పార్టీకి మీరే బలం... బలగం | Sakshi
Sakshi News home page

పార్టీకి మీరే బలం... బలగం

Published Thu, Mar 23 2023 1:36 AM

harish rao Teleconference with BRS public representatives - Sakshi

సిద్దిపేటజోన్‌: బీఆర్‌ఎస్‌ క్యాడర్‌కు ఉగాది శుభాకాంక్షలు....ఉగాది పచ్చడి లెక్క మీ జీవితం షడ్రుచుల సంగమంలా ఉండాలి. అందరికీ శుభం కలగాలి. బీఆర్‌ఎస్‌కి మీరే బలం... బలగం అని రాష్ట్ర, ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. బుధవారం రాత్రి నియోజకవర్గ పరిధిలోని బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారి సంప్రదాయాలకు ప్రతిరూపం ఉగాది అని, ఏడాది అంతా మనకు మంచి జరగాలని ఆకాంక్షించారు.

సిద్దిపేట నాడు తెలంగాణ ఉద్యమంలో నేడు రాష్ట్ర ప్రగతిలో అగ్ర స్థానంలో ఉందన్నారు. ఇది మీ అందరి భాగస్వామ్యంతోనే సాధ్యమైందని పేర్కొన్నారు. మీ సహకారం, భాగస్వామ్యం ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. స్వ రాష్ట్రంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య మీరు వారధి లెక్క పనిచేశారని అభినందించారు. త్వరలో తేదీల వారిగా గ్రామాల్లో షెడ్యూల్‌ చేసుకొని ఆత్మీయ సమావేశాలు అద్భుతంగా నిర్వహించుకుంద్దామని పేర్కొన్నారు. ప్రభుత్వం సాధించిన విజయాలు, పథకాలు, సంక్షేమం గూర్చి ప్రజలకు వివరించి, నాటి, నేటి పరిస్థితులను ప్రజలకు వివరించి చైతన్యవంతులను చేయాలని సూచించారు.

కరువు నియోజకవర్గంగా ఉండే సిద్దిపేట నేడు అద్భుతమైన ప్రగతి సాధించిన విషయాన్ని పల్లెపల్లెల్లో చెప్పాలన్నారు. సిద్దిపేటకు రైలు, గోదారి జలాలు, సిద్దిపేట జిల్లా అనే ట్యాగ్‌ లైన్‌ ఉండేదని అది సాధ్యం చేసుకున్నామన్నారు. జిల్లా సాధించి, గోదారి నీటితో బీడు భూముల్లో సాగు చేస్తూ, త్వరలో రైలు కూడా రానుందన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో జెడ్పీ చైర్మన్‌ రోజాశర్మ, సుడా చైర్మన్‌ రవీందర్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మంజుల రాజనర్స్‌, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌లు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement