గుడివాడ టౌన్: జగనన్న పేదల ఆత్మ బంధువు అని ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరారవు (నాని) అన్నారు. గుడివాడ 11వ వార్డులో సోమవారం ముస్లిం మైనార్టీ సంచార జాతులకు కుల ధ్రువీకరణ బీసీ (ఈ) సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలను గుర్తించి వారికి సమాజంలో మెరుగైన స్థానం కల్పించిన ఘనత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికే దక్కుతుందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముస్లిం మైనార్టీలు వెనుకబడి ఉన్నారని గుర్తించి నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించి వారి బంగారు భవిష్యత్కు బాటవేశారని చెప్పారు. ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి మరో అడుగు ముందుకు వేసి ముస్లింలలో ఒక వర్గమైన సంచారజాతులు (ఫకీరు) లను గుర్తించి వారికి కార్పొరేషన్ ఏర్పాటుచేయడంతో పాటు రాజకీయ గుర్తింపు తెచ్చి రిజర్వేషన్లో వాటా కల్పించారని పేర్కొన్నారు. అందులో భాగంగా వారిని బీసీఈ గా గుర్తించి కుల ధ్రువీకరణ పత్రాలు పొందే వెసులుబాటు కల్పించారన్నారు. 22 మంది ముస్లిం మైనార్టీలకు బీసీఈ సర్టిఫికెట్లు అందించామని వెల్లడించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మంచినీటి సమస్య పరిష్కారానికి పట్టణంలో 100 ఎకరాలు కొంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి నందివాడ మండలం జనార్ధనపురంలో 110 ఎకరాలు కొనుగోలు చేశారని వివరించారు. ఇవి కాక టిడ్కో ఇళ్లు నిర్మాణం చేపట్టి 74 ఎకరాలు, జగనన్న కాలనీ కోసం 180 ఎకరాలు, గుడ్లవల్లేరులో 30 ఎకరాలతో కలిపి మొత్తం నియోజకవర్గంలో ప్రజల అవసరాలకు 625 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ఘనత తండ్రీ కొడుకులకే దక్కుతుందన్నారు. త్వరలోనే అన్ని రోడ్లు మరమ్మతులు చేసి అవసరమైన చోట పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బందరు ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని), తహసీల్దార్ కె.ఆంజనేయులు, వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, సీనియర్ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పాలేటి చంటి, పాలడుగు రామ్ప్రసాద్, ఎంవీ నారాయణరెడ్డి, సంచారజాతుల కార్పొరేషన్ రాష్ట్ర డైరక్టర్ షేక్ సయ్యద్, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు.