తెలకపల్లి: నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలోని పర్వతాపూర్లో బుధవారం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు కంది సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం జాతీయ ఆహార భద్రతా పథకం (ఎన్ఎఫ్ఎస్ఎం) ఆర్థిక సహకారంతో పాలెం కేవీకే దత్తత గ్రామాలైన పర్వతాపూర్, వసంతాపూర్, తుర్కపల్లిలలో దిగుబడిని ఇచ్చే నూతన రకం ఉజ్వల పీఆర్ఆర్ 176 విత్తనాలను 3కిలోల చొప్పున 100 మంది రైతులకు అందించినట్లు తెలిపారు. ఈ పంట మధ్యస్థ కాలం కలిగి అధిక దిగుబడి ఇస్తుందన్నారు. డాక్టర్ బి.రాజశేఖర్ మాట్లాడుతూ పంటసాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడి వస్తుందని తెలిపారు. అనంతరం తెగుళ్ల నివారణ, యాజమాన్య పద్ధతులపై కీటక శాస్త్రవేత్త డా. శైలజ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త డా. లావణ్య, ఏఈఓ భార్గవ్ సాగర్, రైతులు శివ, నారాయణ, నర్సింహ, రాజేష్ పాల్గొన్నారు.
పంటల నిల్వలో జాగ్రత్తలు పాటించాలి
మదనాపురం: పంటల నిల్వలో జాగ్రత్తలు పాటించాలని ఎన్ఐపీహెచ్ఎం డైరెక్టర్ డా. మర్యాదాసు రైతులకు సూచించారు. వనపర్తి జిల్లా మదనాపురంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం జాతీయ మొక్కల ఆరోగ్య పరిరక్షణ కేంద్రం వారి సహకారంతో రైతులకు జాతీయ గిడ్డంగుల వినియోగం, పంటల నిల్వల్లో వ్యాపించే చీడ పురుగులపై అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లోని గిడ్డంగులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆహార ధాన్యాల నిల్వల్లో ఆశించే కీటకాలను అరికట్టేందుకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో కేవీకే హెడ్ దాదాసాహెబ్ కొగారే, శాస్త్రవేత్తలు అనిల్కుమార్, రాజేందర్రెడ్డి, సురేష్కుమార్, మార్కెట్ సిబ్బంది జయలక్ష్మి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.