ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యువకులే అధిక సంఖ్యలో పోటీలో ఉన్నారు. 25 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు వయస్సు వారు 23 మంది ఉండగా.. 31 నుంచి 40 ఏళ్ల లోపు వారు 120 మంది ఉన్నారు. మిగతా వారు 41 ఏళ్లకుపై వయసు వారు. పోటీలో నిలిచిన అభ్యర్థుల్లో ఆలేరు నుంచి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్న నుచ్చు శివకుమార్ అత్యంత పిన్న వయస్కుడు. ఇతని వయసు 26 ఏళ్లు.
తొలిసారి బరిగీసి..
ఉమ్మడి జిల్లాలో బరిలో నిలిచిన వారిలో ఎక్కువ మంది తొలిసారి పోటీ చేస్తున్న వారే. వీరిలో చాలా మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. తొలిసారి బరిలో నిలిచిన వారు 12 నియోజకవర్గాల్లో 188 మంది ఉన్నారు. ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఉన్నారు.
బరిలో 72 మంది గ్రాడ్యుయేట్లు
బరిలో ఉన్న అభ్యర్థుల్లో డిగ్రీ పూర్తయిన వారు 72 మంది ఉన్నారు. ప్రోస్టు గ్రాడ్యుయేట్లు కూడా ఉన్నారు. సాంకేతిక విద్యనభ్యసించిన వారు 22 మంది ఉన్నారు. పదో తరగతి పూర్తయిన వారు 33 మంది ఉన్నారు. పీహెచ్డీ పూర్తయిన వారు 9 మంది ఉండడం విశేషం. మిగతా వారు పదో తరగతి లోపు చదివిన వారు ఉన్నారు.
పోటీలో వ్యాపారులే అధికం
అసెంబ్లీ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది వివిధ వ్యాపారాలు చేస్తున్న వారు ఉన్నారు. వీరి తర్వాత వ్యవసాయదారులు ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో వ్యాపారులు 49 మంది ఉండగా.. వ్యవసాయం చేసే వారు 38 మంది ఉన్నారు. మిగతా వారు కాంట్రాక్టర్లుగా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. కొందరు నిరుద్యోగులు, గృహిణులు కూడా బరిలో నిలిచారు.