![No Headline](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/21/20jgn252-330002_mr.jpg.webp?itok=2ztp_5Xb)
బచ్చన్నపేట : సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. అమాయకులను ఆసరా చేసుకుని క్షణాల్లో డబ్బును మాయం చేస్తున్నారు. ఇలాంటి ఘటన మండలంలోని నారాయణపురంలో రెండు రోజుల క్రితం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొండం మధు జనగామలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రుణం తీసుకున్నాడు. ప్రతి నెల రుణవాయిదా చెల్లించడానికి తన ఖాతాలో డబ్బు జమ చేస్తున్నాడు. ఈ క్రమంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికారులు ఖాతాదారుడు దరఖాస్తు చేసుకోకుండానే ఏప్రిల్14న క్రెడిట్ కార్డును పోస్టులో ఇంటికి పంపించి ఆ కార్డును యాక్టివ్ చేసుకోవడానికి బ్యాంకుకు రావాలని పలుమార్లు ఫోన్ చేశారు. కానీ ఖాతాదారుడు మధుకు ఆ కార్డు ఇష్టం లేక బ్యాంకుకు వెళ్లలేదు. అదే నెల 24వ తేదీన మళ్లీ బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని క్రెడిట్ కార్డును యాక్టివ్ చేయడానికి ఓటీపీ పంపించామని తెలుపమని కోరగా మధు ఫోన్లో ఆ ఓటీపీ చెప్పాడు. ఈ నెల 14న ‘మీరు క్రెడిట్ కార్డు ద్వారా రూ.28,500 విలువైన షాపింగ్ చేశారని, ఆ డబ్బును సకాలంలో చెల్లించాలని’ మెసేజ్ రావడంతో బాధితుడు లబోదిబోమంటూ బ్యాంకుకు వెళ్లాడు. అక్కడ బ్యాంకు అధికారులు తమకేమీ తెలియదంటూ సమాధానం ఇవ్వగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.