దుబ్బాక : భవనం పైనుంచి పడి బైక్ మెకానిక్ మృతి చెందిన ఘటన దుబ్బాక పట్టణంలోని చోటు చేసుకుంది. దుబ్బాక ఎస్సై గంగరాజు కథనం మేరకు.. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ 3వ వార్డుకు చెందిన పోతరాజు లింగం (37) గ్రామంలో బైక్ మెకానిక్ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. 3 నెలల కిందట లింగం దుబ్బాక ఆర్టీసీ బస్ డిపోలో టైర్ మెకానిక్గా పనిలో చేరాడు. 15 రోజుల నుంచి దుబ్బాకలోని గుండ్ల హరికృష్ణ ఇంట్లో మొదటి అంతస్తులో కిరాయికి ఉంటున్నాడు. ఆదివారం అర్థరాత్రి లింగం ఇంట్లోని చెత్తను తాను ఉంటున్న అంతస్తు నుంచి కిందికి పడేసే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన భార్య ఇంటి యజమాని సాయంతో దుబ్బాకలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య వేద శ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.