జోగుళాంబ శక్తిపీఠం: అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయాలు గురువారం భక్తులతో కిక్కిరిశాయి. వైశాఖ మాసం అందులో పౌర్ణమి కలిసిరావడంతో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీ తగ్గలేదు. బాల్రబహ్మేశ్వరుడికి ఏకవార రుద్రాభిషేకాలు చేశారు. అమ్మవారి ఆలయంలో ఉదయం సాయంత్రం కుంకుమార్చనలు, త్రిశతి, ఖడ్గమాల వంటి అర్చనలు చేశారు.
ఆలయంలో చండీహోమాలు
జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి రోజులలో భక్తుల చేత సామూహిక చండీహోమాలు చేయిస్తుంటారు. గురువారం వైశాఖ పౌర్ణమి కలిసి రావడంతో భక్తులు అధిక సంఖ్యల తరలివచ్చారు. 114 మంది ఈ హోమాలలో పాల్గొన్నట్టు ఈఓ పురేందర్కుమార్ తెలిపారు. చండీహోమాల ద్వారా ఆలయానికి రూ.1.14లక్షల ఆదాయం చేకూరినట్లు దేవస్థానం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఆలయాన్ని దర్శించుకున్న ప్రముఖులు
ఆలయాలను పలువురు ప్రముఖులు కూడా దర్శించుకున్నారు. విజయవాడ సీనియర్ సివిల్ జడ్జి భవాని, గద్వాల అదనపు కలెక్టర్ మాసాని వెంకటేశ్వర్లు, నంద్యాల అడిషనల్ ఎస్పీ ప్రవీణ్కుమార్, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రథాప్రెడ్డి, రాయచూరు ఎమ్మెల్యే బసన్నగౌడ దద్దాల్, ప్రముఖ సింగర్ మంగ్లి ఆలయాల్లో పూజలు చేశారు.
ఆలయాన్ని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
చండీహోమానికి హాజరైన భక్తులు