● ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జాతీయ కార్యదర్శి అక్కినేని వనజ
నంద్యాల(న్యూటౌన్): కేంద్ర ప్రభుత్వ విధానాలపై మహిళలు ఐక్యంగా పోరాటం చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జాతీయ కార్యదర్శి అక్కినేని వనజ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రం నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య 15వ రాష్ట్ర మహాసభలను నిర్వహించారు. ముందుగా టెక్కె మార్కెట్యార్డు నుంచి శ్రీనివాస సెంటర్ మీదుగా మున్సిపల్ టౌన్హాల్ ఆవరణ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభలో అక్కినేని వనజ మాట్లాడుతూ దేశంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా నిరోధించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. పార్లమెంట్పై ఉన్న ప్రేమ మహిళా బిల్లు చట్టబద్ధత కల్పించటంలో విఫలమైందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా భవానీ, జయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరం చేస్తే ఊరుకునేది లేదన్నారు. 30 దేశాల్లో 28 శాతం మహిళలు పరిపాలనను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. 2024 ఎన్నికల్లోపు మహిళా బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరవు నివారించి ఆహార భద్రత కల్పించాలన్నారు. మహిళా సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకురాళ్లు విమల, సంధ్యారాణి, పద్మావతి, సుగుణమ్మ, జయలక్ష్మి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు, గిడ్డయ్య, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్బాబు, సీపీఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు తదితరులు పాల్గొన్నారు.