సాధారణ ప్రసవాలకే
ప్రాధాన్యమివ్వాలి
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలకే అధిక ప్రాధాన్యమివ్వాలి. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు ఆదేశాలిచ్చాం. అయినా అనేక ఆస్పత్రుల్లో వైద్యుల తీరు మారలేదు. అత్యవసరమైతేనే సిజేరియన్ పోవాల్సి ఉంటుంది. దీనిపై జిల్లా వ్యాప్తంగా నిఘా ఏర్పాటు చేశాం.నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్ ప్రాధాన్యమిస్తున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే అనుమతులను రద్దు చేస్తాం.
– డాక్టర్ అనిమళ్ల కొండల్రావు, డీఎంహెచ్ఓ
నల్లగొండ టౌన్ : ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యుల తీరు మారడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు కేవలం డబ్బు సంపాదించడమే లక్ష్యంగా.. ప్రజల అమాకత్వాన్ని ఆసరాగా తీసుకుని రూ.కోట్ల కొల్లగొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణ ప్రసవాలకే అధిక ప్రాధాన్యమివ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నా వారి తీరులో మార్పు రావడం లేదు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు కేవలం సిజేరియన్కే అధిక ప్రాధాన్యమిస్తూ ప్రజలు జీవితాలతో చెలగాటమాడుతున్నారు. కేవలం డబ్బుల కోసమే సిజేరియన్ను చేస్తూ లక్షలాది రూపాయలను ఫీజుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు ఉండడంతో పాటు సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యమిస్తుండడంతో చాలా మంది ప్రసవాల కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవాల కోసం చేరుతున్న వారి సంఖ్య బాగా తగ్గింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు వచ్చిన వారిలో 80 శాతం మందికి సిజేరియన్ చేస్తూ.. కేవలం 20 శాతం మందికి మాత్రమే సాధారణ ప్రసవాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇక, మరికొన్ని ఆస్పత్రులైతే కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా నూటికి నూరుశాతం సిజేరియన్లు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, అధునిక వైద్య పరికరాలు సమకూర్చడంతో పాటుగా ఎంసీహెచ్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు అందిస్తోంది. దాంతో పాటు ఆశ వర్కర్లు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు.. గర్భిణులు ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పులు చేయించుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. 102 వాహనాల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకుపోయి కాన్పు తరువాత తల్లీబిడ్డను క్షేమంగా ఇంటికి వద్ద వదిలి వస్తున్నారు. ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు తల్లుల బ్యాంకు ఖాతాల్లో చేస్తున్నారు. కానీ, కొందరు గర్భిణులు మాత్రం మూఢనమ్మకాలు, పుట్టిన రోజు ఘడియలు, పురిటినొప్పులు భయంతో సిజేరియన్లు చేయించుకుంటున్నారు. వారి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు ఎక్కువ శాతం సిజేరియన్లు చేస్తూ అమాయకుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకుంటే తప్ప సాధారణ ప్రసవాలు పెరిగే అవకాశం ఉండదని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.
ఫ సిజేరియన్కే ప్రాధాన్యమిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు
ఫ నార్మల్ డెలివరీలకు అవకాశం ఉన్నా పట్టించుకోని తీరు
ఫ కాసులకు కక్కుర్తి పడుతున్న కొందరు ప్రైవేట్ వైద్యులు
2023 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు
జరిగిన ప్రసవాలు ఇలా..
ఆస్పత్రులు సాధారణ సిజేరియన్ మొత్తం
ప్రభుత్వ 6,424 6,647 13,073
ప్రైవేట్ 1,813 7,890 9,703