కర్నూలు(అగ్రికల్చర్): ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఉష్ణోగ్రతలు 47.7 డిగ్రీలకు చేరాయి. ఆ తర్వాత వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఇటు కర్నూలు, అటు నంద్యాల జిల్లాలో ఆశాజనకంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల వల్ల ఉమ్మడి జిల్లాలో పలు చెరువులకు భారీగా నీరు వచ్చింది. హంద్రీ కూడా ప్రవహించింది. ఈ కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సోమవారం రాత్రి ఓర్వకల్లులో 56 మి.మీ వర్షపాతం నమోదైంది. మంగళవారం కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి. కర్నూలు జిల్లా కౌతాళంలో అత్యధికంగా 39.4 డిగ్రీలు, అత్యల్పంగా తుగ్గలిలో 35.5 డిగ్రీలు, నంద్యాల జిల్లా ఆత్మకూరులో అత్యధికంగా 39.9, అత్యల్పంగా బేతంచెర్లలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో వివిధ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇందువల్ల ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉంది.
మధ్యవర్తిత్వం ద్వారా
కేసుల పరిష్కారం
కర్నూలు (లీగల్) : మధ్యవర్తిత్వ చట్టం ద్వారా కేసులకు 90 రోజుల్లో పరిష్కరించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి పేర్కొన్నారు. మంగళవారం మధ్యవర్తిత్వ చట్టంపై న్యాయసేవ సదన్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాట్లాడు తూ మధ్యవర్తులుగా అర్హ త పొందిన న్యాయవాదులకు 40 గంటల పా టు మధ్యవర్తిత్వ చట్టంపై శిక్షణ ఇస్తామన్నారు. అనంతరం మధ్యవర్తిత్వులుగా నియ మిస్తామన్నారు. శాశ్వత లోక్ అదాలత్ అధ్యక్షులు ఎం.వెంకట హరినాథ్, బార్ ప్రెసిడెంట్ బి.కృష్ణమూర్తి, జనరల్ సెక్రటరీ రవికాంత్ ప్రసాద్, న్యాయవాదులు పాల్గొన్నారు.
పలు రైళ్లు రద్దు
నంద్యాల (సిటీ): రైల్వే లైన్ డబ్లింగ్ పనులు, సాంకేతిక కారణాలతో రైల్వే అధికారులు గుంటూరు డివిజన్ పరిధిలోని పలు రైళ్లను రద్దు చేశారు. గుంటూరు నుంచి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన పలు రైళ్లను ఈ నెల 16 నుంచి జూన్ 1వ తేదీ వరకు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు చీఫ్ ప్యాసింజర్ ట్రాఫికింగ్ మేనేజర్ ఏ.సురేష్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరు, గుంతకల్లు మధ్య నడి చే రైళ్లలో గుంటూరు – కాచిగూడ, కాచిగూడ – గుంటూరు (17251/17252), హుబ్లీ–విజయవాడ, విజయవాడ – హుబ్లీ 17329/17330 నంబర్ రైళ్లు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వివరించారు.
నేటి నుంచి ఎమ్మిగనూరు విద్యుత్ లైన్ సామర్థ్యం పెంపు పనులు
కర్నూలు(అగ్రికల్చర్): పెరుగుతున్న విద్యు త్ లోడు, భవిష్యత్ అవసరాల దృష్టా కర్నూలు కార్బైడ్లో 220 కేవీ సబ్ స్టేషన్ నుంచి ఎమ్మిగనూరు లైన్ సామర్థ్యాన్ని పెంచనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు నేటి నుంచి ప్రారంభం కానున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ ఉమాపతి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 132 కేవీ గూడూరు, 132 కేవీ ఎమ్మిగనూరు, 132 కేవీ మాధవరం లైన్లను పాత ఏసీఎస్ఆర్ కండక్టర్ స్థానంలో అధిక సామర్థ్యం ఉన్న ఏసీఎస్ఎస్ కండక్టరును మార్పు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 2 వరకు పనులు జరుగుతాయని పేర్కొన్నారు. పనులు జరిగే సమయంలో ఎప్పుడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే రైతులు, వినియోగదారులు సహకరించాలని కోరారు. ఎమ్మిగనూరు విద్యుత్ లైన్ సామర్థ్యం పెంపుతో రానున్న రోజుల్లో వ్యవసాయానికి మరింత నాణ్యమైన విద్యుత్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
భారీగా నగదు పట్టివేత
కర్నూలు : స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తనిఖీల్లో ఆధారాలు లేని నగదు పట్టుబడింది. కర్నూలు శివారులోని పంచలింగాల అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు వద్ద సెబ్ ఎస్ఐ పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం వాహన తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ వైపు నుంచి కర్నూలుకు వస్తున్న ఓ కారును ఆపి తనిఖీ చేయగా భారీగా నగదు బయటపడింది. అందులో ఉన్న డ్రైవర్తో పాటు యజమాని వనపర్తికి చెందిన వెంక టేష్ను విచారించగా కర్నూలులోని షరాఫ్బజార్లో ఉన్న ఓ దుకాణంలో బంగారు కొనుగోలుకు వెళ్తున్నట్లు తెలిపారు. అయితే, డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఏఈఎస్ వినోద్కుమార్ చెక్పోస్టు వద్దకు చేరుకుని కౌంటింగ్ మిషన్ తెప్పించి డబ్బులు లెక్కపెట్టారు. దాదాపు రూ.35,70,000 లక్షలుండటంతో జీరో వ్యాపారిగా అధికారులు అనుమానిస్తున్నారు.