● ఎస్పీ అఖిల్ మహాజన్ ● ఇల్లంతకుంట పీఎస్ ఆకస్మిక తనిఖీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఎన్నికల సమయంలో సోషల్మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఎస్పీ అఖిల్మహాజన్ సూచించారు. ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన ‘ఇల్లంతకుంటలో సోషల్మీడియా వార్’ కథనానికి స్పందించి ఇల్లంతకుంట పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నందునా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్మీడియా వేదికగా వివిధ వర్గాల మధ్య, వ్యక్తుల మధ్య అల్లర్లు సృష్టించే వారిపై, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పోస్టులు పెట్టే వారిపై దృష్టి పెట్టాలన్నారు. గ్రూప్ అడ్మిన్లపై కేసులు నమోదు చేయాలని సూచించారు. అనంతరం ఠాణా పరిధిలోని ఇల్లంతకుంట, కందికట్కూర్, గాలిపెల్లి, అనంతారం, పెద్దలింగాపూర్ గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను సందర్శించి పలు సూచనలు చేశారు. సిరిసిల్ల డీఎస్పీ ఉదయ్రెడ్డి, ఇల్లంతకుంట ఎస్సై దాస సుధాకర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.