులు పూర్తిగా ఎగిరి పోయి షెడ్డు లో ఉన్న 1,500 కోడి పిల్లలు మృత్యువాత పడ్డాయి. రూ.లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోళ్ల షెడ్డు యజమాని ఈశ్వర్ కోరాడు.
పోలేనహళ్లిలో షెడ్డు కూలి
1,500 కోడి పిల్లల మృతి
![గాలీవాన బీభత్సం](/sites/default/files/gallery_images/2024/05/26/25mdks801-110077_mr.jpg)
గాలీవాన బీభత్సం