సంగారెడ్డి టౌన్ : మున్సిపాలిటీలలో ఫిబ్రవరి నెలాఖరులోగా వంద శాతం పన్ను వసూళ్లు జరగాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి మున్సిపల్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఆస్తి, ట్రేడ్ లైసెన్సు, నల్లా బిల్లులు వసూలు పూర్తి చేయాలని సూచించారు. మొండి బకాయిలపై కమిషనర్లు ప్రత్యేక దృష్టి సారించాలని, పనితీరు సరిగాలేని బిల్ కలెక్టర్ల పై చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీలలో ఫుట్ పాత్లు, జంక్షన్లలో ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటుకు అనుమతించవద్దన్నారు. పారిశుధ్య నిర్వహణ, పబ్లిక్ టాయిలెట్స్ను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కబ్జాలు, అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వీధి వ్యాపారుల కోసం అవసరమైన చోట స్ట్రీట్ వెండింగ్ జోన్ను ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతిరోజూ ఇంటింటి చెత్త సేకరణ వంద శాతం జరగాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్లు, పబ్లిక్ హెల్త్ ఈఈ, డీఈలు, ఆర్ఐలు పాల్గొన్నారు.