![పునఃప్రారంభం నాటికి వసతులు కల్పించాలి](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/25/24nrl201-340114_mr.jpg.webp?itok=YhYg3cIU)
● టీయూటీఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.మురళీమనోహర్రెడ్డి
నిర్మల్రూరల్: గత ప్రభుత్వంలా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయకుండా, పాఠశాలల పునఃప్రారంభం నాటికి వసతులు కల్పించాలని, విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్)రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.మురళీమనోహర్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో శుక్రవారం మాట్లాడారు. మూతపడిన పాఠశాలలను తెరిపించాలని, అన్ని పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, మన ఊరు – మన బడి పథకంలో చేపట్టిన పనులు త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని కోరారు. వారి స్థానంలో రెగ్యులర్ ఉపాధ్యాయులు వచ్చే వరకు విద్యావలంటీర్లను నియమించాలన్నారు. బదిలీలు పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని, ప్రతీ పాఠశాలకు ఒక పారిశుధ్య కార్మికుడు, ఒక నైట్ వాచ్మెన్ను నియమించాలన్నారు. సమావేశంలో సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోడిశెట్టి రవికాంత్, వహీద్ఖాన్, జిల్లా కోశాధికారి పోల ధర్మరాజ్, ఎ.లక్ష్మీప్రసాద్రెడ్డి, వివిధ మండలాల బాధ్యులు మొయిజుద్దీన్, మతీన్, లక్ష్మారెడ్డి, కరిపె శివప్రసాద్ పాల్గొన్నారు.